శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 39.4 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం టీమిండియా ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో సిరీస్‌ను కూడా టీమిండియా 2-0 తేడాతో గెలుచుకుంది.


216 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మొదటి 10 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (17: 21 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్), శుభ్‌మన్ గిల్ (21: 12 బంతుల్లో, ఐదు ఫోర్లు), విరాట్ కోహ్లీ (4: 9 బంతుల్లో, ఒక ఫోర్) విఫలం అయ్యారు. శ్రేయస్ అయ్యర్ (28: 33 బంతుల్లో, ఐదు ఫోర్లు) ఉన్నంతలో కాసేపు జట్టును ఆదుకున్నా అతను కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేదు. దీంతో 86 పరుగులకే టీమిండియా నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది.


అనంతరం కేఎల్ రాహుల్ (64 నాటౌట్: 103 బంతుల్లో, ఆరు ఫోర్లు), హార్దిక్ పాండ్యా (36: 53 బంతుల్లో, నాలుగు ఫోర్లు) జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 75 పరుగులు జోడించారు. ఆ తర్వాత హార్దిక్‌ను అవుట్ చేసి కరుణరత్నే ఈ భాగస్వామ్యాన్ని విడదీసినప్పటికీ అప్పటికే భారత్ లక్ష్యానికి 55 పరుగుల దగ్గరకి వచ్చేసింది. హార్దిక్ పాండ్యా తర్వాత అక్షర్ పటేల్ (21: 21 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) కూడా అవుటైనా కేఎల్ రాహుల్ చివరి వరకు క్రీజులో ఉండి జట్టును గెలిపించాడు.


అంతకు ముందు టాస్‌ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. టీమ్‌ఇండియాకు భారీ టార్గెట్‌ ఇవ్వాలనుకుంది. అందుకు తగ్గట్టే ఓపెనర్లు అవిష్క ఫెర్నాండో (20), నువనిదు ఫెర్నాండో (50) దూకుడుగా ఆడారు. చక్కని బౌండరీలతో అలరించారు. ఆరో ఓవర్‌ చివరి బంతికి అవిష్కను క్లీన్‌బౌల్డ్‌ చేసిన సిరాజ్‌ ఈ జోడీని విడదీశాడు. ఆపై కుశాల్‌ మెండిస్‌ అండతో నువనిదు రెచ్చిపోయాడు. 62 బంతులో హాఫ్‌ సెంచరీ బాదేశాడు. రెండో వికెట్‌కు 66 బంతుల్లోనే 73 పరుగుల భాగస్వామ్యం అందించాడు. ఈ సిచ్యువేషన్లో కెప్టెన్‌ రోహిత్‌ తెలివిగా స్పిన్నర్లను రంగంలోకి దించాడు.


బంతి అందుకున్న వెంటనే మెండిస్‌ను కుల్‌దీప్‌ ఔట్‌ చేశాడు. అప్పటికి జట్టు స్కోరు 102. మరో పరుగు వ్యవధిలోనే ధనంజయ డిసిల్వా (0)ను అక్షర్‌ పటేల్‌ బౌల్డ్‌ చేశాడు. జట్టు స్కోరు 118 వద్ద నువనిదు రనౌట్‌ అయ్యాడు. దాంతో వికెట్ల పతనం మొదలైంది. కుల్‌దీప్‌ విజృంభించి చరిత్‌ అసలంక (15), దసున్ శనక (2)ను పెవిలియన్‌ పంపించాడు. వరుస బౌండరీలు బాదిన వనిందు హసరంగ (21; 17 బంతుల్లో 3x4, 1x6)ను ఉమ్రాన్‌ ఔట్‌ చేశాడు. కరుణ రత్నె (17)నూ అతడే పెవిలియన్‌ పంపించాడు. ఆఖర్లో దునిత్‌ వెలాలిగె (32; 33 బంతుల్లో 3x4, 1x6), లాహిరు కుమార (0)ను బంతి వ్యవధిలో సిరాజ్‌ ఔట్‌ చేసేశాడు. కసున్‌ రజిత (17*) అజేయంగా నిలిచాడు.