Suryakumar Yadav India vs New Zealand: భారత్-న్యూజిలాండ్ మధ్య లక్నోలో రెండో టీ20 మ్యాచ్ జరిగిన మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. ఇది చాలా ఉత్కంఠభరితమైన మ్యాచ్. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 99 పరుగులకే పరిమితం అయింది.


దీనికి సమాధానంగా పరుగుల వేటకు దిగిన భారత్ జట్టు చివరి ఓవర్లో ఈ మ్యాచ్‌లో విజయం సాధించారు. దీంతో ఈ మ్యాచ్‌లో భారత జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత ఇన్నింగ్స్‌లో సూర్యకుమార్ యాదవ్‌తో సమన్వయ లోపం కారణంగా వాషింగ్టన్ సుందర్ రనౌట్ అయ్యారు.


రెండో ఇన్నింగ్స్‌ 15వ ఓవర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. సూర్యకుమార్ యాదవ్ షాట్ కొట్టిన వెంటనే నాన్ స్ట్రైకర్ ఎండ్ వైపు రన్ కోసం వెళ్లాడు. ఇక మరోవైపు నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో వాషింగ్టన్ సుందర్ వద్దని చెబుతున్నప్పటికీ సూర్యకుమార్ యాదవ్ చూసుకోకుండా తన క్రీజు నుండి బయటకు వచ్చి అవతలి ఎండ్‌కు చేరుకున్నాడు. ఇది చూసిన వాషింగ్టన్ సుందర్ సూర్యకుమార్ యాదవ్ కోసం తన వికెట్ ను త్యాగం చేశాడు. వాషింగ్టన్ సుందర్ ఔట్ అవ్వడం తన తప్పిదమేనని మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ యాదవ్ ఒప్పుకున్నాడు.


మ్యాచ్ తర్వాత రన్ అవుట్ గురించి సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, ‘ఇది నా తప్పు. అక్కడ నేను అనుకున్నట్లు జరగలేదు. బంతి ఎక్కడికి వెళుతుంది అనేది నేను చూడలేదు. లక్నో పిచ్ చాలా చాలెంజింగ్ వికెట్. సెకండ్ ఇన్నింగ్స్ లో ఇలాంటి టర్న్ వస్తుందని అనుకోలేదు కానీ దానికి సిద్ధంగా ఉండాల్సిందే.’ అన్నాడు.


సూర్యకుమార్ యాదవ్ ఇంకా మాట్లాడుతూ, ‘ఆ ఓవర్‌లో మమ్మల్ని మేం ప్రశాంతంగా ఉంచుకోవడానికి మాకు ఒక భారీ షాట్ అవసరం. అందుకే అలా చేయాల్సి వచ్చింది.’ దీంతోపాటు ఇతర విషయాలు కూడా తెలిపాడు. ‘విన్నింగ్ రన్‌కు ముందు హార్దిక్ పాండ్యా నా దగ్గరకు వచ్చి, ‘నువ్వు ఈ బంతితో మ్యాచ్‌ని పూర్తి చేస్తున్నావు, ఇది నాకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది‘ అని చెప్పాడు.’ అని సూర్యకుమార్ యాదవ్ అన్నాడు.


ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ 31 బంతుల్లో ఒక ఫోర్ సాయంతో 26 పరుగులతో అజేయంగా ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌ కారణంగా సూర్యకుమార్ యాదవ్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' కూడా లభించింది.


న్యూజిలాండ్‌తో జరిగిన రెండో థ్రిల్లింగ్ టీ20 మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. అనంతరం టీమిండియా 19.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. టీం ఇండియా తరఫున సూర్యకుమార్ యాదవ్ (26 నాటౌట్: 31 బంతుల్లో, ఒక ఫోర్) చివరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్ గెలిపించాడు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు తీసుకోగా, కుల్‌దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, దీపక్ హుడా తలో వికెట్ పడగొట్టారు. దీంతో ఈ సిరీస్ 1-1తో సమం అయింది. మూడో టీ20 మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్‌ను గెలుచుకోనుంది.