నాటింగ్​హామ్​ వేదికగా ఇంగ్లాండ్​తో జరుగుతున్న  టెస్టు మ్యాచులో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్​లో భారత్​ 278 పరుగులకు ఆలౌటైంది. టీమిండియాకు 95 పరుగుల​ ఆధిక్యం దక్కింది. భారత జట్టులో కేఎల్​ రాహుల్​(84), రవీంద్ర జడేజా(56) అర్ధ సెంచరీలతో రాణించారు. ఇంగ్లాండ్​ బౌలర్లలో అండర్సన్​ 4, రాబిన్సన్​ 5 వికెట్లు దక్కించుకున్నారు.


191/5తో టీమిండియా లంచ్ విరామానికి వెళ్లింది. మరో 87 పరుగులు చేసి ఆలౌటైంది. సెంచరీ దిశగా దూసుకెళ్తున్న రాహుల్​ను పెవిలియన్​ పంపాడు అండర్సన్​. అప్పటికే రెండుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు రాహుల్​. మరో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. క్రీజులో ఉన్న జడేజా ధాటిగా ఆడి హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఓ భారీ షాట్​కు ప్రయత్నించి రాబిన్సన్​ బౌలింగ్​లో ఔటయ్యాడు. చివరిలో బుమ్రా వరుస బౌండరీలతో ఆధిక్యాన్ని మరికొంచెం పెంచాడు.


ఈ మ్యాచ్​లో హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు జడేజా. తన ఖాతాలో సరికొత్త రికార్డును వేసుకున్నాడు. అతి తక్కువ టెస్టుల్లో 200 వికెట్లతో పాటు 2000 పరుగులు చేసిన భారత ఆటగాడిగా ఫీట్​ సాధించాడు. ఈ జాబితాలో ఇయాన్​ బోథమ్​ తొలి స్థానంలో ఉన్నాడు. ఇయాన్ కేవలం 42 టెస్టుల్లోనే ఈ ఘనత వహించాడు. ఆ తర్వాతి స్థానాల్లో కపిల్​ దేవ్​(50), ఇమ్రాన్​ ఖాన్(50), అశ్విన్​(51) ఉన్నారు.


 






అయితే ఇంగ్లాండ్‌ సీనియర్‌ పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌ టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో టీమ్‌ఇండియా లెజెండరీ స్పిన్నర్‌ అనిల్‌కుంబ్లేను అధిగమించాడు. ఈ ఫార్మాట్‌లో ఇప్పటివరకూ అత్యధిక వికెట్లు తీసిన వారిలో శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌ 800 వికెట్లతో అగ్రస్థానంలో నిలవగా ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌ 708 వికెట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా దిగ్గజం కుంబ్లే ఇన్నాళ్లూ 619 వికెట్లతో మూడో స్థానంలో నిలిచాడు. అయితే, ఆ రికార్డును అండర్సన్‌ ఇప్పుడు బద్దలుకొట్టాడు.