IND vs AUS, 2nd ODI: రెండో వన్డేలో భారత్‌కు ఘోర పరాజయం ఎదురైంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 26 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం ఆస్ట్రేలియా కేవలం 11 ఓవర్లలోనే వికెట్ కూడా కోల్పోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. ఆస్ట్రేలియా ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (51 నాటౌట్: 30 బంతుల్లో, 10 ఫోర్లు), మిషెల్ మార్ష్ (66 నాటౌట్: 36 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లు) అర్థ సెంచరీలు సాధించారు. ఈ విజయంతో ఆస్ట్రేలియా మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. మూడో వన్డేలో విజయం సాధించిన జట్టు సిరీస్‌ను కైవసం చేసుకోనుంది. ఐదు వికెట్లు తీసుకున్న మిషెల్ స్టార్క్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.


117 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఓపెనర్లు ఎంత తొందరగా మ్యాచ్ ముగిద్దామా అనే మైండ్ సెట్‌తో ఆడారు. మహ్మద్ షమీ వేసిన మొదటి ఓవర్లో రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. రెండో ఓవర్ నుంచి ట్రావిస్ హెడ్ (51 నాటౌట్: 30 బంతుల్లో, 10 ఫోర్లు), మిషెల్ మార్ష్ (66 నాటౌట్: 36 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లు) బౌండరీలతో చెలరేగారు. మొదటి 11 ఓవర్లలోనే రోహిత్ శర్మ ఐదుగురు బౌలర్లను ప్రయోగించాడు. అయినా వికెట్ తీయడంలో మాత్రం సఫలం కాలేకపోయారు. దీంతో 11 ఓవర్లలోనే ఆస్ట్రేలియా విజయం సాధించింది.


ఒక్కరూ నిలబడలేకపోయారు


టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా బ్యాటింగ్‌కు దిగింది. మొదటి ఓవర్లోనే మిషెల్ స్టార్క్ బౌలింగ్‌లో బంతిని కట్ చేయబోయిన శుభ్‌మన్ గిల్ (0: 2 బంతుల్లో) మార్నస్ లబుషేన్ చేతికి చిక్కాడు. దీంతో మూడు పరుగులకే భారత్ మొదటి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీతో (31: 35 బంతుల్లో, నాలుగు ఫోర్లు) కలిసి రోహిత్ శర్మ (13: 15 బంతుల్లో, రెండు ఫోర్లు) కాసేపు వేగంగా ఆడాడు. అయితే కాసేపటికే మిషెల్ స్టార్క్ బౌలింగ్‌లోనే స్లిప్‌లో స్టీవ్ స్మిత్‌కు రోహిత్ చిక్కాడు. ఆ తర్వాతి బంతికే సూర్యకుమార్ యాదవ్ (0: 1 బంతి) కూడా ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు. తొమ్మిదో ఓవర్లోనే కేఎల్ రాహుల్‌ను (9: 12 బంతుల్లో, ఒక ఫోర్) కూడా మిషెల్ స్టార్క్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. మొదటి నాలుగు వికెట్లూ మిషెల్ స్టార్కే దక్కించుకున్నాడు.


ఇక్కడి నుంచి నాథన్ ఎల్లిస్, సీన్ అబాట్ వికెట్లు పడగొట్టే బాధ్యతను తీసుకున్నారు. 10వ ఓవర్లోనే హార్దిక్ పాండ్యాను (1: 3 బంతుల్లో) సీన్ అబాట్ అవుట్ చేశాడు. దీంతో 49 పరుగులకే భారత్ సగం వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత ఏడో వికెట్‌కు విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా (16: 39 బంతుల్లో, ఒక ఫోర్) 22 పరుగులు జోడించారు. ఇన్నింగ్స్‌ కుదుటబడుతున్న టైమ్‌లో విరాట్ కోహ్లీని నాథన్ ఎల్లిస్ అవుట్ చేశాడు.


తర్వాత కాసేపటికే ఎక్కువ సేపు ఎవరూ క్రీజులో నిలబడలేదు. చివర్లో అక్షర్ పటేల్ (29: 29 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో భారత్ 100 పరుగుల మార్కును దాటింది. 26 ఓవర్లలో భారత్ 117 పరుగులకు ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా బౌలర్లలో మిషెల్ స్టార్క్ ఐదు వికెట్లు తీసుకున్నాడు. సీన్ అబాట్ మూడు వికెట్లు, నాథన్ ఎల్లిస్ రెండు వికెట్లు పడగొట్టారు.