ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌లో క్రికెట్‌ని భాగం చేస్తే బాగుంటుందని అభిమానుల ఆశ. ఆ దిశగా అడుగులు వేస్తోంది ICC(ఇంటర్నెషనల్ క్రికెట్ కౌన్సిల్). ఇందుకోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది కూడా. తాజాగా ఐసీసీ... ఒలింపిక్స్‌లో జెంటిల్‌మెన్ గేమ్‌ క్రికెట్‌ను చేర్చేందుకు ఐఓసీ(IOC)కి ప్రతిపాదించింది. దీని కోసం బిడ్ కూడా వేయనున్నట్లు ప్రకటించింది. ఐసీసీ ప్రయత్నాలు ఫలించి, అన్ని అనుకున్నట్లు జరిగితే 2028లో లాస్ ఏంజిల్స్ వేదికగా జరిగే ఒలింపిక్స్‌లో మనం క్రికెట్‌ను చూడొచ్చు. విశ్వక్రీడలు ఒలింపిక్స్‌లో క్రికెట్‌ని చేర్చేందుకు తాము తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను భాగం చేసేందుకు ఏర్పాటైన ఐసీసీ సభ్యుల బృందం వెల్లడించింది. 2028లో కచ్చితంగా ఒలింపిక్స్‌లో క్రికెట్ ఉండేటట్లు చూస్తామని కూడా వారు పేర్కొన్నారు. ఇదే జరిగితే క్రికెట్ అభిమానులకు పండగే పండగ. 


ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది క్రికెట్ అభిమానులుంటే.. వీరిలో 90 శాతం మంది ఒలింపిక్స్‌లో క్రికెట్ ఉండాలని కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా ఐసీసీ (ICC) వెల్లడించింది. ఇక 1900 ఏడాదిలో జరిగిన ఒలింపిక్స్‌లో ఒక సారి క్రికెట్‌ను చేర్చారు. అప్పుడు కేవలం రెండు జట్లు మాత్రమే ఆడాయి. 2028లో కనుక మళ్లీ క్రికెట్‌ను ప్రవేశపెడితే 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో ఈ ఆటను చూసినట్లవుతుంది. అలాగే ఫార్మట్‌ విషయానికొస్తే T20 లేదా T10లను నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇటీవల బీసీసీఐ కూడా ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను భాగం చేయాలని కోరిన విషయం తెలిసిందే. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ఎప్పుడు చేర్చినా తాము సిద్ధమేనంటూ బీసీసీఐ సెక్రటరీ జై షా వెల్లడించారు. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చేందుకు ఐసీసీతో కలిసి బీసీసీఐ ప్రయత్నాలు చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. 


2014లో పారిస్‌లో ఒలింపిక్స్ జరగనున్నాయి. ఈ తర్వాత నాలుగేళ్లకు 2028లో లాస్ ఏంజిల్స్‌లో ఒలింపిక్స్ జరుగుతాయి. రెండు రోజుల క్రితం టోక్యో ఒలింపిక్స్ ముగిశాయి. ఈ ఒలింపిక్స్‌లో భారత్ 7 పతకాలు సాధించింది. ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో 23ఏళ్ల నీరజ్ చోప్రా స్వర్ణం సాధించాడు. వ్యక్తిగత విభాగంలో అభినవ్ బింద్రా తర్వాత భారత్ తరఫున స్వర్ణం సాధించిన అథ్లెట్ నీరజ్ చోప్రానే కావడం విశేషం.