ప్రతిష్ఠాత్మక‌ ఆస్ట్రేలియ‌న్ ఓపెన్‌(Australian Open 2024)లో భార‌త యువ సంచలనం సుమిత్ నగాల్ (Sumit Nagal)పోరాటం ముగిసింది. తొలి రౌండ్‌లో సంచలన ప్రదర్శనతో తనకంటే ర్యాంకింగ్స్‌లో ఎంతో ముందున్న ఆటగాడికి షాక్‌ ఇచ్చిన నగాల్ రెండో రౌండ్‌లోనే వెనుదిరిగాడు.  పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో సుమిత్ నగాల్ 6-2, 3-6, 5-7, 4-6 తేడాతో చైనా ప్లేయర్ జున్‌చెంగ్ షాంగ్‌ చేతిలో ఓటమి పాలయ్యాడు. 2 గంటల 50 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో సుమిత్ నగాల్ పోరాటం సరిపోలేదు.  అసాధారణ ప్రదర్శనతో తొలి సెట్‌ను సొంతం చేసుకొని శుభారంభం చేసిన అతను అనవసర తప్పిదాలతో వరుసగా మూడు సెట్లలో ఓడి మ్యాచ్‌ను చేజార్చుకున్నాడు. దాంతో సుమిత్ నగాల్ సంచలన ప్రదర్శనకు రెండో రౌండ్‌‌లోనే తెరపడింది. మూడేళ్ల తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీకి అర్హత సాధించిన సుమిత్ నగాల్... రెండో రౌండ్ చేరుకోవడం ద్వారా రూ. 98 లక్షల ప్రైజ్‌మనీని సొంతం చేసుకున్నాడు. గత మంగళవారం జరిగిన తొలి రౌండ్‌లో సుమిత్ నగాల్ 6-4, 6-2, 7-6( 7-5)తో 27వ ర్యాంకర్ అలెగ్జండర్ బబ్లిక్(కజకిస్థాన్)ను ఓడించాడు. 


తొలి రౌండ్‌లో నగాల్‌ సంచలనం


ఆస్ట్రేలియా ఓపెన్‌(Australian Open 2024)లో ఇండియన్‌ టెన్నిస్‌ స్టార్‌ సుమిత్‌ నగాల్‌(Sumit Nagal) చరిత్ర సృష్టించాడు. తొలి రౌండ్‌లో ప్రపంచ 27వ ర్యాంకర్‌ను ఓడించి రెండో రౌండ్‌కు దూసుకెళ్లాడు. మెన్స్ సింగిల్స్‌లో కజికిస్థాన్‌కు చెందిన దిగ్గజ ఆటగాడు అలెగ్జాండర్ బబ్లిక్‌(Sumit Nagal vs Alexander Bublik) ను మట్టికరిపించాడు. 6-4, 6-2, 7-6 (5)తో వరుస సెట్లలో గెలిచి చరిత్ర సృష్టించాడు. 1989 తర్వాత ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఓ సీడెడ్ ప్లేయర్‌ను భారత ఆటగాడు ఓడించడం ఇదే తొలిసారి. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 139వ స్థానంలో ఉన్న నగాల్‌.. 27వ ర్యాంకర్‌ అలెగ్జాండర్‌ బబ్లిక్‌పై గెలిచి సంచలనం సృష్టించాడు. సుమిత్‌ 6-4, 6-2, 7-6 (7-5)తో గెలుపొంది రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. ఆస్ట్రేలియా ఓపెన్‌ చరిత్రలో దాదాపు మూడున్నర దశాబ్దాల తర్వాత ఓ సీడెడ్‌ ఆటగాడిని భారత క్రీడాకారుడు ఓడించడం ఇదే తొలిసారి. జబ్లిక్‌ను ఓడించిన రెండో రౌండ్‌లో దూసుకెళ్లిన సుమిత్ తర్వాత మెకెంజీ మెక్‌డొనాల్డ్, షాంగ్ జున్‌చెంగ్ లతో తలపడనున్నాడు.


అప్పుడెప్పుడో 1989లో....
టెన్నిస్ దిగ్గజం రమేశ్ కృష్ణన్‌( Ramesh Krishnan) 1989లో.. అప్పటి ప్రపంచ నంబర్‌ 1 మ్యాట్స్‌ విలాండర్‌ను రెండో రౌండ్‌లో ఓడించాడు. టెన్నిస్‌ పురుషుల సింగిల్స్‌ విభాగంలో ఇప్పటివరకు ఓ భారత ఆటగాడు ఆస్ట్రేలియా ఓపెన్‌లో మూడో రౌండ్‌ వరకు మాత్రమే చేరుకున్నారు. రమేశ్ కృష్ణన్‌ తన కెరీర్‌లో ఐదు సార్లు 1983, 84, 87, 88, 89 ఏడాదుల్లో ఆస్ట్రేలియా ఓపెన్‌లో మూడో రౌండ్‌ వరకు వెళ్లాడు. లియాండర్‌ పేస్‌, విజయ్‌ అమృత్‌రాజ్ కూడా ఈ టోర్నీలో ఆడినప్పటికీ.. రెండో రౌండ్‌లోనే వెనుదిరిగారు. సుమిత్‌ చివరగా 2021 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ప్రధాన డ్రాలో ఆడాడు. అప్పుడు మొదటి రౌండ్లోనే ఓడిపోయాడు. 2019, 2020లో యూఎస్‌ ఓపెన్‌ ప్రధాన డ్రాలోనూ సుమిత్‌ బరిలో దిగాడు. 2020 యూఎస్‌ ఓపెన్‌లోనూ రెండో రౌండ్‌ వరకు చేరుకున్నాడు.