Dinesh Karthik : టీమిండియా వికెట్‌ కీపర్‌, బెస్ట్‌ మ్యాచ్‌ ఫినిషర్‌.. దినేష్‌ కార్తీక్‌కు సంబంధించిన ఓ వీడియో తన అభిమానులను షాక్‌కు గురి చేస్తోంది. కార్తీక్‌ తన జట్టు ఆటగాళ్లతో, కుటుంబంతో కలిసి ఉన్న ఫొటోలతో పాటు మైదానంలో ఆడుతున్న చిత్రాలతో ఉన్న ఓ వీడియోను పంచుకున్నాడు. తన  ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఈ వీడియోను పోస్ట్‌ చేస్తూ.. క్యాప్షన్‌లో- డ్రీమ్ డూ కమ్ ట్రూ.. టీ20 ప్రపంచ కప్ అంటూ రాసుకొచ్చాడు. అంతేకాదు ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టులో భాగం కావడం గర్వించదగ్గ విషయం.. మనం టోర్నీని గెలవకపోవచ్చు కానీ జ్ఞాపకాలు నన్ను ఎప్పుడూ సంతోషపరుస్తాయి. నాకు ఎల్లప్పుడూ మద్దతుగా నిలిచిన నా తోటి ఆటగాళ్లు, కోచ్‌లు, స్నేహితులు, అభిమానులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు కార్తీక్‌. అయితే ఇప్పటికే దినేష్‌ కార్తీక్‌ త్వరలోనే ఇంటర్‌ నేషన్‌ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు వార్తలు అవుతున్నాయి. 






ఇన్ స్టాలో ఎమోషనల్ వీడియో 


ఈ క్రమంలో కార్తీక్‌ తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన ఓ వీడియోతో ఈ వార్తలకు మరింత ఊతమిచ్చినట్లైంది. ఈ ఎమోషనల్ వీడియోని గమనిస్తే.. అతను తిరిగి బ్లూ జెర్సీ వేసుకునే అవకాశాలు ఉన్నట్లు కనిపించట్లేదు. దానికి పెట్టిన క్యాప్షన్ చూస్తే.. "టీ20 వరల్డ్ కప్ టోర్నీలో ఇండియా తరపున ఆడేందుకు హార్డ్ వర్క్ చేశాను. చాలా గర్వంగా ఉంది. ఇది నా జీవితంలో ఎన్నో మధురస్మతులు మిగిల్చింది. నా తోటి ప్లేయర్లు, కోచ్‌లు, స్నేహితులు, ముఖ్యంగా అశేష అభిమానం చూపుతున్న ఫ్యాన్స్‌కి ధన్యవాదాలు. కల నిజమైంది" అని క్యాప్షన్‌లో రాశాడు. ఇక ఈ పోస్ట్‌ను చూసిన నెటిజన్స్‌.. ఒక్కసారిగా షాక్‌కు గురి అవుతున్నారు. "ప్లీజ్‌ కార్తిక్‌.. రిటైర్మెంట్‌ ప్రకటించవద్దు" అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 


పునరాగమనం తర్వాత 


ఇక ఇదిలా ఉంటే.. దినేష్ కార్తీక్ 2004లో భారత జట్టుకు అరంగేట్రం చేశాడు. 2007లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో కూడా అతను టీమ్ ఇండియాలో భాగమయ్యాడు. ధోనీ ఉండగా భారత జట్టులో పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే, గత కొన్నేళ్లుగా అతను జట్టులో పునరాగమనం చేయగలిగాడు. 2019లో ఇంగ్లండ్‌లో జరిగిన ప్రపంచకప్‌లో తొలుత జట్టులో భాగమైన అతడు ఆ తర్వాత గతేడాది కూడా టీ20 ప్రపంచకప్‌లో అవకాశం దక్కించుకున్నాడు. కార్తీక్ ఇప్పుడు ఇద్దరు కొడుకులకు తండ్రి. కుటుంబంతో గడపాలనుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో త్వరలో ఆయన రిటైర్మెంట్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంటుందని అంటున్నారు. ప్రపంచకప్‌లో ప్రారంభ మ్యాచ్‌లలో దినేష్ కార్తీక్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో అవకాశం లభించింది. కానీ, అతని బ్యాట్ అంతగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత, ఇంగ్లండ్‌తో జరిగే ముఖ్యమైన సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో అతని స్థానంలో రిషబ్ పంత్‌ని ప్లేయింగ్ 11లో చేర్చారు. ప్రస్తుతం కార్తీక్‌ వయసు 37 ఏళ్లు. వచ్చే ప్రపంచకప్‌లో ఆడతాడనే ఆశ అయితే లేదు. దీంతోనే ఇక కార్తీక్ రిటైర్మెంట్ సూచనలు కూడా ఇచ్చాడని భావిస్తున్నారు.