టీ 20 ప్రపంచకప్‌(T20 World Cup)నకు ముందు అఫ్గానిస్థాన్‌(Afghanistan)తో చివరి సిరీస్‌ను టీమిండియా(Team India) ఆడేసింది. అఫ్గాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌లో శివమ్‌ దూబె, యశస్వి జైస్వాల్‌, రింకూసింగ్, ఆవేశ్ ఖాన్‌, ముఖేష్‌ కుమార్‌ ఇలా చాలామంది యువ ఆటగాళ్లకు చోటిచ్చారు. ఈ కుర్రాళ్లందరూ తమను తాము నిరూపించుకునేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నించారు. అయితే అఫ్గాన్‌తో సిరీస్ ముగిసిన తర్వాత రోహిత్‌ శర్మ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

 

రోహిత్‌ ఏం చెప్పాడంటే...
  

అప్గాన్‌తో సిరీస్‌లో చాలామంది యువ ఆటగాళ్లు తమను తాము నిరూపించుకున్నారని అయితే వీరిలో కొందరిని ప్రపంచకప్‌ జట్టు నుంచి తప్పించక తప్పదని రోహిత్‌ పేర్కొన్నాడు. వన్డే ప్రపంచకప్‌కు ముందు లాగే ఇప్పుడు కూడా టీ20ల్లో అనేక మంది ఆటగాళ్లను పరిశీలించి చూస్తున్నామని హిట్‌మ్యాన్‌ తెలిపాడు. కానీ పొట్టి ప్రపంచకప్‌నకు ముందు ప్రధాన జట్టును ఎంపిక చేసినప్పుడు కొందరిని తప్పించక తప్పదని రోహిత్‌ కుండబద్దలు కొట్టాడు. అది యువ ఆటగాళ్లకు నిరాశ కలిస్తుందని కానీ జట్టులో ఒక స్పష్టత తేవడం తమ కర్తవ్యమని రోహిత్ శర్మ తెలిపాడు. 25-30 మంది ఆటగాళ్ల పూల్‌ నుంచి మేం ప్రపంచకప్‌ జట్టును ఎంచుకోవాలని తామింకా జట్టును ఖరారుల చేయలేదని రోహిత్‌ తెలిపాడు. కానీ ప్రపంచకప్‌లో ఆడబోయే 8-10 మంది ఆటగాళ్లు తమ మదిలో ఉన్నారని అన్నారు. 

 

తాను, హెడ్‌ కోచ్‌ రాహుల్‌ భాయ్‌ జట్టుకు ఒక రూపు తేవడానికి ప్రయత్నిస్తున్నామని రోహిత్ తెలిపాడు. జట్టు రూపకల్పనలో ఉన్నప్పుడు అందరినీ సంతోషపెట్టలేమని కెప్టెన్సీలో తాను నేర్చుకున్నట్లు హిట్‌ మ్యాన్‌ వెల్లడించాడు. జట్టు అవసరాలపైనే తమ దృష్టి ఉంటుందని కూడా తేల్చి చెప్పాడు. ‘సంవత్సరకాలంగా తాను పొట్టి క్రికెట్‌లో బరిలోకి దిగలేదని... ఈ నేపథ్యంలో రాహుల్‌ భాయ్‌కో కొన్ని ఆలోచనలు పంచుకున్నాని... ఆడకున్నా.. మ్యాచ్‌లు చూస్తూనే ఉన్నానని రోహిత్ తెలిపాడు. 

 

రాణించని వారి పరిస్థితి ఏంటి..?

అఫ్గాన్‌తో సిరీస్‌లో మూడు మ్యాచ్‌లూ ఆడిన ముకేశ్‌ 9.80 ఎకానమీతో 98 పరుగులిచ్చి రెండే వికెట్లు పడగొట్టారు. అవేష్‌ ఖాన్‌ కూడా పెద్దగా రాణించలేదు. ఒక్క మ్యాచ్‌లో ఏకంగా 55 పరుగులు సమర్పించుకున్నాడు. ఆఖరి మ్యాచ్‌ సూపర్‌ ఓవర్లో రాణించినా.. స్పిన్నర్‌ బిష్ణోయ్‌ తన ప్రదర్శనతో జట్టుకు విశ్వాసాన్నివ్వలేకపోయాడు. మూడు మ్యాచ్‌ల్లో 10.18 ఎకానమీతో 112 పరుగులిచ్చాడు. పవర్‌ప్లేలో బౌలింగ్‌ చేయడం ఇబ్బందిగా భావించే బౌలర్‌ను ఆ ఓవర్లలో బౌలింగ్‌ చేయించాం. ఆఖరి ఓవర్లలో బౌలింగ్‌ చేయడాన్ని ఇష్టపడని బౌలర్‌తో ఆఖర్లో బౌలింగ్‌ చేయించామని’రోహిత్‌ చెప్పాడు. అయితే ఐపీఎల్‌లో ఆటగాళ్ల ప్రదర్శన కూడా జట్టు ఎంపికలో కీలకం కావచ్చు.

 

భారత జట్టు కొత్త చరిత్ర

టీ20 మ్యాచుల్లో భారత జట్టు కొత్త చరిత్ర సృష్టించింది. బెంగళూరు వేదికగా జరిగిన మూడో టీ20లో అఫ్గాన్‌ను మట్టికరిపించి... టీ20 చరిత్రలో అత్యధిక వైట్‌వాష్‌లు చేసిన జట్టుగా భారత్‌ అవతరించింది. ఇప్పటివరకూ టీ20 చరిత్రలో ద్వైపాక్షిక సిరీస్‌ల్లో ఎనిమిది సార్లు వైట్‌వాష్‌లు చేసిన జట్లుగా భారత్‌, పాకిస్థాన్‌ సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. కానీ అఫ్గాన్‌తో మూడో టీ20లో సూపర్‌ ఓవర్‌లో విజయం సాధించిన టీమిండియా.. 9 క్లీన్‌స్వీప్‌లతో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా టీమ్‌ఇండియా అవతరించింది.