Wriddhiman Saha Retirement: భారత వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా అన్ని రకాల ఫార్మాట్ల క్రికెట్‌కు శనివారం గుడ్ బై చెప్పాడు. పంజాబ్‌తో స్థానిక ఈడెన్ గార్డెన్స్‌లో మ్యాచ్ ముగిసిన అనంతరం తను పూర్తిగా క్రికెట్‌కు దూరమవుతున్నట్లు వెల్లడించాడు. 1997లో క్రికెట్‌లోకి అడుగుపెట్టి, 28 ఏళ్ల కెరీర్‌ను పూర్తి చేసినట్లు సాహా తెలిపాడు. భారత్ తరపున తను 40 టెస్టులు, 9 వన్డేలు ఆడాడు. ఓవరాల్‌గా 2014 నుంచి 2021 వరకు తను టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. ముఖ్యంగా టెస్టు క్రికెట్ నుంచి ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించాక, సాహా రెగ్యులర్ కీపర్‌గా 2014 నుంచి ప్రాతినిథ్యం వహించాడు. అయితే రిషభ్ పంత్ దూసుకురావడంతో 2021 నుంచి తనకు టీమిండియా తరఫున ద్వారాలు మూసుకుపోయాయి. ఆ తర్వాత పంత్ గాయంతో కొంతకాలం దూరమైనప్పటికీ, అప్పటికే వయసు మీరిన సాహాను టీమ్ మేనేజ్మెంట్ పరిగణలోకి తీసుకోలదు. శ్రీకర్ భరత్, ధ్రువ్ జురెల్ లాంటి ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంది. దీంతో 2021 నుంచే సాహా కనుమరుగయ్యాడు. 

ఘనంగా వీడ్కోలు..పంజాబ్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత వీడ్కోలు పలికిన సాహాను జట్టు సభ్యులు ఎత్తుకుని ఘనంగా బైబై చెప్పారు. ఇక రంజీల్లో బెంగాల్, త్రిపుర జట్లకు సాహా ప్రాతినిథ్యం వహించాడు. 28 ఏళ్ల తన కెరీర్‌లో సహకరించిన తన కుటుంబసభ్యులు, భార్య రోమా, పిల్లలు, అన్వి, అన్వయ్, బీసీసీఐ, తను రంజీ ఆడిన క్రికెట్ యాజమాన్యాలకు బెంగాల్ క్రికెట్ సంఘానికి థాంక్స్ చెప్పాడు. ఇక ఐపీఎల్లోనూ తను ఐదు జట్ల తరపున ప్రాతినిథ్యం వహించాడు. సొంత రాష్ట్రం బెంగాల్‌కు చెందిన కోల్కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ లయన్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. 2014లో కేకేఆర్‌పై పంజాబ్ తరపున స్టన్నింగ్ సెంచరీ చేయడం తన ఐపీఎల్ కెరీర్లో హైలెట్. 

2021 నుంచి దూరం..నిజానికి 2021లో చివరి అంతర్జాతీయ క్రికెట్ ఆడిన సాహా.. 2022 నుంచి పూర్తిగా జాతీయ జట్టుకు దూరమయ్యాడు. కనీసం స్క్వాడ్‌లో కూడా తనను పరిగణనలోకి తీసుకోలేదు. కోచ్ రాహుల్ ద్రవిడ్ నాయకత్వంలో తనను టీమ్ నుంచి దూరంగా ఉంచడంతో సాహా అసహనం వ్యక్తం చేశాడు. అప్పటి టీమ్ మేనేజ్మెంట్ రిషబ్ పంత్‌కు ప్రత్యామ్నాయంగా శ్రీకర్ భరత్‌ను పరిగణించడంతో సాహా అంతర్జాతీయ క్రికెట్‌కు ఫుల్ స్టాప్ పడింది. ఓవరాల్‌గా 49 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన సాహా.. దాదాపుగా 1400 పరుగులు చేశాడు. అందులో 3 సెంచరీలు, ఆరు అర్థసెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 117 కావడం విశేషం. ఐపీఎల్లో చివరగా 2023లో గుజరాత్ తరఫున ప్రాతినిథ్యం వహించాడు. 

Also Read: BCCI Awards: సచిన్‌కు లైఫ్ టైమ్ ఎచీవ్మెంట్ అవార్డు - కీలక అవార్డులను సాధించిన బుమ్రా, స్మృతి..