WPL 2023: ‘అసలు ముంబైకి ఎదురుందా..?’, ‘ముంబైని ఓడించడం కష్టం..’, ‘8 మ్యాచ్ లు గెలుస్తారు. పక్కా..’, ‘వీళ్లదే డబ్ల్యూపీఎల్ ట్రోఫీ’.. ఇవన్నీ మూడురోజుల క్రితం వరకూ వినిపించిన మాటలు.  కానీ రెండు మ్యాచ్ లతో అంతా తలకిందులైంది. టేబుల్ టాపర్స్ కాస్త  బొక్క బోర్లా పడ్డారు. వరుసగా రెండు మ్యాచ్ లలో ఓడి  నేరుగా ఫైనల్ ఆడాల్సిన స్థితి నుంచి ఎలమినేటర్ (ప్లేఆఫ్స్) ఆడి (?) అందులో గెలిస్తేనే ఫైనల్ కు చేరుకునే   స్థితికి చేరుకున్నారు.  ముంబై వేదికగా జరుగుతున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ముంబై ఫేట్ ఒక్కసారిగా మారిపోయింది.  సోమవారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓడటంతో ఆ జట్టు ఎలిమినేటర్  ఆడాల్సిన  స్థితికొచ్చింది. 


ఢిల్లీతో మ్యాచ్ కు  ముందు ఇలా.. 


ఈ సీజన్ లో ఆడిన ఐదు మ్యాచ్ లలో ఓడిన జట్టుగా  ఆర్సీబీ  చెత్త రికార్డు నమోదుచేస్తే అదే  క్రమంలో ఆడిన ఐదు మ్యాచ్ లనూ గెలుచుకున్న జట్టు  ముంబై ఇండియన్స్.  అసలు ఈ  లీగ్ లో తమకు ఎదురేలేదన్నవిధంగా  హర్మన్‌ప్రీత్ సేన  జైత్రయాత్ర సాగింది. కానీ  మార్చి  18న  యూపీ వారియర్స్ తో మ్యాచ్ లో ముంబై ఓడింది. ఆ ఒక్క మ్యాచే కదా ఓడింది  అనుకున్నారేమో గానీ  నిన్న ఢిల్లీ కూడా   షాకిచ్చింది. వాస్తవానికి ఢిల్లీతో మ్యాచ్ కు ముందు రెండు జట్లూ ఆరు మ్యాచ్ లు ఆడాయి.  ఢిల్లీ నాలుగింట్లో విజయం సాధించగా ముంబై ఐదు విజయాలతో టేబుల్ టాపర్స్ గా ఉండేది.   నెట్ రన్ రేట్ కూడా ఢిల్లీ (+1.431 )  కంటే ముంబై  (+2.670) కే ఎక్కువుంది.  కానీ నిన్న  ఢిల్లీ ముంబైని చిత్తుగా ఓడించడంతో నెట్ రన్ రేట్ కూడా మారింది. ప్రస్తుతం ఢిల్లీ నెట్ రన్ రేట్ +1.978 గా ఉండగా ముంబైకి +1.725 ఉంది.  ఫలితంగా ముంబై రెండో స్థానానికి పరిమితమైంది. 


ఫైనలా..? ఎలిమినేటరా...? 


డబ్ల్యూపీఎల్ నిబంధనల ప్రకారం  పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టు నేరుగా ఫైనల్ చేరుతుంది. రెండు మూడు స్థానాల్లో ఉన్న  జట్లు ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాలి. ఇందులో గెలిచిన  జట్టు ఫైనల్ చేరిన జట్టుతో ఈనెల 26న తుది పోరులో తలపడుతుంది. అయితే ప్రస్తుతం ముంబై రెండో స్థానంలో ఉండటంతో ఆ జట్టు ఎలిమినేటర్ ఆడాల్సిందేనా..? ఈ ప్రశ్నకు నేడు సమాధానం దొరకనుంది. 


 






నేడు మధ్యాహ్నం ఆర్సీబీతో ముంబై  లీగ్ దశలో చివరి మ్యాచ్ ఆడనుంది.   ఈ మ్యాచ్ లో ముంబై.. బెంగళూరును తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసి  భారీ స్థాయిలో విజయం సాధిస్తే మళ్లీ దాని  రన్ రేట్ కూడా పెరుగుతుంది. ఇదే క్రమంలో యూపీ కూడా.. ఢిల్లీ క్యాపిటల్స్ తో నేటి రాత్రి జరిగే  మ్యాచ్ లో ఓడించాలి. అప్పుడు మళ్లీ  ముంబై అగ్రస్థానానికి చేరుతుంది. 


కానీ సీజన్ చివర్లో ఆలస్యంగా మేల్కొన్న ఆర్సీబీ  వరుసగా రెండు విజయాలతో దూకుడు మీదుంది.  గత రెండు మ్యాచ్ లలో ఆర్సీబీ ఆల్ రౌండర్ సోఫీ డివైన్  వీరబాదుడు బాదింది. ఆమెతో పాటు ఎలీస్ పెర్రీ, రిచా ఘోష్ కెప్టెన్ స్మృతి మంధాన కూడా టచ్ లోనే ఉన్నారు. మరి   రెండు మ్యాచ్ లతో ఢీలా పడ్డ ముంబై.. ఆర్సీబీని ఓడించి  మళ్లీ అగ్రస్థానానికి చేరుతుందా..?  అంటే నేటి సాయంత్రం వరకూ వేచి చూడాల్సిందే.   ఇక నిన్న యూపీ వారియర్స్.. గుజరాత్ ను ఓడించడంతో  ఆర్సీబీ, గుజరాత్ లు ఈ సీజన్ నుంచి అధికారికంగా నిష్క్రమించాయి.