భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో రోహిత్‌ సేన వరుస విజయాలతో ఊపు మీదుంది. టాపార్డర్‌ పరుగుల వరద పారిస్తుండడం.. బౌలర్లు తమ పాత్రను సమర్థంగా పోషిస్తుండడంతో ఆడిన అయిదు మ్యాచుల్లోనూ విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన కొనసాగుతోంది. స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్‌లో కింగ్‌ కోహ్లీ అదరగొడుతున్నాడు. ఇప్పటికే ఒక సెంచరీతో పాటు మూడు అర్ధ శతకాలతో దూకుడు మీదున్నాడు. ఇప్పటికే వన్డేల్లో 48 శతకాలు చేసిన విరాట్‌.. ఈ ప్రపంచకప్‌లో సచిన్‌ 49 శతకాల రికార్డును బద్దలు కొడతాడని అభిమానులు ధీమాగా ఉన్నారు. అయితే ఇప్పుడు విరాట్ కోహ్లీ కొత్త అవతారం ఎత్తాడు. హార్దిక్‌ పాండ్యా గాయం నుంచి కోలుకోవడానికి మరింత సమయం పట్టనుందన్న వార్తల నేపథ్యంలో విరాట్ బంతిని చేతపట్టి తీవ్రంగా శ్రమిస్తున్నాడు. నెట్స్‌లో చాలాసేపు సాధన చేస్తూ తన బౌలింగ్‌కు పదును పెట్టుకుంటున్నాడు. కింగ్‌ కోహ్లీ నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేయడానికి ఓ బలమైన కారణం ఉందన్న వార్తలు వస్తున్నాయి.

 

కోహ్లీ కొత్త అవతారం

హార్దిక్‌ పాండ్యా లేని లోటును తీర్చేందుకు విరాట్‌ బౌలర్‌ అవతారం ఎత్తాడన్న వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కింగ్‌ కోహ్లీ టీమిండియా ఆరో బౌలర్‌ స్థానాన్ని భర్తీ చేసేందుకు తీవ్రంగా సాధన చేస్తున్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌లో కోహ్లీ భారత్‌కు ఆరో బౌలర్‌గా మారవచ్చన్న అంచనాలు కూడా ఉన్నాయి. నెట్స్‌లో ఎప్పుడూ తీవ్రంగా బ్యాటింగ్ చేసే కింగ్‌ కోహ్లీ ఒక్కసారిగా తీవ్రంగా బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఒకవేళ పాండ్యా కోలుకుని జట్టులోకి వచ్చిన అతడిని స్పెషలిస్ట్‌ బ్యాటర్‌గా మాత్రమే ఆడించాలని టీమిండియా మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. ఈ సమయంలోనే విరాట్‌ బౌలర్‌ అవతారం ఎత్తాడన్న వార్తలు ఉన్నాయి. ఇంగ్లండ్‌తో జరిగే తదుపరి మ్యాచ్‌లో కోహ్లీ పార్ట్‌టైమర్‌గా కొన్ని ఓవర్ల పాటు బౌలింగ్‌ వేయవచ్చు. 

 

లక్నోలో ముగ్గురు స్పిన్నర్లతో  బరిలోకి

టీమిండియా-ఇంగ్లండ్‌ తలపడే లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రోహిత్‌ శర్మ ఈ మ్యాచ్‌లో ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే మ్యాచ్‌ రోజున పిచ్ చూసిన తర్వాతే కెప్టెన్ రోహిత్ శర్మ.. ముగ్గురు స్పిన్నర్లతో వెళ్లాలా లేక ముగ్గురు పేసర్లతో వెళ్లాలా అనేది నిర్ణయించనున్నాడు. ముగ్గురు స్పిన్నర్లతోనే టీమ్ ఇండియా లక్నో మైదానంలో బరిలోకి దిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని రోహిత్‌ భావిస్తే ఒక పేసర్‌పై వేటు తప్పదు. ఆ పేసర్ సిరాజ్‌ కావచ్చనే అంచనాలు ఉన్నాయి. సిరాజ్  దూరమైతే అతని స్థానంలో అశ్విన్ జట్టులోకి వస్తాడు.

 

చీలమండ గాయంతో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు దూరమైన స్టార్‌ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌తో పాటు మరో రెండు మ్యాచ్‌లకు కూడా దూరం కానున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 29న భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగే మ్యాచ్‌తో పాటు నవంబర్ 2, నవంబర్ 5 తేదీల్లో జరిగే మ్యాచ్‌లకు కూడా హార్దిక్ అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌ కోసం హార్దిక్‌ పాండ్యా లక్నో వెళ్తాడని బీసీసీఐ గతంలో ప్రకటించింది. కానీ అది సాధ్యం కాదని తెలుస్తోంది. హార్దిక్ ఇంకా టాబ్లెట్స్‌ వాడుతున్నాడని.. చీలమండపై వాపు బాగా తగ్గిందని.. కానీ అప్పుడే అతను బౌలింగ్ చేయడం సాధ్యం కాదని వైద్యులు తెలిపినట్లు తెలుస్తోంది.