2003 World Cup  Final : దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన 2003 వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ అద్వితీయ ఆటతీరు కనబర్చింది. లీగ్‌ దశలో ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఓడిన గంగూలీ సారథ్యంలోని టీమ్‌ఇండియా.. సూపర్‌ సిక్స్‌లో అన్నీ విజయాలు సాధించి తుదిపోరుకు చేరింది. అయితే ఫైన (World Cup 2003 India vs Australia)ల్లో కంగారూల ఊచకోత ముందు ఎదురు నిలువలేకపోయిన భారత్‌.. రన్నరప్‌తో సరిపెట్టుకుంది. సచిన్‌ టెండూల్కర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, రాహుల్‌ ద్రవిడ్‌, సౌరవ్‌ గంగూలీ, యువరాజ్‌ సింగ్‌, మహమ్మద్‌ కైఫ్‌తో కూడిన భారత జట్టు లీగ్‌ దశలో సెంచూరియన్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో పూర్తిగా తేలిపోయింది. బౌలర్లకు సహకరిస్తున్న పిచ్‌పై బ్రెట్‌లీ, జాసెన్‌ గెలెస్పీ నిప్పులు చెరుగుతుండటంతో.. భారత బ్యాటర్లు పెవిలియన్‌కు వరుస కట్టారు. ఆ మ్యాచ్‌లో సచిన్‌తో పాటు గంగూలీ ఓపెనర్‌గా బరిలోకి దిగగా.. దాదా 9 పరుగులకే ఔటయ్యాడు. ఆ తర్వాత సెహ్వాగ్‌ 4, రాహుల్‌ ద్రవిడ్‌ 1, యువరాజ్‌ సింగ్‌ 0, మహమ్మద్‌ కైష్‌ 1 ఇలా ఒకరి వెంట ఒకరు పెవిలియన్‌కు వరుస కట్టారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. సచిన్‌ టెండూల్కర్‌ (59 బంతుల్లో 36) సంయమనం పాటిస్తూ కాస్త ఆకట్టుకున్నాడు. అయితే గెలెస్పీ ఓ చక్కటి బంతితో సచిన్‌ను వికెట్ల ముందు దొకబుచ్చుకోవడంతో భారత్‌ 125 పరుగులకే కుప్పకూలింది. ఆ మ్యాచ్‌లో సచిన్‌ తర్వాత అత్యధిక స్కోరు చేసింది హర్భజన్‌ సింగ్‌ (28). ఆసీస్‌ బౌలర్లలో బ్రెట్‌లీ, గెలెస్పీ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. 


ఆసీస్‌ చేతిలో పరాజయంతో భారత జట్టుపై ఉన్నా కాస్త అంచనాలు కూడా ఎగిరిపోయాయి. అసలు ఈ టీమ్‌ ప్రపంచకప్‌కు ఎందుకు వచ్చిందనే వరకు వెళ్లాయి చర్చలు. అక్కడే దాదా సేన అద్భుతం చేసింది. కంగారూల చేతిలో ఎదురైన ప్రతీకారానికి ఇతర జట్ల మీద బదులు తీర్చుకుంటూ వరుస విజయాలతో విజృంభించింది. జింబాబ్వేపై 83 పరుగులతో నెగ్గిన భారత్‌.. 181 పరుగుల తేడాతో నమీబియాను చిత్తుచేసింది. ఇంగ్లండ్‌ 82 పరుగుల తేడాతో నెగ్గడంతో పాటు.. ఉత్కంఠ పోరులో దాయాది పాకిస్థాన్‌పై 6 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. దీంతో టీమ్‌ఇండియాపై అంచనాలు పెరిగాయి. వసీంవ అక్రమ్‌, వకార్‌ యూనిస్‌, షోయబ్‌ అక్తర్‌ వంటి బౌలింగ్‌ దళం ఉన్న పాకిస్థాన్‌ జట్టు 273 పరుగుల లక్ష్యాన్ని టీమ్‌ఇండియా 45.4 ఓవర్లలోనే ఛేదించడంతో.. దాదా సేన దమ్మేంటో విశ్వానికి తెలిసి వచ్చింది. ఆ మ్యాచ్‌లో అక్తర్‌ బౌలింగ్‌లో సచిన్‌ కొట్టిన అప్పర్‌ కట్‌ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. 


సూపర్‌ సిక్స్‌లో భాగంగా తొలి పోరులో కెన్యాపై 6 వికెట్లతో నెగ్గిన భారత్‌ శ్రీలంకపై 183 పరుగులతో విజయ దుందుభి మోగించింది. న్యూజిలాండ్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించి సెమీస్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది. సెమీఫైనల్లో కెన్యా ఎదురు పడటంతో ముందే ఊపిరి పీల్చుకున్న టీమ్‌ఇండియా 91 పరుగుల తేడాతో గెలిచి రెండోసారి వరల్డ్‌కప్‌ ఫైనల్‌కు చేరింది. టోర్నీ ఆరంభంలో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైనా.. ఆ తర్వాత వరుసగా 8 మ్యాచ్‌లు నెగ్గిన గంగూలీ సేన.. తుదిపోరులో కంగారూలకు గట్టిపోటీ ఇవ్వడం ఖాయం అనుకుంటే.. ఫలితం మాత్రం అందుకు భిన్నంగా వచ్చింది. టాస్‌ గెలిచిన భారత సారథి.. ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించి తప్పు చేయగా.. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్న కంగారూలు విశ్వరూపం చూపారు. కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ భారీ సెంచరీతో చెలరేగితే.. డామియన్‌ మార్టీన్‌, ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌, మాథ్యూ హెడెన్‌ మెరుపులు మెరిపించారు. ఫలితంగా ఆసీస్‌ 50 ఓవర్లలో కేవలం 2 వికెట్లే కోల్పెఓయి 359 పరుగులు చేసింది. టీ20 క్రికెట్‌ రంగప్రవేశం చేయని ఆ కాలంలో.. ఈ స్కోరు నేటి తరంలో 500కు ఏమాత్రం తక్కువ కాదనడంలో అతిశయోక్తి లేదు. 


కొండంత లక్ష్యం కళ్ల ముందు ఉన్నా.. సచిన్‌ టెండూల్కర్‌ ఉన్న ఫామ్‌కు అదేమంత పెద్ద కష్టం కాదని అభిమానులు ధీమాగానే ఉన్నారు. అయితే ఆ ఆశలు అడియాసలు అయ్యేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. ఆసీస్‌ పేస్‌ దిగ్గజం మెగ్‌గ్రాత్‌ తొలి ఓవర్‌లోనే రిటర్న్‌ క్యాచ్‌ ద్వారా సచిన్‌ను వెనక్కి పంపడంతో ఒక్కసారి శత కోటి మంది హృదయాలు ముక్కలయ్యాయి. సెహ్వాగ్‌, ద్రవిడ్‌ పోరాటం ఓటమి అంతరాన్ని తగ్గించేందుకే పరిమితమైంది. చివరికు భారత్‌ 39.1 ఓవర్లలో 234 పరుగులకు ఆలౌటై 125 పరుగులతో ఓటమి మూటగట్టుకుంది. ఇప్పుడా పరాజయానికి బదులు తీర్చుకునే అవకాశం టీమ్‌ఇండియాకు వచ్చింది. ఆ తర్వాత 2007 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా గ్రూప్‌ దశ దాటలేకపోగా.. 2011 క్వార్టర్‌ ఫైనల్లో ఆసీస్‌పై ధోనీ సేన విజయం సాధించింది. 2015 సెమీఫైనల్లో టీమ్‌ఇండియాపై ఆసీస్‌వ విజయం సాధించడంతో పాటు ఫైనల్లోనూ నెగ్గి విజేతగా నిలిచింది. ఆ తర్వాత 2019 నాకౌట్‌లో భారత్‌, ఆసీస్‌ ఎదురు పడకపోగా.. ఇప్పుడు ఫైనల్లో తలపడుతున్నాయి. 


ఈసారి భారత జట్టు లీగ్‌ దశలో ఆడిన తొమ్మిది మ్యాచ్‌లతో పాటు.. సెమీఫైనల్లో న్యూజిలాండ్‌పై ఘనవిజయాలతో ఫుల్‌ జోష్‌లో ఉంటే.. టోర్నీ తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన అనంతరం వరుసగా ఎనిమిదింట నెగ్గిన ఆసీస్‌ తుదిపోరుకు చేరింది. బలాబలాల పరంగా ఇరు జట్లు సమంగానే కనిపిస్తున్నా.. గత కొన్ని మ్యాచ్‌ల్లో కంగారూలు కనబర్చిన పోరాటం.. భారత మేనేజ్‌మెంట్‌ గుండెల్లో రెళ్లు పరిగెత్తిస్తోంది. అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌లో ఆశలే లేని స్థితిలో మ్యాక్స్‌వెల్‌ ఒంటరి పోరాటంతో జట్టును గట్టెక్కించగా.. దక్షిణాఫ్రికాతో రెండో సెమీఫైనల్లో ఓటమి తప్పదేమో అనుకుంటున్న సమయంలో లోయర్‌ మిడిలార్డర్‌ గొప్ప సంయమనం కనబర్చింది. నాకౌట్‌ మ్యాచ్‌ల్లో కంగారూలను ఓడించడం మామూలు విషయం కాదని ఇప్పటికే పలుమార్లు నిరూపితం కాగా.. సొంతగడ్డపై అభిమానుల ప్రోత్సాహం మధ్య బరిలోకి దిగనుండటం రోహిత్‌ సేనకు కలిసి రానుంది. రెండు దశాబ్దాల క్రితం జరిగిన ఫైనల్లో ఆసీస్‌ నెగ్గగా.. మరి ఈ సారి ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి!