స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్‌లో భారత బౌలింగ్‌ దళం అంచనాలను మించి రాణిస్తోంది. ఆరంభంలోనే బుమ్రా, షమీ ప్రత్యర్థి బౌలర్లను వణికిస్తున్నారు. ఈ ప్రపంచకప్‌లో టీమిండియా పేస్‌ విభాగం గతంలో లేనంత పటిష్టంగా కనిపిస్తోంది. భారత బౌలింగ్‌ విభాగం అద్బుత ప్రదర్శనపై టీమిండియా బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే స్పందించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బుమ్రా, షమీ టీమిండియాకు అద్భుత విజయం అందించారు. ఫ్లడ్‌లైట్‌ల వెలుతురులో పిచ్‌ను సద్వినియోగం చేసుకుని వంద పరుగులు విజయాన్ని అందించారు. ప్రపంచకప్‌లో షమీ, బుమ్రా  బౌలింగ్ ప్రదర్శనపై మాంబ్రే ప్రశంసల వర్షం కురిపించాడు. మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన బౌలర్లని మాంబ్రే కొనియాడాడు. బౌలింగ్‌ టెక్నిక్‌ గురించి వారిద్దరితో మాట్లాడే పనే లేదని... బౌలింగ్ వ్యూహాల గురించి మాట్లాడితే చాలని మాంబ్రే అన్నాడు. బుమ్రా, షమీ అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నారని... బౌలింగ్‌ టెక్నిక్‌ గురించి వారికి చెప్పాల్సిన అవసరం లేదని పరాస్ మాంబ్రే తెలిపాడు.

 

  ఈ ప్రపంచకప్‌లో షమీకి తొలి నాలుగు మ్యాచుల్లో ఆడే అవకాశం దక్కలేదు. కానీ తర్వాత దొరికిన అవకాశాన్ని షమీ రెండు చేతులా ఒడిసిపట్టుకున్నాడు. షమీకి తొలి నాలుగు మ్యాచుల్లో అవకాశం దక్కకపోవడంపై కూడా  టీమిండియా బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే స్పందించాడు. జట్టులో అంతా నైపుణ్యం ఉన్న ఆటగాళ్లు ఉన్నప్పుడు జట్టులో స్థానం గురింతి మాట్లాడాల్సిన అవసరం లేదని మాంబ్రే అన్నాడు. జట్టులో ఉన్న ఆటగాళ్లు చాలామందికి సుదీర్ఘమైన అనుభవం ఉందని, వారి నుంచి జట్టుకు ఏమి అవసరమో వారు పూర్తిగా అర్థం చేసుకుంటారని వెల్లడించాడు. జట్టులో చర్చించిన తర్వాతే ఫైనల్‌ లెవన్‌ ఎంపిక ఉంటుందన్నాడు. తమ జట్టులో గొప్ప బౌలర్లు ఉన్నారని, వారికి చాలా అనుభవం కూడా ఉందని.. అలాంటి వారి వల్లే తన పనిన సులభం అవుతుందని మాంబ్రే అన్నాడు. భారత బౌలర్ల ప్రదర్శనలో క్రెడిట్‌ అంతా వారికే దక్కుతుందని వివరించాడు. బుమ్రా, షమీల అద్భుత ఓపెనింగ్ స్పెల్‌పై మాంబ్రే ప్రశంసలు కురిపించాడు. 230 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ 39 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. దీని గురించి మాంబ్రే మాట్లాడుతూ.. ఆ సమయంలో టీమిండియా గెలుపునకు వికెట్లు అవసరమని  బుమ్రా, షమీ గుర్తించారని తర్వాత ఆ పనిని చేసేశారని మాంబ్రే అన్నాడు.

 

కానీ మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్ ఇంకా 30-40 పరుగులు చేసి ఉండాల్సిందని మాంబ్రే అభిప్రాయపడ్డాడు. పవర్‌ప్లేలో వికెట్ ఫ్లాట్‌గా మారిందని అతను చెప్పాడు. టోర్నీలో తొలిసారిగా భారత్ తొలుత బ్యాటింగ్ చేయగా, రన్ రేట్ పెంచే ప్రయత్నంలో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ఔట్ అయ్యారు. మిగిలిన మూడు లీగ్ మ్యాచ్‌లకు ముందు జట్టు కొన్ని విషయాలు మెరుగుపరుచుకోవచ్చని  మాంబ్రే చెప్పాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో అందరికీ బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చిందని, విరాట్, రోహిత్, శుభ్‌మన్ బ్యాటింగ్‌ వల్ల కొన్ని మ్యాచ్‌ల్లో మిడిల్‌ ఆర్డర్‌కు బ్యాటింగ్‌ రాలేదని, కానీ ఇంగ్లండ్‌ మ్యాచ్‌లో అందరూ బ్యాటింగ్‌ చేశారని, ఇది రానున్న మ్యాచ్‌లకు ఉపయోగపడుతుందని మాంబ్రే అన్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో చీలమండ గాయం కారణంగా రెండు మ్యాచ్‌లకు దూరమైన హార్దిక్ పాండ్యా పునరాగమనంపై మాంబ్రే ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. వైద్య బృందం హార్దిక్‌ను పరీక్షిస్తోందని. మరో రెండు రోజుల్లో గాయంపై స్పష్టత వస్తుందని పరాస్‌ మాంబ్రే తెలిపాడు.