Virat Kohli Instagram News | టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ గురువారం (జనవరి 29న) రాత్రి అకస్మాత్తుగా మాయమైంది. అయితే తాను సోషల్ మీడియా నుంచి వెళ్లిపోతున్నాను లేదా కొంతకాలం దూరంగా ఉంటున్నాను అని ఎలాంటి పోస్ట్ చేయలేదు. దాంతో విరాట్ కోహ్లీ అభిమానులు ఇన్‌స్ట్రాగ్రామ్ అకౌంట్ మిస్ కావడంపై ఆశ్చర్యపోయారు. క్రికెటర్ కోహ్లీనే తన అకౌంట్ డిలీట్ చేశాడా లేదా ఏదైనా కారణాలతో జరిగిందా అని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. 

ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్ల పరంగా చూస్తే క్రికెటర్లలో విరాట్ కోహ్లీనే నెంబర్ వన్. ప్రపంచంలో అత్యధిక ఫాలోవర్లు ఉన్న ఆటగాళ్లలో కోహ్లీ ఒకడు. ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లీకి 274 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. తాజాగా కోహ్లీ అభిమానులు అతని ఇన్‌స్టా అకౌంట్ సెర్చ్ చేయగా  ఏమీ కనిపించడం లేదు. అసలేం జరిగింది అని కింగ్ కోహ్లీ ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు. 

విరాట్ కోహ్లీ ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి లండన్‌లో నివాసం ఉంటున్నాడు. కోహ్లీ, అనుష్క శర్మ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. అతను టెస్ట్, టీ20 ఫార్మాట్ల నుండి రిటైర్ అయ్యాడు. కోహ్లీ కేవలం వన్డేల్లో మాత్రమే టీమిండియా తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్ కోసం కోహ్లీ భారతదేశానికి వచ్చాడు, ఆ సిరీస్ ముగిసిన వెంటనే లండన్ తిరిగి వెళ్ళాడు.

కోహ్లీ ఖాతా సస్పెండ్ చేశారా ?

విరాట్ కోహ్లీ ఒక్క ఇన్‌స్టాగ్రామ్ పోస్టుకు కోట్లలో సంపాదిస్తారని తెలిసిందే. దాంతో కోహ్లీ సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకున్నాడా అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అందుకు సంబంధించి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ స్క్రీన్‌షాట్‌లను షేర్ చేస్తున్నారు. విరాట్ కోహ్లీ సోదరుడు వికాస్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా కూడా కనిపించడం లేదని పేర్కొంటున్నారు. ఇప్పుడు, ఇద్దరి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం  కారణంగా కనిపంచడం లేదా, లేక వాళ్లే డీయాక్టివేట్ చేసుకున్నారా అనే ప్రశ్న తలెత్తుతుంది. త్వరలోనే దీనిపై కోహ్లీ స్పందించి పోస్ట్ చేసే అవకాశం ఉంది.