భారత మహిళా క్రికెట్ అంపైర్ వృందా ఘనశ్యామ్ రాఠీ అరుదైన ఘనత సొంతం చేసుకుంది. భారత తొలి మహిళా టెస్ట్‌ అంపైర్‌గా నిలిచి కొత్త చరిత్ర సృష్టించింది.  భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య ప్రారంభమైన టెస్ట్‌కు అంపైర్‌గా ఆమె బాధ్యతలు చేపట్టింది. తద్వారా టెస్ట్‌లకు అంపైరింగ్‌ చేస్తున్న తొలి భార త మహిళగా అరుదైన ఘనత దక్కించుకుంది. 2014లో ముంబయి క్రికెట్ అసోసియేషన్‌ నిర్వహించిన అంపైర్ల పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వృంద.... ఆ తర్వాత 2018లో బీసీసీఐ నిర్వహించిన పరీక్షలోనూ  ఉత్తీర్ణత సాధించింది. 2020లో ఐసీసీ డెవలప్‌మెంట్ ప్యానెల్ ఆఫ్ అంపైరింగ్‌కు కూడా ఆమె ప్రమోషన్‌ పొందింది. 2022లో యునైటెడ్ కింగ్‌డమ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో కూడా రాఠీ అంపైర్‌గా వ్యవహరించింది. ఈ ఏడాది చైనాలో జరిగిన ఆసియా క్రీడల్లోనూ అంపైర్‌గా వ్యవహరించింది. ముంబైకి చెందిన 34 ఏళ్ల వ్రింద 13 మహిళల వన్డేలలో, 43 టీ20లలో అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తించింది. మీడియం పేసర్ అయిన వృంద తన కాలేజీ రోజుల్లో నాలుగేళ్లపాటు ముంబయి యూనివర్సిటీకి  ప్రా తినిధ్యం వహించింది. 


ఇక ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌లో భారత మహిళలు అదరగొట్టారు. రికార్డులను బద్దలుగొడుతూ అద్భుత బ్యాటింగ్‌తో అలరించారు. తొలి రోజే 400కుపైగా స్కోరు సాధించి అబ్బుర పరిచారు. ఏకంగా నలుగురు బ్యాటర్లు అర్ధ సెంచరీలతో చెలరేగి టీమిండియాను తిరుగులేని స్థితిలో నిలిపారు. మహిళల టెస్ట్‌ క్రికెట్‌లో ఒకే రోజు 400కు పైగా పరుగులు సాధించిన రెండో జట్టుగా భారత మహిళలు రికార్డు సృష్టించారు. వందో టెస్ట్‌ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. తొలి రోజు ఆట ముగిసేసమయానికి టీమ్‌ఇండియా ఏడు వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది.


ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. 25 పరుగులకే తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌ ఆ తర్వాత కాసేపటికే మరో వికెట్‌ కోల్పోయింది. 47 పరుగులకే భారత జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. స్మృతీ మంధాన, షఫాలీ వర్మను ఇంగ్లాండ్‌ బౌలర్లు స్వల్ప వ్యవధిలో ఓపెనర్లను పెవిలియన్‌కు చేర్చిన ఆ తర్వాతే వారికి అసలు కష్టాలు మొదలయ్యాయి. తొలి టెస్ట్‌ ఆడుతున్న అరంగేట్ర బ్యాటర్ శుభా సతీష్‌ ఇంగ్లాండ్‌ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ  కేవలం 76 బంతుల్లో 69 పరుగులు చేసింది. వన్డే తరహాల్లో బ్యాటింగ్‌ చేసిన సతీష్‌ తన తొలి టెస్ట్‌ను మధుర జ్ఞాపకంగా మార్చుకుంది. జెమీమా రోడ్రిగ్స్‌ కూడా అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకుంది. 99 బంతుల్లో 68 పరుగులు జోడించింది. టాప్‌ ఆర్డర్‌లో ఇద్దరు బ్యాటర్లు రాణించడంతో 38 ఓవర్లకు భారత్‌ 190/4 స్కోరు సాధించింది.


కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్ కౌర్ 81 బంతుల్లో 49 పరుగులు చేసి అర్థసెంచరీకి కేవలం ఒక్క పరుగు ముందు అవుటై నిరాశ పరిచింది. కానీ యాస్తిర్‌ బాటియా 88 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, ఒక సిక్సుతో 66 పరుగులు చేసి సత్తా చాటింది. వీరిద్దరూ భాగస్వామ్యంతో ఆరు వికెట్ల నష్టానికి టీమిండియా 313 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. ఆ తర్వాత కూడా భారత బ్యాటర్లు మెరుగ్గా రాణించారు. లోయర్‌ ఆర్డర్‌లో దీప్తి శర్మ 60 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. దీప్తికి స్నేహ్‌ రాణా అండగా నిలిచింది. స్నేహ్‌ రాణా 73 బంతుల్లో 30 పరుగులు చేసి అవైటనా దీప్తి పట్టు వదలకుండా బ్యాటింగ్‌ చేసి క్రీజులో నిలిచింది. స్నేహ్‌ రాణా అవుటవ్వడంతో  టీమిండియా ఏడో వికెట్‌ కోల్పోయింది. అనంతరం పూజా వస్తాకర్ కూడా పర్వాలేదనిపించింది. 12 బంతులు ఎదుర్కొని నాలుగు పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఆట ముగిసే సమయానికి టీమిండియా  ఏడు వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది.