ICC Player of the Month: ఐసీసీ ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ అవార్డుల్లో టీమిండియా పేస్‌ స్టార్‌ మహ్మద్‌ షమీకి నిరాశ మిగిలింది. 2023 న‌వంబ‌ర్ నెల‌కు ఐసీసీ ప్లేయ‌ర్ ఆఫ్ ద మంత్ అవార్డు... ఆస్ట్రేలియా ఆరోసారి ప్రపంచ‌క‌ప్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించిన ట్రావిస్ హెడ్‌కు ల‌భించింది. మ‌హిళ‌ల విభాగంలో బంగ్లాదేశ్ యువ సంచ‌ల‌న స్పిన్నర్ న‌హీద అక్తర్‌కు ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డు లభించింది. ప్రపంచకప్‌లో అద్భుత ఆటతీరుతో సత్తా చాటిన టీమిండియా స్టార్‌ బౌలర్‌ మహ్మద్‌ షమీ నవంబర్‌ నెలకు ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డుకు నామినేట్‌ అయ్యాడు. మహ్మద్‌ షమీ, ఆస్ట్రేలియా ఆటగాళ్లు గ్లెన్‌ మాక్స్‌వెల్‌, ట్రావిస్‌ హెడ్‌ పేర్లను ఐసీసీ నవంబర్‌ నెలకు ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డుకు నామినేట్‌ చేసింది. ష‌మీ, మాక్స్‌వెల్, ట్రావిస్ హెడ్ తుదివరకు పోటీ ప‌డ‌గా చివ‌ర‌కు హెడ్‌కే అవార్డు ద‌క్కింది. దక్షిణాఫ్రికాతో జ‌రిగిన సెమీఫైన‌ల్లో 62 ప‌రుగులు, ఫైన‌ల్ మ్యాచులో 137 పరుగులు చేసిన హెడ్‌కు ఎక్కువ ఓట్లు ప‌డ్డాయి.  ప్లేయ‌ర్ ఆఫ్ ద మంత్ అవార్డు గెలవడం హెడ్‌కు ఇదే మొద‌టి సారి కాగా.. వార్నర్ త‌రువాత ఈ అవార్డు ద‌క్కించుకున్న రెండో ఆసీస్ ఆట‌గాడిగా నిలిచాడు.



 మ‌హిళ‌ల విభాగంలో ప్లేయ‌ర్ ఆఫ్ ద మంత్ అవార్డు కోసం బంగ్లాదేశ్‌కు చెందిన న‌హిదా అక్తర్, ఫ‌ర్గానా హ‌క్ ల‌తో పాటు పాకిస్థాన్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ సాదియా ఇక్బాల్ పోటీ ప‌డ్డారు. విండీస్‌తో జ‌రిగిన వ‌న్డే సిరీస్‌లో ఏడు వికెట్లు ప‌డ‌గొట్టిన బంగ్లాదేశ్ యువ స్పిన్ సంచ‌ల‌నం న‌హీద అక్తర్‌కు ఈ అవార్డు ల‌భించింది.  ప్లేయ‌ర్ ఆఫ్ ద మంత్ అవార్డు గెలుచుకున్న తొలి బంగ్లాదేశీ మ‌హిళా క్రికెట‌ర్‌గా న‌హిదా అక్తర్ రికార్డుల‌కు ఎక్కింది.


భారత్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో భారత స్టార్‌ పేసర్ మహ్మద్‌ షమీ(Mohammed Shami).. ప్రదర్శన క్రికెట్‌ అభిమానులకు చిరకాలం గుర్తుండిపోతుంది. అది మాములు ప్రదర్శన. ప్రతీ బంతికి వికెట్‌ తీసేలా.. బంతిబంతికి పరీక్ష పెట్టేలా..బుమ్రా, సిరాజ్‌లకు ఆత్మ విశ్వాసం పెరిగేలా షమీ చెలరేగిపోయాడు. బంతితో నిప్పులు చెరిగాడు. బాల్‌ అందుకుంటే వికెట్‌ పక్కా అనేంతలా అద్భుత ప్రదర్శన చేశాడు. ప్రతీ బంతికి వికెట్‌ తప్పదేమో అని బ్యాట్స్‌మెన్‌ను భయపెట్టాడు. తొలి నాలుగు మ్యాచుల్లో తుది జట్టులో ఆడే అవకాశమే దక్కని షమీ.. ఒక్కసారి అవకాశం దక్కిన తర్వాత తానేంటో నిరూపించాడు.


షమీ జట్టులో చోటు దొరకకపోయినా కుంగిపోయాడా.. లేదు.. తానేంటో నిరూపించుకోవాలన్న కసితో తీవ్రంగా సాధన చేశాడు. ఇప్పుడు దానికి తగ్గ ఫలాలను అందిస్తున్నాడు. ఈ ప్రపంచకప్‌లో లీగ్‌ దశలో తొలి నాలుగు మ్యాచ్‌లకు షమీని తుది జట్టులోకి తీసుకోలేదు. హార్దిక్‌ గాయం కారణంగా జట్టులోకి వచ్చిన షమీ తొలి మ్యాచ్‌లోనే పటిష్ఠమైన న్యూజిలాండ్‌ (New Zealand) బ్యాటర్లను బెంబేలెత్తించాడు. ఐదు వికెట్ల ప్రదర్శన చేసి తానేంటో నిరూపించుకున్నాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్‌పై 4, శ్రీలంకపై 5, దక్షిణాఫ్రికాపై 2 వికెట్లు తీశాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో షమీ’ విధ్వంసమే సృష్టించాడు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టి కివీస్‌ పతనాన్ని శాసించాడు. ఏడు వికెట్లతో కివీస్ పతనాన్ని శాసించడంతో.. అతనికే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ ఇచ్చారు. భారత బౌలింగ్‌ దళం రారాజుగా నిలిచి తనలో ఎంత కసి ఉందో చాటి చెప్పాడు.