భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య తొలి టీ20 మ్యాచ్‌ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండా రద్దయింది. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అసలు టాస్‌ కూడా వేయలేదు.  మ్యాచ్‌ ఆరంభం కావడానికి ముందే భారీ వర్షం ఆరంభమైంది. దీంతో కనీసం టాస్‌ వేయడానికి కూడా వాతావరణం సహకరించలేదు. వర్షం తగ్గితే ఓవర్లు కుదించైనా ఆటను నిర్వహించాలని అధికారులు భావించినా.. వరుణుడు ఏమాత్రం కరుణించలేదు. ఏకధాటిగా కురిసిన వర్షంతో మైదానం పూర్తి చిత్తడిగా మారింది. ఇక చేసేదేమీ లేక మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. మంగళవారం రెండో మ్యాచ్‌ జరుగుతుంది. ఆ మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. చివరి మ్యాచ్‌ గురువారం జరగనుంది. దక్షిణాసియా జనాభా అధికంగా ఉండే డర్బన్‌లో ఈ మ్యాచ్‌ కోసం నెల ముందుగానే టిక్కెట్లన్నీ అమ్ముడుపోయాయి. అయినా ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్‌ రద్దు కావడం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. దీనిపై భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌ తీవ్ర విమర్శలు చేశాడు. దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు వైఖరిపై మండిపడ్డాడు.

 

వర్షం పడుతున్న సమయంలో మైదానం మొత్తాన్ని కవర్లతో కప్పకుండా.. కేవలం పిచ్ వరకే కప్పడంపై దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుపై గవాస్కర్‌ విమర్శలు చేశాడు. కనీసం మైదానాన్ని కప్పేందుకు కూడా దక్షిణాఫ్రికా బోర్డు వద్ద డబ్బులు లేవా అని ఘాటుగా ప్రశ్నించాడు. సాధారణంగా వర్షం కురుస్తున్న సమయంలో ఏ క్రికెట్ స్టేడియాన్ని అయినా.. మైదానంలోని ప్రతీ మూల కవర్లతో కప్పి ఉంచుతారు. కానీ డర్బన్‌లో అలా జరగలేదు. కేవలం పిచ్‌ను.. దాంతో పాటు 30 యార్డ్ సర్కిల్‌ను మాత్రమే కవర్లతో కప్పి ఉంచారు. మిగతా భాగాన్ని అలాగే ఉంచేశారు. దీనిపై సునీల్ గవాస్కర్ దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుపై విమర్శలు గుప్పించాడు. వర్షం కురిసిన సమయంలో ప్రపంచంలోని చాలా స్టేడియాల్లో మాదిరిగా.. గ్రౌండ్ మొత్తాన్ని కవర్లతో కప్పి ఉంచాలని సూచించాడు.

 

మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచకపోతే వర్షం ఆగినా.. గంట వరకు మ్యాచ్ ప్రారంభం కాదని మీకు కూడా తెలుసని గుర్తు చేశాడు. మ్యాచ్ కోసం మైదానాన్ని సిద్ధం చేశాక.. అకస్మాత్తుగా వర్షం వస్తే ఏం చేయలేమని... కానీ వర్షం వస్తుందని తెలిసినప్పుడు పూర్తిగా కప్పేయాలి కదా అని ప్రశ్నించాడు. ప్రతి క్రికెట్ బోర్డు దగ్గరా డబ్బు ఉందని... చాలా డబ్బు వస్తోందిని... అందులో అనుమానం లేదన్నాడు. బీసీసీఐ దగ్గర ఉన్నంత డబ్బు మిగతా బోర్డుల దగ్గర లేకపోవచ్చు కానీ.. కానీ మైదానాన్ని పూర్తిగా కప్పేసేందుకు అవసరమైన కవర్లు కొనుగోలు చేయడానికి కావాల్సిన డబ్బు మాత్రం ఉంటుంది కద అని గవాస్కర్‌ అన్నాడు. వర్షం పడితే మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచడాన్ని అసలు నిర్లక్ష్యం చేయవద్దని ఈ దిగ్గజ క్రికెటర్‌ సూచించాడు.  భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య డిసెంబర్ 10 నుంచి మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో తొలి మ్యాచ్ రద్దు కావడంతో డిసెంబర్ 12న రెండో మ్యాచ్ గ్కెబెర్హాలో జరుగుతుంది. డిసెంబర్ 14న జోహన్నెస్ బర్గ్ లో మూడో టీ20 మ్యాచ్ జరుగుతుంది. టీ20 సిరీస్ తరువాత మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. డిసెంబర్ 17 నుంచి డిసెంబర్ 21 వరకు మ్యాచ్ లు జరగనున్నాయి. డిసెంబర్ 26 నుంచి రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ప్రారంభమవుతుంది.