Ind vs Eng Highlights:  టీ 20 ప్రపంచకప్‌(T20 World Cup) సెమీఫైనల్స్‌లో ఇంగ్లాండ్‌(England)కు దిమ్మతిరిగే షాక్ ఇస్తూ రోహిత్‌ సేన ఫైనల్‌కు చేరుకుంది. పూర్తి ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో బ్రిటీష్‌ జట్టును చావు దెబ్బ కొట్టి 2022 సెమీస్‌లో ఎదురైన ఘోర పరాభవానికి అదే రేంజ్‌లో ప్రతీకారం తీర్చుకుంది. బ్యాటింగ్‌ కష్టమైన పిచ్‌పైన ముందు భారీ స్కోరు చేసిన భారత జట్టు ఆ తర్వాత బౌలర్ల సమష్టి ప్రదర్శనతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా అన్ని విభాగాల్లోనూ సమష్టిగా రాణించి 68 పరుగుల తేడాతో విజయం సాధించింది. మైదానంలో ఫీల్డర్లు చిరుతపులుల్లా కదిలారు. దానికి ఈ మ్యాచ్‌లో భారత జట్టు చేసిన రెండు రనౌట్‌లే నిదర్శనం. అయితే ఈ సెమీస్‌లో ఇంగ్లాండ్ జట్టు ఓడిపోవడానికి ముచ్చటగా మూడు కారణాలు ఉన్నాయి. అవేంటంటే..?
 

శుభారంభం లభించినా..

బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై ఆరంభంలోనే ఇంగ్లాండ్‌కు మంచి శుభారంభం దక్కింది. అప్పటికే కళ్లు చెదిరే సిక్స్‌తో మంచి టచ్‌లో కనిపిస్తున్న విరాట్‌ కోహ్లీ త్వరగానే అవుటయ్యాడు. గత నాలుగు సెమీఫైనల్స్‌లో నాలుగు అర్థ సెంచరీలు చేసి నాకౌట్‌ మ్యాచుల్లో తిరుగులేని బ్యాటర్‌ అయిన కోహ్లీని తోప్లే త్వరగానే పెవిలియన్‌కు చేర్చాడు. విరాట్‌ 9 బంతుల్లో 9 పరుగులు చేసి అవుటయ్యాడు. కానీ ఇంగ్లాండ్‌ జట్టు దీనిని సద్వినియోగం చేసుకోలేకపోయింది. విరాట్‌ అవుటైన కాసేపటికే రిషబ్ పంత్ కూడా 4 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో టీమిండియా 40 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డట్లు కనిపించింది. ఇక్కడే ఇంగ్లాండ్‌ బౌలర్లు పట్టు విడిచారు. ఈ రెండు వికెట్ల తర్వాత రోహిత్-సూర్య మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. సరైన సమయంలో ఇంగ్లండ్ బౌలర్లు ఈ జోడీని విడదీయలేకపోయారు. దీంతో రోహిత్ 39 బంతుల్లో 57 పరుగులు చేయగా సూర్య 36 బంతుల్లో 47 పరుగులు చేసి టీమిండియాకు మంచి స్కోరు అందించారు. బ్రిటీష్‌ జట్టు ఓడిపోవడానికి తొలి అడుగు పడిందే వీరి భాగస్వామ్యంతో.

 

ఇంగ్లాండ్‌ ఓపెనర్ల వైఫల్యం..

ఇంగ్లండ్‌ ముందు టీమిండియా 172 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఈ మెగా టోర్నీలో అద్భుతంగా రాణిస్తున్న బ్రిటీష్‌ ఓపెనర్లు జోస్‌ బట్లర్‌- ఫిలిప్‌ సాల్ట్‌పైనే భారీ ఆశలు నెలకొన్నాయి. బట్లర్‌ మంచి ఫామ్‌లో కూడా ఉన్నాడు. వీరిద్దరూ ఆరంభంలో కాస్త ధాటిగానే ఆడడంతో భారత్‌కు కష్టంగానే కనిపించింది. కానీ ఇంగ్లండ్‌ ఓపెనర్లు వారి జట్టుకు అనుకున్న శుభారంభాన్ని మాత్రం ఇవ్వలేదు. 8 బంతుల్లో 5 పరుగులు మాత్రమే చేసి సాల్ట్ ఔటయ్యాడు. బుమ్రా వేసిన అద్భుత బంతికి సాల్ట్‌ బౌల్డయ్యాడు. 15 బంతుల్లో 23 పరుగులు చేసి దూకుడుగా ఆడేందుకు యత్నించిన బట్లర్‌ను... వేసిన తొలి బంతికే  అక్షర్ అవుట్ చేశాడు. ఓపెనర్లు త్వరగా అవుట్‌ కావడంతో ఇంగ్లాండ్‌పై ఒత్తిడి పెరిగింది. దాంతో తర్వాత వచ్చిన బ్యాటర్లు త్వరగా పెవిలియన్‌కు చేరిపోయారు. 

 

కుప్పకూలిన బ్యాటింగ్‌ ఆర్డర్‌

ఈ కీలకమైన సెమీస్‌లో ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్‌ కుప్పకూలింది. కనీస పోరాటం కూడా చేయలేకపోయింది. బట్లర్ రూపంలో తొలి వికెట్‌ పడిన తర్వాత బ్రిటీష్‌ జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌ పేక మేడను తలపించింది. జానీ బెయిర్‌స్టో అసలు పరుగులేమీ చేయకుండా పెవిలియన్‌ చేరాడు. మొయిన్ అలీ 8 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. 2 పరుగులే చేసి శామ్ కరణ్‌ ఔటయ్యాడు. హ్యారీ బ్రూక్ 19 బంతుల్లో 25 పరుగులు చేసి కాస్త పర్వాలేదనిపించాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ బ్యాటర్‌ చేసిన అత్యధిక పరుగులు ఇవే. లియామ్ లివింగ్‌స్టోన్ 11 పరుగులు చేసి, క్రిస్ జోర్డాన్ 1 పరుగు చేసి అవుటయ్యారు. భారత్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన బ్రిటీష్‌ జట్టు కేవలం 103 పరుగుల స్కోరుకే కుప్పకూలింది.