మిస్టర్‌ 360 ఏబీ డివిలియర్స్‌.. మైదానంలో నలుమూలల భారీ షాట్లతో విరుచుకుపడే బ్యాటర్‌. మైదానంలో దిగితే తనదైన ట్రేడ్‌ మార్క్‌ షాట్లతో ప్రత్యర్థి బౌలర్లపై తుపానులా విరుచుకుపడతాడు. కోహ్లీతో కలిసి ఎన్నో ఐపీఎల్‌లో ఎన్నో అద్భుత ఇన్నింగ్స్‌లు కూడా ఆడాడు. విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్‌తో కలిసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఎన్నో ఏళ్లు సేవలందించాడు. ఆర్సీబీకి ఎన్నో మరుపురాని విజయాలు అందించాడు.



 కానీ భీకర ఫామ్‌లో ఉన్నప్పుడే అకస్మాత్తుగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి క్రికెట్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు ఏబీడీ.  2004లో సౌతాఫ్రికా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ఏబీ డివిలియర్స్.. అనూహ్యంగా 2018లో ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కెరీర్ మంచి ఊపులో ఉన్న దశలో వీడ్కోలు పలికి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. డివిలియర్స్‌ నిర్ణయంతో యావత్ క్రికెట్ ప్రపంచం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. తాను అంత త్వరగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడానికి గల కారణాలను డివిలియర్స్‌ ఏడేళ్ల తర్వాత బయటపెట్టాడు. 2018లో రిటైర్మెంట్ పలికేటప్పుడు.. కుటుంబంతో గడిపేందుకు సమయం కోసమే.. ఆటకు దూరమైనట్లు ఏబీ డివిలియర్స్‌ చెప్పాడు. కానీ అసలు విషయం అది కాదని తాజాగా చెప్పుకొచ్చాడు.



తన చిన్న కొడుకు అనుకోకుండా తన్నడంతో ఎడమ కంటికి దెబ్బ తగిలిందని దాంతో తన కంటి చూపు లోపించిందని ఏబీ డివిలియర్స్‌ తెలిపాడు. కంటికి ఆపరేషన్ కూడా చేయించుకున్నానని... దీని తర్వాత ఆటకు దూరంగా ఉండమని డాక్టర్ సలహా ఇచ్చాడని ఏబీడీ తెలిపాడు. ఒకే కన్ను కనిపిస్తున్నా.. క్రికెట్ ఎలా ఆడారు అని.. కానీ లక్కీగా నా ఇంకో కన్ను చాలా క్లియర్‌గా కనిపించిందని డివిలియర్స్‌ గుర్తు చేసుకున్నాడు. ఇలాంటి కంటితో ఎలా ఇన్ని రోజులు ఆడావు అని డాక్టర్‌ కూడా ఆశ్చర్యపోయాడని డివిలియర్స్‌ తెలిపాడు. అదృష్టం కొద్దీ కెరీర్‌లో చివరి రెండేళ్లు తన ఎడమ కంటికి ఎలాంటి ఇబ్బంది కలగలేదని డివిలియర్స్‌ తెలిపాడు. కంటి చూపు బాగానే ఉండడంతో రెండేళ్ల పాటు ఐపీఎల్ సహా ఇతర లీగ్‌లలో ఆడానని డివిలియర్స్‌ తెలిపాడు. కంటి చూపు తగ్గడంతోనే 34 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్‌కు ఎందుకు వీడ్కోలు పలకాల్సి వచ్చిందని డివిలియర్స్‌ తెలిపాడు. ప్రపంచకప్ టోర్నీ కూడా గెలవకుండానే ఏబీడీ కెరీర్‌ను ముగించాడని ఫ్యాన్స్ బాధ పడ్డారు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ ఏబీడీ ట్రోఫీ సొంతం చేసుకోలేదు. 



 సౌతాఫ్రికా తరఫున 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20 మ్యాచుల్లో ప్రాతినిధ్యం వహించాడు. ఏబీ డివిలియర్స్. టెస్టుల్లో 8,765 పరుగులు, వన్డేల్లో 9577, టీ20ల్లో 1672 రన్స్ స్కోరు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 184 మ్యాచులు ఆడి.. 5,162 రన్స్ చేశాడు ఏబీడీ. ఐపీఎల్‌లో 2021 లో చివరి మ్యాచ్ ఆడాడు. విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్‌తో కలిసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఎన్నో ఏళ్లు సేవలందించాడు. ఆర్సీబీకి ఎన్నో మరుపురాని విజయాలు అందించాడు. దక్షిణాఫ్రికాకు కూడా ఎన్నో మరపురాని చిరస్మరణీయ విజయాలు అందించాడు. విభిన్నమైన షాట్లతో అలరించాడు. స్కూప్‌.. షాట్లకు కొత్త అర్థం చెప్పాడు.