India regain top spot in ICC Test Team Rankings: ఇంగ్లాండ్‌తో జరిగిన అయిదు టెస్టుల సిరీస్‌లో టీమిండియా(Team Indi అదరగొట్టింది. తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో ఓడిన రోహిత్‌ సేన... మిగిలిన నాలుగు టెస్టుల్లో విజయం సాధించి 4-1తో సిరీస్‌ కైవసం చేసుకుంది. ఈ గెలుపుతో ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌లో అగ్రస్థానం పదిలం చేసుకుంది. ఇప్పుడు మరో ఘనతను సాధించింది. తాజాగా ఐసీసీ ర్యాంకుల్లోనే భారత్ దూసుకొచ్చింది. టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమ్‌ఇండియా అగ్రస్థానానికి చేరుకుంది. ప్రస్తుతం భారత్ 122 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో నిలిచింది..  117 పాయింట్లతో రెండో స్థానంలో ఆస్ట్రేలియా.. 111 పాయింట్లతో ఇంగ్లాండ్‌ (England) మూడో స్థానంలో.. 101 పాయింట్లతో నాలుగో స్థానంలో న్యూజిలాండ్‌ 99  పాయింట్లతో దక్షిణాఫ్రికా అయిదో స్థానంలో నిలిచాయి.




 

వన్డేలు... టీ20ల్లోనూ

ఇప్పటికే వన్డేలు, టీ20ల్లోనూ భారతే టాప్‌ ర్యాంక్‌లో ఉంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలోనూ టీమ్‌ఇండియా  మొదటి స్థానంలో ఉంది. ఇప్పుడు టెస్టు ర్యాంక్‌తో కలిపి నాలుగింట్లోనూ టీమ్‌ఇండియా అగ్రస్థానం దక్కించుకుంది. 

 

ద్రవిడ్‌ ఏమన్నాడంటే..?

ఇలాంటి యువ జట్టుతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని ద్రవిడ్‌ అన్నాడు. విచంద్రన్ అశ్విన్‌ కమిట్‌మెంట్‌ తనను అబ్బురపరిచిందని టీమిండియా హెడ్‌కోచ్‌ తెలిపాడు. కుటుంబపరమైన ఎమర్జెన్సీ కారణంగా ఇంటికెళ్లిన అతడు.. కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే జట్టుతోపాటు చేరాడని... ఈ సిరీస్‌లో ఇవే అత్యుత్తమ క్షణాలని ద్రవిడ్‌ తెలిపాడు. జట్టు కోసం ఇలా చేయడం ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నాడు. కెప్టెన్ రోహిత్‌తో కలిసి తుది జట్టును ఎంపిక చేస్తుంటామని... ఇప్పటి వరకు ఏ ఆటగాడూ నిరాశపరచలేదని ద్రవిడ్ వెల్లడించాడు.

 

అశ్విన్‌ అరుదైన రికార్డు

ధర్మశాల వేదికగా జరిగిన వందో టెస్ట్‌ను భారత స్టార్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ చిరస్మరణీయం చేసుకున్నాడు. వందో టెస్ట్‌లో తొమ్మిది వికెట్లు తీసి సత్తా చాటాడు. చివరి టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి అశ్విన్‌ 9 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 4, రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన అశ్విన్‌.. అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. 36 సార్లు ఐదు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా అశ్విన్‌ రికార్డు సృష్టించాడు. 35 సార్లు అయిదు వికెట్లు తీసి అనిల్‌ కుంబ్లే నెలకొల్పిన రికార్డును అశ్విన్‌ ఈ మ్యాచ్‌తో బద్దలు కొట్టాడు. అత్యధిక సార్లు అయిదు వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో 67 సార్లు ఈ ఘనత సాధించి శ్రీలంక దిగ్గజ బౌలర్ ముత్తయ మురళీధరన్‌ అగ్రస్థానంలో ఉన్నాడు. షేన్‌ వార్న్‌ 37 సార్లు... అశ్విన్‌ 36 సార్లు ఈ ఘనత సాధించారు. రవిచంద్రన్‌ అశ్విన్‌ (Ravichandran Ashwin) ఓ క్రికెట్‌ మేధావి. బ్యాటర్లు ఆడే షాట్‌ను ముందే ఊహించి దానికి తగ్గట్లుగా బౌలింగ్‌ను మార్చుకుని వికెట్లను తీసే మేధావి. అందుకే టీమిండియా హెడ్‌కోచ్‌ ద్రావిడ్‌ కూడా తాను అశ్విన్‌లా క్రికెట్‌ మేధావిగా ఆలోచించాల్సి వస్తుందని ఓసారి వ్యాఖ్యానించాడు.