ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(IPL 2024)లో మినీ వేలం ప్రక్రియ ముగిసింది. ఇక ప్రపంచంలోనే అత్యంత విలువైన ఐపీఎల్‌ క్రికెట్‌(Cricket) సమరానికి రంగం సిద్ధమవుతోంది. దేశంలో IPL 2024 నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. మార్చి 23 నుంచి మే 29 వరకు ఈ టోర్నీ జరగనుంది. మొత్తం 10 జట్టు 74 మ్యాచ్ లు ఆడనున్నాయి. ఆటగాళ్ల వేలం ప్రక్రియ ఇటీవలే పూర్తికాగా.. అందుబాటులో ఉన్న ప్లేయర్లు ప్రాంచైజీల పర్యవేక్షలో ప్రాక్టీస్ మొదలు పెడుతున్నారు. అయితే ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌ టైటిల్ హ‌క్కుల‌ను టాటా గ్రూప్ కంపెనీ ద‌క్కించుకుంది. 2028 వ‌ర‌కు టాటానే టైటిల్ స్పాన్సర్‌గా వ్యవ‌హ‌రించ‌నుంది. అయిదేళ్ల వరకూ  టాటా గ్రూప్ భార‌త క్రికెట్ బోర్డుతో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. 

 

భారీ ఒప్పందం 

బీసీసీఐ(BCCI)తో టాటా చేసుకున్న  ఒప్పందం ప్రకారం ప్రతి ఐపీఎల్(IPL) సీజ‌న్‌కు టాటా సంస్థ.. బీసీసీఐకి రూ.500 కోట్లు ముట్టజెప్పనుంది. ఇన్విటేష‌న్ టు టెండ‌ర్ నిబంధ‌న‌ల ప్రకారం టాటా గ్రూప్ భార‌త్‌కు చెందిన మ‌రో కార్పొరేట్ కంపెనీ ఆఫ‌ర్‌ను అంగీరించ‌వ‌చ్చు. ఆదిత్యా బిర్లా గ్రూప్ రూ.2,500 కోట్ల ఆఫ‌ర్ ప్రక‌టించింది. టాటా కంపెనీ తొలిసారి 2022లో ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ హ‌క్కులు ద‌క్కించుకుంది. చైనాకు చెందిన వివో కంపెనీ టైటిల్ స్పాన్సర్‌గా వైదొల‌గ‌డంతో టాటాకు అవ‌కాశం వ‌చ్చింది. దాంతో, ప్రతి సీజ‌న్‌కు బీసీసీఐకి రూ.365 కోట్లు చెల్లించేందుకు టాటా అంగీక‌రించింది.

 

ధోనీ బరిలోకి దిగడం ఖాయం

ఐపీఎల్ 2023 తరువాత  ధోనీ ఐపీఎల్ నుంచి తప్పుకుంటారని ప్రచారం జరిగింది. గతేడాది టోర్నీ సమయంలో ధోనీ మోకాలి గాయంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఐపీఎల్ 2024 టోర్నీలో ఎంఎస్ ధోనీ పాల్గొనడంపై సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే  ధోనీ ఫిట్ గా ఉన్నాడని, రాబోయే సీజన్ లో ఐదుసార్లు విజేతగా నిలిచిన సీఎస్కే జట్టుకు నాయకత్వం వహిస్తాడని చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్ స్పష్టం చేశాడు. ఇప్పుడు ధోనీ ప్రాక్టీస్‌ మొదలెట్టడంతో అనుమానాలన్నీ పటాపంచలు అయిపోయాయి. 

 

ఏం ప్రభావం ఉండదు

గుజరాత్‌ జట్టును ఎవరు వీడినా.. ఎలాంటి ప్రభావం ఉండదని షమీ అన్నాడు. జట్టు సమతూకంగా ఉందా.. లేదా.. అన్న విషయాన్ని మాత్రమే చూడాలని షమీ స్పష్టం చేశాడు. హార్దిక్‌ కెప్టెన్‌గా రాణించాడని... జట్టును రెండుసార్లు ఫైనల్‌కు తీసుకెళ్లి.. ఒకసారి విజేతగా నిలిపాడని గుర్తు చేశాడు. కానీ.. అతడితో గుజరాత్‌ జీవితకాల ఒప్పందం ఏమీ చేసుకోలేదు కదా.. అని ఈ స్టార్‌ పేసర్‌ ప్రశ్నించాడు. గుజరాత్‌ జట్టులో ఉండాలా..? వద్దా.. అనేది పాండ్యా నిర్ణయమన్నాడు. ప్రస్తుతం శుభ్‌మన్‌ గిల్‌ కెప్టెన్‌ అయ్యాడని.... భవిష్యత్తులో అతడు నేర్చుకుంటాడని షమీ అన్నాడు. ఏదో ఒక రోజు అతడూ వెళ్లిపోవచ్చని... కానీ ఇదంతా ఆటలో భాగమని షమీ పేర్కొన్నాడు. ఎవరైనా కెప్టెన్‌ అయితే.. తన వ్యక్తిగత ప్రదర్శనను జాగ్రత్తగా చూసుకుంటూ.. జట్టు బాధ్యతలను నిర్వర్తించడం ఎంతో ముఖ్యమని షమీ అభిప్రాయపడ్డాడు. గిల్‌కు ఈ సారి ఆ బాధ్యతలు అప్పగించాం. అతడిపై ఒత్తిడి పెరగొచ్చు. అయితే.. అతడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నాడు.