Team India remains stuck in Barbados amid Hurricane threat: టీ 20 ప్రపంచకప్‌(T20 World Cup)ను కైవసం చేసుకుని... క్రికెట్‌ ప్రపంచాన్ని ఆనంద పారవశ్యంలో ముంచెత్తినా టీమిండియా(Team India) ఆటగాళ్లు ఇంకా భారత గడ్డపై కాలు మోపలేదు. ఫైనల్‌ జరిగిన బార్బడోస్‌( Barbados)లో తుపాను హెచ్చరికలు జారీ చేయడంతో భారత ఆటగాళ్లు అక్కడే చిక్కుకుపోయారు. ఈ తుపాను తగ్గేది ఎప్పుడు... విశ్వ విజేతలు స్వదేశంలో అడుగు పెట్టేదెప్పుడు అనే అభిమానుల ఉత్కంఠల మధ్య బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. బార్బడోస్‌లో చిక్కుకున్న భారత ఆటగాళ్లను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.


 

వస్తున్నారు జగజ్జేతలు

బార్బడోస్‌లో చిక్కుకున్న టీమిండియా ఆటగాళ్లను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. బార్బడోస్ గడ్డపై జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి భారత జట్టు T20 ప్రపంచ కప్ 2024 టైటిల్‌ను గెలుచుకుంది. జూన్ 29న రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ఛాంపియన్‌గా నిలిచింది. ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత భారత జట్టు తిరిగి భారత్‌కు రావాల్సి ఉంది. కానీ బార్బడోస్‌లో బెరిల్ హరికేన్ విరుచుకుపడుతుండడంతో టీమిండియా ఆటగాళ్లు అక్కడే చిక్కుకుపోయారు. భారత ఆటగాళ్లు తిరిగి ఎప్పుడు స్వదేశానికి వస్తారో అని ఎదురుచూస్తున్న అభిమానులకు బీసీసీఐ శుభవార్త చెప్పింది. భారత ఆటగాళ్లు బార్బడోస్ నుంచి భారత్‌కు ఎప్పుడు చేరుకుంటారన్న దానిపై బీసీసీఐ స్పష్టత ఇచ్చింది. బార్బడోస్ నుంచి ఇవాళ సాయంత్రం  టీమ్ ఇండియా ఆటగాళ్లు ప్రత్యేక విమానంలో భారత్‌కు బయలు దేరుతారని... బుధవారం సాయంత్రం విమానం ఢిల్లీకి చేరుకుంటుందని బీసీసీఐ వెల్లడించింది. 

 

జై షా కూడా జట్టుతోపాటే..

తాను కూడా టీమిండియా ఆటగాళ్లతోనే తిరిగి భారత్‌కు వస్తానని బీసీసీఐ(BCCI) కార్యదర్శి జై షా ఇప్పటికే వెల్లడించారు. ఇప్పుడు బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో భారత ఆటగాళ్లు బార్బడోస్‌ నుంచి స్వదేశానికి బయలుదేరనున్నారు. టీమ్ ఇండియా తిరిగి భారత్‌కు వచ్చేందుకు ఏర్పాట్లు జరిగాయని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. బార్బడోస్‌లోని కెన్సింగ్‌టన్ ఓవల్‌లో జరిగిన ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి భారత జట్టు విశ్వవిజేతగా నిలిచింది. టీమ్ ఇండియా రెండో టీ20 ప్రపంచకప్‌ను సాధించి భారత క్రికెట్‌ అభిమానులను ఆనంద సాగరంలో ముంచెత్తింది. భారత్‌కు చేరుకున్న తర్వాత టీమిండియా ఆటగాళ్లకు ఘన స్వాగతం పలికేందుకు అభిమానులు సిద్ధంగా ఉన్నారు. త్రివర్ణ పతాకాలు చేతపట్టి భారీ ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగతున్నట్లు తెలుస్తోంది. భారత్ తొలిసారిగా 2007లో టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత రెండో టైటిల్‌ను గెలుచుకోవడానికి భారత్‌కు 17 ఏళ్లు పట్టింది. ధోని సారథ్యంలో భారత్ తొలి టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకోగా... ఇప్పుడు రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా రెండో టైటిల్‌ను అందుకుంది. ఇక భారత్‌ పరిమిత ఓవర్ల ఫార్మట్‌లో మూడు టైటిళ్లను గెలుచుకోగా... టెస్ట్‌ ఛాంపియన్‌ షిప్‌ ఒక్కటి భారత్‌కు అందని ద్రాక్షలా మారింది. దానిని కూడా సాధిస్తే భారత జట్టు అన్ని ఫార్మట్లలో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించినట్లు అవుతుంది.