IND vs END Semi Final: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ రెండో సెమీస్‌లో టీమ్‌ఇండియా గౌరవప్రదమైన స్కోర్‌ చేసింది. ఇంగ్లాండ్‌కు 169 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. ఆసీస్‌ గడ్డపై అడిలైడ్‌ తన అడ్డా అని విరాట్‌ కోహ్లీ (50; 40 బంతుల్లో 4x4, 1x6) మరోసారి నిరూపించాడు. అర్ధశతకంతో జట్టును ఆదుకున్నాడు. హార్దిక్‌ పాండ్య (63; 33 బంతుల్లో 4x4, 5x6) అతడికి అండగా నిలిచాడు. సిక్సర్లు దంచికొట్టాడు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (27; 28 బంతుల్లో 4x4, 0x6) ఫర్వాలేదనిపించాడు. ఇంగ్లాండ్‌ బౌలర్లు ప్లానింగ్‌కు తగ్గట్టే బౌలింగ్‌ చేశారు.




పాండ్య, కోహ్లీ లేకుంటే!


అడిలైడ్‌లో రాత్రంతా వర్షం. కవర్ల కిందే పిచ్‌. ఔట్‌ ఫీల్డ్‌పై తేమ. ఆకాశంలో మబ్బులు! ఇలాంటి కఠినమైన పరిస్థితుల్లో టీమ్‌ఇండియా మొదట బ్యాటింగ్‌కు దిగాల్సి వచ్చింది. టాస్‌ గెలవడంతో జోస్‌ బట్లర్‌ బౌలింగ్‌ తీసుకొని భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టేందుకు ప్రయత్నించాడు. జట్టు స్కోరు 9 వద్దే ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (5) క్రిస్‌ వోక్స్‌ ఔట్‌ చేశాడు. అదనపు బౌన్స్‌తో వచ్చిన బంతిని ఆడబోయి జోస్‌ బట్లర్‌కు కేఎల్‌ క్యాచ్‌ ఇచ్చాడు.


ఆంగ్లేయులు కఠినంగా బౌలింగ్‌ చేస్తుండటంతో కోహ్లీ, రోహిత్ నిలకడగా ఆడారు. రెండో వికెట్‌కు 47 రన్స్‌ భాగస్వామ్యం అందించడంతో 7.5 ఓవర్లకు స్కోరు 50కి చేరుకుంది. వేగం పెంచే క్రమంలో రోహిత్‌ 8.5వ బంతికి ఔటయ్యాడు. సూర్యకుమార్‌ (14) త్వరగానే పెవిలియన్‌ చేరడంతో హార్దిక్‌ పాండ్య క్రీజులోకి వచ్చాడు. 39 బంతుల్లో 50 చేసిన కోహ్లీకి అండగా నిలిచాడు. నాలుగో వికెట్ కు 40 బంతుల్లో 61 పరుగుల భాగస్వామ్యం నెకలొల్పాడు. మొదట్లో ఒకట్రెండు బంతుల్ని నిలకడగా ఆడిన పాండ్య డెత్‌ ఓవర్లలో వరుస సిక్సర్లు, బౌండరీలు బాదేశాడు. 29 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ అందుకున్నాడు. జట్టు స్కోరును 168/6కి చేర్చాడు.