ప్రపంచ క్రికెట్‌లో దిగ్గజ క్రికెటర్లకు.. స్టార్‌ బ్యాటర్లకు.. ఎన్నో రికార్డును తమ వశం చేసుకున్న ఆటగాళ్లకు సాధ్యం కాని రికార్డును జింబాబ్వే బ్యాటర్‌ సాధించాడు. అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుని ఔరా అనిపించాడు. ఇప్పటివరకూ ప్రపంచ క్రికెట్‌లో ఎవ్వరికీ సాధ్యంకాని రికార్డును కైవసం చేసుకుని అబ్బురపరిచాడు. జింబాబ్వే కెప్టెన్‌(Zimbabwe captain) సికిందర్‌ రజా(Sikandar Raza )అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా ఐదు అర్ధ సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఆదివారం కొలంబోలో శ్రీలంక(Sri Lanka) తో జరిగిన తొలి టీ20లో 62 పరుగులు చేసిన సికిందర్‌ రజా.. ఈ అరుదైన ఘనత అందుకున్నాడు. సికిందర్‌ గత ఐదు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 58, 65, 82, 65, 62 స్కోర్లు చేశాడు. జింబాబ్వే క్రికెట్‌ జట్టుకు పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో సారథిగా సికందర్‌ రజా వ్యవహరిస్తున్నాడు. 

 

మంచి ఫామ్‌లో రజా

గతేడాది ఐసీసీ నిర్వహించిన ఆఫ్రికా రీజియన్‌ క్వాలిఫయర్స్‌ మ్యాచ్‌లలో భాగంగా నవంబర్‌లో రువాండా (58), నైజీరియా (65), కెన్యా (82) పై అర్థ సెంచరీలు చేశాడు. ఆ తర్వాత స్వదేశంలో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా అతడు.. తొలి మ్యాచ్‌లో 65 రన్స్‌ చేశాడు.  తాజాగా లంకతో తొలి మ్యాచ్‌లోనే 62 పరుగులు చేసి నిలకడను మరోసారి చాటిచెప్పాడు. ఇలా వరుసగా  అయిదు ఇన్నింగ్సుల్లో శతకాలు సాధించిన రజా కొత్త చరిత్ర సృష్టించాడు. లంకపై అర్ధ శతకం చేసి అగ్రశ్రేణి బ్యాటర్లు, హిట్టర్లకు సాధ్యం కాని రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ 20 క్రికెట్‌లో బ్రెండన్ మెక్‌కల్లమ్, క్రిస్‌ గేల్, క్రెయిగ్ విలియమ్స్‌, రేయాన్ పఠాన్, గుస్తావ్ మెకియోన్, రిజా హెండ్రిక్స్‌ టీ20ల్లో వరుసగా నాలుగు అర్ధ సెంచరీలు బాదారు. తాజాగా వీరిని సికిందర్‌ రజా అధిగమించాడు.  వరల్డ్‌ క్రికెట్‌లో ఆల్‌ రౌండర్‌గా గుర్తింపుపొందుతున్న రజా.. జింబాబ్వే క్రికెట్‌కు పూర్వవైభవం తెచ్చేందుకు కృషి చేస్తున్నాడు. 

 

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే

ఉత్కంఠ‌భ‌రితంగా సాగిన తొలి టీ20లో శ్రీలంక మూడు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఐదు వికెట్లు కోల్పోయి 143 ప‌రుగులు చేసింది. ఈ ల‌క్ష్యాన్ని శ్రీలంక స‌రిగ్గా 20 ఓవ‌ర్లలో ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

 

ఇటీవలే ట్రిపుల్‌ సెంచరీ

జింబాబ్వే య‌వ క్రికెట‌ర్ అంతిమ్ న‌క్వీ చ‌రిత్ర సృష్టించాడు. ఆండీ ఫ్లవ‌ర్, గ్రాంట్ ఫ్లవ‌ర్ వంటి దిగ్గజాల‌కు సైతం సాధ్యం కాని రికార్డు నెల‌కొల్పాడు. జింబాబ్వే త‌ర‌ఫున తొలి ట్రిపుల్ సెంచ‌రీ న‌మోదు చేశాడు. మిడ్ వెస్ట్ రైనోస్ కెప్టెన్ అయిన అంతిమ్ రెండో సీజ‌న్‌లోనే త‌డాఖా చూపించాడు. జింబాబ్వే త‌ర‌ఫున అత్యధిక వ్యక్తిగ‌త స్కోర్ కొట్టాడు. లోగ‌న్ క‌ప్ మ్యాచ్‌లో భాగంగా మెటాబెలెల‌లాండ్ ట‌స్కర్స్ జ‌ట్టుతో జ‌రిగిన మ్యాచ్‌లో అంతిమ్ దంచికొట్టాడు. 295 బంతుల్లోనే 30 ఫోర్లు, 10 సిక్సర్లతో ట్రిపుల్ సెంచ‌రీ మార్కును అందుకుని రికార్డులు బ‌ద్ధలు కొట్టాడు. అంతిమ్ 265 పరుగుల స్కోర్ వ‌ద్ద లోగ‌న్ క‌ప్ ఫ‌స్ట్ క్లాస్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇక 280 ర‌న్స్ దాటిన అంతిమ్ 1967-68 మ‌ధ్య రే గ్రిప్పర్ 279 ర‌న్స్‌తో నెల‌కొల్పిన రికార్డును అధిగ‌మించాడు.