అఫ్గానిస్థాన్‌(Afghanistan)తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే టీమిండియా(Team India) కైవసం చేసుకుంది. అయితే  టీ 20 ప్రపంచకప్‌ (T20 World Cup)నకు ముందు ఉన్న ఈ కీలక సిరీస్‌లో శ్రేయ‌స్ అయ్యర్‌కు చోటు దక్కకపోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనిపై తొలిసారి శ్రేయస్‌ అయ్యర్‌ స్పందించాడు. త‌న ఆధీనంలో లేని విష‌యాల గురించి ప‌ట్టించుకోన‌ని.. త‌న‌కు ఇచ్చిన బాధ్యత‌ను స‌క్రమంగా నిర్వర్తించ‌డంపై మాత్రమే శ్రద్ధ పెడ‌తాన‌ని తేల్చి చెప్పాడు. ప్రస్తుతం త‌ను అదే ప‌నిలో ఉన్నాన‌ని పేర్కొన్నాడు. గ‌తం గురించి ఆలోచించ‌ను. వ‌ర్తమానంలో జీవించాల‌ని అనుకుంటున్నానని అయ్యర్‌ అన్నాడు. 


రంజీలు ఆడమన్నారు..  ఆడేశా...
తనకు ఏ ప‌నినైతే అప్పగించారో అది విజ‌య‌వంతంగా పూర్తి చేశానని.. తనను రంజీ మ్యాచ్‌ ఆడమన్నారని... ఆడాను తన ప్రణాళికలు అమలు చేశానని అయ్యర్‌ తెలిపాడు. రంజీ ట్రోఫీలో తన ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నానని... కొన్ని విష‌యాలు మ‌న ఆధీనంలో ఉండ‌వని... అలాంటి వాటి గురించి ఆలోచించ‌క‌పోవ‌డ‌మే మంచిదని అయ్యర్‌ అన్నాడు. రంజీ మ్యాచ్ ద్వారా కావాల్సినంత ప్రాక్టీస్ ల‌భించిందని తెలిపాడు. ఇంగ్లండ్‌తో మొద‌టి రెండు టెస్టుల్లో ఎలా ఆడాల‌న్నదాని గురించే ప్రస్తుతం ఆలోచిస్తున్నానని... తన ధ్యాసంతా ఆ రెండు మ్యాచ్‌లపైనే ఉందని  పేర్కొన్నాడు. కాగా స్వదేశంలో ఇంగ్లండ్‌తో టీమిండియా ఐదు టెస్టుల సిరీస్ జ‌న‌వ‌రి 25 నుంచి ఆరంభం కానుంది. తొలి రెండు మ్యాచ్‌ల‌కు ప్రక‌టించిన జ‌ట్టులో శ్రేయ‌స్ అయ్యర్‌కు చోటు ద‌క్కింది.


రంజీ మ్యాచ్‌లో ఇలా...
దేశ‌వాళీ క్రికెట్‌లో ఆడాలని శ్రేయ‌స్ అయ్యర్‌ను టీమ్‌ మేనేజ్‌మెంట్‌ సూచించింది. దానికి తగ్గట్లుగా అయ్యర్‌ ముంబై తరపున బరిలోకి దిగాడు. ఆంధ్రాతో జ‌రిగిన మ్యాచ్‌లో 48 ప‌రుగుల‌తో ఆక‌ట్టుకున్న అయ్యర్‌.. 145కు పైగా ఓవ‌ర్లపాటు ఫీల్డింగ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో ఆంధ్ర జ‌ట్టుపై ముంబై 10 వికెట్ల తేడాతో జ‌య‌భేరి మోగించింది.


సిరీస్‌ భారత్‌ కైవసం
అఫ్గానిస్థాన్‌(Afghanistan )తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌ను టీమిండియా(Team India) మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. యశస్వి జైస్వాల్‌(Yashasvi Jaiswal), శివమ్ దూబే (Shivam Dube) మెరుపు ఇన్నింగ్స్‌తో రోహిత్‌ సేన మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన అఫ్గానిస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌట్‌ అయింది. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. మరో 26 బంతులు మిగిలి ఉండగానే సునాయసంగా లక్ష్యాన్ని ఛేదించింది. యశస్వి జైస్వాల్‌, శివమ్ దూబే అర్థ శతకాలతో భారత్‌కు విజయాన్ని అందించారు. 173 పరుగుల లక్ష్య ఛేదనలో యశస్వి జైస్వాల్‌ అఫ్గాన్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. కేవలం 34 బంతుల్లో 5 ఫోర్లు, 6 భారీ సిక్సర్లతో యశస్వి 68 పరుగులు చేసి మ్యాచ్‌ను భారత్‌ వైపు తిప్పేశాడు. 14 నెలల తర్వాత టీ 20ల్లో బరిలోకి దిగిన విరాట్‌ కోహ్లీ ఉన్నంతసేపు మంచి టచ్‌లో కనిపించాడు. కేవలం 16 బంతుల్లో అయిదు చూడముచ్చని ఫోర్లతో కింగ్‌ కోహ్లీ 29 పరుగులు చేశాడు. శివమ్‌ దూబే కేవలం 32 బంతుల్లో 5 ఫోర్లు 4 సిక్సర్లతో దూబే 63 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దూబే విధ్వంసంతో మ్యాచ్‌ భారత్‌ వశమైంది. 173 పరుగుల లక్ష్యాన్ని మరో 26 బంతులు మిగిలి ఉండగానే కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి భారత్‌ ఛేదించింది.