Shikhar Dhawan Son Zoravar Birthday: న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్ శిఖర్‌ ధావన్‌ (Shikar Dhawan) గత కొన్నాళ్లుగా వ్యక్తిగతంగా, కెరీర్ లోనూ కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నాడు. ఓవైపు భార్య అయేషా ముఖర్జీ (Ayesha Mukherjee) నుంచి మానసిక వేధింపులు భరించలేక కోర్టు నుంచి విడాకులు తీసుకున్నాడు. కానీ అప్పటినుంచి శిఖర్ ధావన్ కు భార్య నుంచి వేధింపులు రెట్టింపయ్యాయి. కుమారుడ్ని ధావన్ కు దూరం చేసిన మాజీ భార్య అయేషా కనీసం సోషల్ మీడియాలో సైతం జోరావర్ కు సంబంధించిన వివరాలు క్రికెటర్ కు తెలియకుండా జాగ్రత్త పడుతోంది. ఈ విషయాలను తన ఫాలోయర్లతో ధావన్ ఓ పోస్టు ద్వారా షేర్ చేసుకున్నాడు. నేడు ధావన్ కుమారుడు జోరావర్ (Shikhar Dhawan Son Zoravar) పుట్టినరోజు. మిగతా తండ్రుల్లా ధావన్ తన కుమారుడ్ని కలుసుకోలేకపోతున్నాడు. ఇంకా చెప్పాంలంటే కుమారుడ్ని నేరుగా కలిసి ఏడాది దాటిపోయిందని, వీడియో కాల్స్, సోషల్ మీడియాలో అయితే గత మూడు నెలలుగా కొడుకు జోరావర్ ను కాంటాక్ట్ అయ్యే ఛాన్స్ లేకుండా పోయిందని వాపోయాడు. 


కుమారుడు జోరావర్‌తో టచ్‌లోకి రాకుండా, అతడి వివరాలు తనకు తెలియకుండా ఉండేలా మాజీ భార్య అయేషా అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో తనను బ్లాక్ చేసిందని శిఖర్ ధావన్ ఆవేదన వ్యక్తం చేశాడు. కుమారుడి పుట్టినరోజు సందర్భంగా తన పరిస్థితిని వివరిస్తూనే.. జోరావర్ కు బర్త్ డే విషెస్ తెలుపుతూ ఇన్ స్టా్గ్రామ్‌లో ఉద్వేగభరితంగా చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.  


శిఖర్ ధావన్ చేసిన పోస్టులో ఏముందంటే..
‘నిన్ను నేను నేరుగా కలిసి ఏడాది అవుతోంది. కనీసం వీడియో కాల్ లోనైనా కుమారుడు (జోరావర్)తో మాట్లాడి మూడు నెలలు దాటిపోయింది. నా నుంచి నిన్ను దూరం చేసేందుకు ప్రయత్నం జరుగుతోంది. సోషల్ మీడియా అన్ని ప్లాట్ ఫాంలలో నన్ను బ్లాక్ చేశారు. అందుకే గతంలో నీతో వీడియో కాల్ మాట్లాడినప్పుడు తీసిన ఫొటోను పోస్ట్ చేస్తున్నాను. హ్యాపీ బర్త్‌డే మై బాయ్. 






నిన్ను(జోరావర్), నేను నేరుగా మాట్లాడకపోవచ్చు. కానీ టెలీపతితో ఎప్పటికీ నీకు దగ్గరగా ఉంటాను. నువ్వు ఉన్నతంగా ఎదుగుతావని, సంతోషంగా ఉంటావని ఆశిస్తున్నాను. నీ విషయంలో నేను గర్వపడుతున్నాను. మీ నాన్న నిన్ను ఎప్పుడూ మిస్ అవుతుంటాడు. అయినా నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. నీ నవ్వు చూస్తానని ఆశగా ఎదరుచూస్తుంటా. దేవుడి దయ వల్ల అంతా మంచి జరిగి మళ్లీ మనం కలుస్తామని ఆశిస్తున్నాను. చిలిపిగా ఉండాలి, కానీ చెడువైపు వెళ్లవద్దు. ధైర్యంగా ఉంటూనే ఇతరుల పట్ల దయ, జాలి, సహనంతో వ్యవహరించాలి. నిన్ను నేను చూడకపోయినా.. నువ్వు ఎలా ఉన్నావు, ఏం చేస్తుంటావని ప్రతిరోజూ నీకోసం మెస్సేజ్‌లు రాస్తుంటా. నా క్షేమ సమాచారంతో పాటు జీవితంలో జరిగే మార్పుల గురించి ఎప్పటికప్పుడూ షేర్ చేస్తుంటాను’ లవ్ యూ జోరా అని తన కుమారుడు జోరావర్ బర్త్‌డే రోజు భావోద్వేగంతో ఇన్‌స్టాగ్రామ్‌లో శిఖర్ ధావన్ పోస్ట్ చేశాడు. ఇది చదివిన నెటిజన్లు, ధావన్ ఫ్యాన్స్ స్టార్ క్రికెటర్ కు మద్దతు తెలుపుతున్నారు. త్వరలోనే నీ కుమారుడ్ని చూస్తావని కామెంట్ చేస్తున్నారు.  


ధావన్ టీమిండియాలో చోటు కోసం ఎదురుచూస్తున్నాడు. అయితే జూనియర్లు రావడంతో ఈ వెటరన్ కు ఛాన్స్ లు రావడం లేదు. ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.