Musheer Khan Breaks Sachin Tendulkar Record: దేశవాళీ ప్రతిష్టాత్మక ట్రోఫీ రంజీ ట్రోఫీ(Ranji Trophy)లో సర్ఫరాజ్‌ ఖాన్(Sarfaraz khan ) సోదరుడు ముషీర్‌ ఖాన్‌(Musheer khan) అదరగొడుతున్నాడు. ఈ సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ముషీర్‌... కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతూ జాతీయ జట్టులో చోటు దిశగా బలంగా ఆడుతున్నాడు. రంజీ ట్రోఫీ ఫైనల్లోనూ విదర్భపై అద్భుతమైన సెంచరీ చేసి... ముంబైకు భారీ ఆధిక్యాన్ని అందించాడు. ఫైనల్లో తొలి ఇన్నింగ్స్‌లో ఆరు పరుగులే చేసి నిరాశపరిచిన ముషీర్‌.. రెండో ఇన్నింగ్స్‌లో శతకంతో చెలరేగాడు. 326 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 136 పరుగులు చేశాడు. ఈ శతకంతో క్రికెట్‌ గాడ్ సచిన్‌ టెండూల్కర్‌ పేరిట ఉన్న రికార్డును ముషీర్‌ బ్రేక్‌ చేశాడు. 19 ఏళ్లు ముషీర్‌ఖాన్‌ రంజీ ట్రోఫీ ఫైనల్‌లో శతకం బాదిన పిన్నవయసు ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. సచిన్‌ 22 ఏళ్ల వయసులో 1994-95 సీజన్‌ రంజీ ట్రోఫీ ఫైనల్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలతో కదం తొక్కాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 140, రెండో ఇన్నింగ్స్‌లో 139 పరుగులు చేసి ముంబైని విజేతగా నిలిపాడు.

 

ఫైనల్‌ సాగుతుందిలా..

దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌ రంజీ ట్రోఫీని మరోసారి దక్కించుకునేందుకు ముంబై జట్టు సిద్ధమైంది. ఇప్పటికే 41 సార్లు రంజీ ట్రోఫీ విజేతగా నిలిచిన ముంబై..మళ్లీ ఆ కప్పును అందుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంది. విదర్భతో జరుగుతున్న పైనల్‌లో ముంబై తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ఓవర్‌నైట్‌ స్కోరు 141/2 స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన ముంబై.. 418 రన్స్‌కు ఆలౌటైంది. ఈక్రమంలో విదర్భ జట్టు ముందు 538 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్‌ ఖాన్‌ తమ్ముడు ముషీర్‌ ఖాన్‌ అద్భుత శతకంతో ముంబైకు తిరుగులేని ఆధిక్యాన్ని అందించాడు. 326 బంతులు ఎదుర్కొన్న ముషీర్ ఖాన్‌ 10 ఫోర్లతో 136 పరుగులు చేశాడు. శ్రేయస్ అయ్యర్ 111 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 95 పరుగులు చేసి త్రుటిలో శతకం చేజార్చుకున్నాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 14 నెలల తర్వాత అయ్యర్‌కు ఇది తొలి అర్ధ శతకం కావడం విశేషం. ముంబై కెప్టెన్ అజింక్య రహానె కూడా హాఫ్‌ సెంచరీతో మెరిశాడు. 143 బంతుల్లో 73 పరుగులు చేశాడు. మరో ముంబై బ్యాటర్‌ శామ్స్‌ ములాని  కూడా అర్ధ శతకం బాది నాటౌట్‌గా నిలిచాడు. విదర్భ బౌలర్లలో హర్ష్‌ దూబె ఐదు వికెట్లతో ఆకట్టుకున్నాడు. యశ్ ఠాకూర్‌ 3, ఆదిత్య థాక్రే, అమన్‌ తలో వికెట్ పడగొట్టారు. మూడో రోజు ఆట ముగిసేసరికి విదర్భ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 10 పరుగులు చేసింది. ధ్రువ్ షోరె (7), అథర్వ తైడే (3) నాటౌట్‌గా క్రీజులో ఉన్నారు. 

 

గెలిస్తే కొత్త చరిత్రే

ఇంకా రెండు రోజుల ఆట మిగిలున్న రంజీ ట్రోఫీ ఫైనల్‌లో విదర్భ నెగ్గాలంటే ఏదైనా అద్భుతం జరగాల్సిందే. భారత పిచ్‌లపై నాలుగు, ఐదు రోజులలో బంతి స్పిన్‌కు అనుకూలంగా ఉంటుంది. విదర్భ బ్యాటింగ్‌ లైనప్‌ కూడా అంత పటిష్టంగా లేదు. ఈ పరిస్థితులలో ముంబై బౌలర్లను ఎదుర్కుని 538 పరుగులు చేయాలంటే ఆ జట్టు చెమటోడ్చాల్సిందే. రెండు రోజులు క్రీజులో నిలిచి కొండను కరిగించగలిగితే విదర్భ కొత్త చరిత్ర సృష్టించినట్టే.