Rishabh Pant Health:


టీమ్‌ఇండియా క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌ వేగంగా కోలుకుంటున్నాడు. ఐసీయూలో చికిత్స పొందుతున్న అతడిని ప్రైవేటు గదికి తరలించారు. ఇన్ఫెక్షన్‌ ప్రమాదాన్ని తగ్గించేందుకే ఇలా చేశారు. అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. గాయాల నుంచి త్వరగా కోలుకుంటున్నాడు. ప్రస్తుతం అతడు డెహ్రాడూన్‌లోనే చికిత్స పొందుతున్నాడు. మోకాలిలో లిగమెంట్ల చికిత్స కోసం అతడిని విదేశాలకు పంపించడంపై బీసీసీఐ నిర్ణయం తీసుకోనుందని తెలిసింది. అతడు త్వరగా కోలుకొనేందుకు ప్రైవసీ కల్పించాలని కుటుంబ సభ్యులు కోరారు.


ఉత్తరాఖండ్‌ లోని రూర్కీలో  రిషభ్‌ పంత్‌  ప్రమాదానికి గురయ్యాడు. అతడు ప్రయాణిస్తున్న  కారు డివైడర్‌ను ఢీ కొట్టింది. కారు దగ్ధమయ్యే లోపే స్థానికులు అతడిని రక్షించారు. ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్‌  వెళ్తుండగా దిల్లీ, డెహ్రడూన్ హైలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరగ్గానే ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగడంతో పంత్‌ కిందికి దూకేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఒంటరిగా డ్రైవ్‌ చేస్తుండగా ఓ గుంతను తప్పించే క్రమంలో ప్రమాదం చోటుచేసుకుందని సమాచారం.


'రిషభ్ పంత్‌ నుదురుపై రెండు గాట్లు ఉన్నాయి. కుడి మోకాలిలోని లిగమెంట్లలో చీలిక వచ్చింది. అతడి కుడి చేతి మణికట్టు, కుడి కాలి పాదం, మడమల్లో గాయాలు అయ్యాయి. వెన్నెముక భాగంలోనూ కాలిన గాయాలు ఉన్నాయి. ప్రస్తుతానికి అతడి పరిస్థితి మెరుగ్గా ఉంది. ప్రాథమిక చికిత్స తర్వాత డెహ్రాడూన్‌లోని మాక్స్‌ ఆస్పత్రికి తరలించాం. గాయాల తీవ్రత తెలుసుకొనేందుకు ఎమ్మారై స్కానింగ్‌ చేస్తున్నారు. ఏమైందో తెలియగానే పూర్తి స్థాయి చికిత్స చేస్తారు. పంత్‌ కుటుంబ సభ్యులు, వైద్య బృందంలోని డాక్టర్లతో బీసీసీఐ నిరంతరం సంప్రదిస్తూనే ఉంది. వైద్యులు అతడికి అత్యుత్తమ చికిత్స అందిస్తున్నారు' అని బీసీసీఐ గతంలో ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే.