Rain Disrupts Play: బంగ్లాదేశ్‌తో కాన్పూర్‌లో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌కు వరుణుడు పెద్ద అడ్డంకిగా మారాడు. తొలి రోజు ఆట గంట ఆలస్యంగా ఆట మొదలైంది. తొలి సెషన్‌లో 27 ఓవర్లు జరగ్గా..  అర్షదీప్ రెండు వికెట్లతో చెలరేగాడు. అర్షదీప్‌ బౌలింగ్‌లో జైస్వాల్ పట్టిన అద్భుత క్యాచ్‌తో జకీర్ హుస్సేన్‌ డకౌట్‌గా వెనుతిరగ్గా.. 24 పరుగులు చేసిన షాద్‌మాన్‌ కూడా అర్షదీప్‌ బౌలింగ్‌లో ఎల్‌బీగా అవుటయ్యాడు. 74 పరుగులకు 2 వికెట్ల వద్ద లంచ్‌ బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత మరో 8 ఓవర్ల ఆట మాత్రమే సాగగా అశ్విన్ బౌలింగ్‌లో బంగ్లా సారథి షాంటో అవుటయ్యాడు. 31 పరుగులు చేసిన షాంటో ఎల్‌బీగా పెవిలియన్ చేరాడు. 40 పరుగులు చేసిన మొనిముల్ హక్‌తో పాటు సీనియర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్ క్రీజులో ఉన్నారు.


ఈ తరుణంలో ఎడతెరపిలేని వాన పడడంతో తొలి రోజు ఆటను ముగిస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఆట ముగిసే సమయానికి బంగ్లా మూడు వికెట్లకు 107 పరుగులు చేసింది. 1964 తర్వాత కాన్పూర్ టెస్టులో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న తొలి జట్టుగా  రోహిత్ సేన రికార్డు సృష్టించింది. అంతే కాదు భారత్‌లో 9ఏళ్ల తర్వాత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత జట్టు కూడా ఇదే. 2015లో చివరి సారి బెంగళూరులో సౌత్ ఆఫ్రికాపై భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. రోహిత్ పెట్టుకున్న నమ్మకాన్ని బౌలర్లు వమ్ము చేయకుండా మూడు వికెట్లతో సత్తా చాటారు. ఈ మ్యాచ్‌లో లోకల్‌ బాయ్‌ కుల్‌దీప్ యాదవ్ బెంచ్‌కు పరిమితం అయ్యాడు.


రెండో రోజు, మూడో రోజూ సాగేనా:


రెండో రోజు కూడా ఇదే విధమైన పరిస్థితి ఉండనుంది. మూడో రోజు ఉదయాన్నే కొద్ది పాటి జల్లులు కురిసే అవకాశం ఉండగా రోజంతా ఆకాశం మేఘావృతమై ఉంటుందని ప్రెడిక్షన్స్‌ చెబుతున్నాయి. అప్పుడప్పుడు తేలికపాటి వర్షం కురుస్తుందని అది మ్యాచ్ నిర్వహణకు అడ్డంకిగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. నాలుగు ఐదు రోజుల్లో మాత్రం వర్షం కురవదని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ క్రమంలో మ్యాచ్ జరుగుతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఐతే మూడు రోజుల పాటు జోరువానలో ముద్దైన మైదానం నాలుగో రోజు ఐదో రోజు ఆటకు సిద్ధం చేయడం కోసం గ్రౌండ్ సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. రెండు మ్యాచ్‌లో టెస్టు సిరీస్‌లో భారత్‌ చెన్నై టెస్టులో గెలిచి 1-0 తేడాతో ముందంజలో ఉంది. ఈ టెస్టులో లోకల్‌ బాయ్ అశ్విన్‌, శుభ్‌మన్ గిల్‌, రిషబ్ పంత్ శతకాలతో చెలరేగారు. రవీంద్ర జడేజా 84 పరుగులతో అలరించగా ఈ మ్యాచ్‌లో భారత్‌ 280 పరుగుల తేడాతో నెగ్గింది. కాన్పూర్‌ టెస్టు మ్యాచే బంగ్లా సీనియర్ ఆల్‌ రౌండర్ షకీబుల్ హసన్‌కు చివరి టెస్టు అయ్యే అవకాశం ఉంది. స్వదేశంలో మ్యాచ్ ఆడే అవకాశం తమ బోర్డు ఇవ్వకుంటే ఇదే తన ఆఖరి టెస్టు మ్యాచ్ అని షకీబ్ ఇప్పటికే ప్రకటించాడు. అటు సీనియర్ బంగ్లా బ్యాట్స్‌మన్‌ ముష్ఫికర్ 6 వేల పరుగుల మైలురాయికి చేరువలో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో ఆ మైలురాయి అందుకొని తొలి బంగ్లా టెస్టు బ్యాటర్‌గా రికార్డు సృష్టించాలని భావిస్తున్నాడు.