Rahul Dravids stirring tribute for history maker R Ashwin after  win: ధర్మశాల దద్దరిల్లింది. టీమిండియా(Team India) ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఇంగ్లాండ్‌(England) జట్టు చిత్తయింది. తొలుత బ్యాట్‌తో తర్వతా బంతితో భారత జట్టు చెలరేగిన వేళ బ్రిటీష్‌ జట్టు అయిదో టెస్ట్‌లో ఇన్నింగ్స్‌ తేడాతో పరాజయం పాలైంది. మూడు రోజుల్లోనే ఇంగ్లండ్‌ను ఇన్నింగ్స్‌ 64 పరుగుల తేడాతోమట్టికరిపించింది. ఇప్పటికే 3-1తో సిరీస్‌ దక్కించుకున్న రోహిత్‌ సేన ఈ గెలుపుతో తన ఆధిక్యాన్ని 4-1కు పెంచుకుంది.


అశ్విన్‌, కుల్‌దీప్‌ యాదవ్‌కు తోడు వైస్‌ కెప్టెన్‌ జస్ప్రిత్‌ బుమ్రా బంతితో చెలరేగారు. తొలుత అశ్విన్‌ ఇంగ్లాండ్‌ బ్యాటర్ల పని పట్టగా తర్వాత కుల్‌దీప్‌ ఆ జోరు కొనసాగించాడు. హార్ట్‌లీ- రూట్‌ ఇన్నింగ్స్‌ తేడా నుంచి ఇంగ్లాండ్‌ జట్టును బయట పడేసేందుకు ప్రయత్నించినా... బుమ్రా ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి ఆ అవకాశం కూడా ఇవ్వలేదు. రూట్ ఓపిగ్గా బ్యాటింగ్‌ చేసినా ఇంగ్లాండ్‌కు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఈ గెలుపుతో వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌ షిప్‌లో అగ్రస్థానాన్ని టీమిండియా పదిలం చేసుకుంది. ఈ సిరీస్‌లోనే ఒకే ఒక్క సంఘటనను గుర్తుండిపోయే క్షణమని రాహుల్ ద్రవిడ్ అభివర్ణించాడు.


ద్రవిడ్‌ ఏమన్నాడంటే..?
ఇలాంటి యువ జట్టుతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని ద్రవిడ్‌ అన్నాడు. విచంద్రన్ అశ్విన్‌ కమిట్‌మెంట్‌ తనను అబ్బురపరిచిందని టీమిండియా హెడ్‌కోచ్‌ తెలిపాడు. కుటుంబపరమైన ఎమర్జెన్సీ కారణంగా ఇంటికెళ్లిన అతడు.. కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే జట్టుతోపాటు చేరాడని... ఈ సిరీస్‌లో ఇవే అత్యుత్తమ క్షణాలని ద్రవిడ్‌ తెలిపాడు. జట్టు కోసం ఇలా చేయడం ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నాడు. కెప్టెన్ రోహిత్‌తో కలిసి తుది జట్టును ఎంపిక చేస్తుంటామని... ఇప్పటి వరకు ఏ ఆటగాడూ నిరాశపరచలేదని ద్రవిడ్ వెల్లడించాడు.


అశ్విన్‌ అరుదైన రికార్డు
ధర్మశాల వేదికగా జరిగిన వందో టెస్ట్‌ను భారత స్టార్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ చిరస్మరణీయం చేసుకున్నాడు. వందో టెస్ట్‌లో తొమ్మిది వికెట్లు తీసి సత్తా చాటాడు. చివరి టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి అశ్విన్‌ 9 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 4, రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన అశ్విన్‌.. అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. 36 సార్లు ఐదు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా అశ్విన్‌ రికార్డు సృష్టించాడు. 35 సార్లు అయిదు వికెట్లు తీసి అనిల్‌ కుంబ్లే నెలకొల్పిన రికార్డును అశ్విన్‌ ఈ మ్యాచ్‌తో బద్దలు కొట్టాడు. అత్యధిక సార్లు అయిదు వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో 67 సార్లు ఈ ఘనత సాధించి శ్రీలంక దిగ్గజ బౌలర్ ముత్తయ మురళీధరన్‌ అగ్రస్థానంలో ఉన్నాడు. షేన్‌ వార్న్‌ 37 సార్లు... అశ్విన్‌ 36 సార్లు ఈ ఘనత సాధించారు. రవిచంద్రన్‌ అశ్విన్‌ (Ravichandran Ashwin) ఓ క్రికెట్‌ మేధావి. బ్యాటర్లు ఆడే షాట్‌ను ముందే ఊహించి దానికి తగ్గట్లుగా బౌలింగ్‌ను మార్చుకుని వికెట్లను తీసే మేధావి. అందుకే టీమిండియా హెడ్‌కోచ్‌ ద్రావిడ్‌ కూడా తాను అశ్విన్‌లా క్రికెట్‌ మేధావిగా ఆలోచించాల్సి వస్తుందని ఓసారి వ్యాఖ్యానించాడు.