Rahul Dravid will remain India coach in the T20 World Cup: అమెరికా- వెస్టిండీస్‌ నిర్వహించనున్న టీ20 ప్రపంచకప్‌(T20 World Cup) వరకు రాహుల్‌ ద్రవిడే(Rahul Dravid) భారత జట్టు కోచ్‌గా కొనసాగుతాడని బీసీసీఐ కార్యదర్శి జై షా స్పష్టం చేశాడు. ద్రవిడ్‌తో ఒప్పందం గతేడాది వన్డే ప్రపంచకప్‌తో ముగిసింది. డిసెంబర్‌-జనవరిలో జరిగిన దక్షిణాఫ్రికా పర్యటనలోనూ అతడిని ఈ పాత్రలో కొనసాగాల్సిందిగా బోర్డు కోరింది. పదవీ కాలం ఎప్పటిదాకా అనేది మాత్రం చెప్పలేదు. తాజాగా ద్రవిడ్‌తో మాట్లాడి టీ20 ప్రపంచకప్‌ వరకు అతడితో ఒప్పందాన్ని పొడిగించినట్లు జై షా వెల్లడించాడు. 2023  ప్రపంచకప్‌ తర్వాత ద్రవిడ్‌ భాయ్‌ చాలా బిజీగా ఉన్నాడని.. ఇప్పటికీ కలిసి నేరుగా మాట్లాడే అవకాశం దొరికిందని జైషా తెలిపాడు. టీ20 ప్రపంచకప్‌ వరకు కోచ్‌ పాత్రలో ద్రవిడ్‌ కొనసాగనున్నాడని స్పష్టం చేశాడు. 


సారధిగా రోహిత్‌
 అమెరికా- వెస్టిండీస్‌ వేదికగా జరిగే పొట్టి ప్రపంచకప్‌(T20 World Cup)లో టీమిండియా(Team India)ను ఎవరు  నడిపిస్తారనే ఊహాగానాలకు తెరపడింది. భారత్‌ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో టీమిండియాను అద్భుతంగా నడిపించిన సారధి రోహిత్‌ శర్మ(Rohit Sharma)నే.... టీ 20 ప్రపంచకప్‌లోనూ సారధ్య బాధ్యతలు చేపడతాడని బీసీసీఐ స్పష్టం చేసింది. రాబోయే టీ20 ప్రపంచకప్‌లో రోహిత్‌ శర్మనే టీమ్‌ఇండియాకు నాయకత్వం వహిస్తాడని బీసీసీఐ కార్యదర్శి జై షా తేల్చి చెప్పారు. వరుసగా పది మ్యాచ్‌ల్లో నెగ్గిన తర్వాత.. మనం 2023 వన్డే ప్రపంచకప్‌ గెలవలేకపోయినా, మనసులు గెలిచామని గుర్తు చేసిన జై షా.... 2024 టీ20 ప్రపంచకప్‌లోనూ  రోహిత్‌ సారథ్యంలో త్రివర్ణ పతాకం ఎగరేస్తామని ప్రకటించారు.  రోహిత్ శర్మనే భారత జట్టును ఈ మెగా టోర్నీలో ముందుకు నడిపిస్తాడని  షా  పేర్కొన్నారు.  ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడని జై షా క్లారిటీ ఇచ్చారు. జూన్ 4 నుంచి టి20 వరల్డ్ కప్ టోర్నీ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ ఐసీసీ ఈవెంట్ కు వెస్టిండీస్-అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. 


ఎప్పటి నుంచంటే..?
క్రికెట్‌ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న టీ20 ప్రపంచకప్‌ 2024 (T 20 World Cup 2024)షెడ్యూల్‌ వచ్చేసింది. జూన్‌ 1 నుంచి పొట్టి ప్రపంచకప్‌ ప్రారంభం కానుండగా తొలి మ్యాచ్‌లో ఆతిథ్య అమెరికా(USA)తో కెనడా(Canada) తలపడబోతోంది. జూన్‌ 1న ప్రారంభంకానున్న టీ 20 ప్రపంచకప్‌ జూన్‌ 29న ముగుస్తుంది. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు నాలుగు గ్రూపుల్లో పోటీ పడతాయి. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నాకౌట్‌కు చేరుకుంటాయి. ఈ మెగా టోర్నీలో గ్రూప్‌ ఏ లో భారత్‌(Bharat), పాకిస్థాన్‌(Pakistan) జట్లు ఉన్నాయి. అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూసే దాయాదుల సమరం న్యూయార్క్‌ వేదికగా జూన్‌ 9న జరగనుంది. టీమిండియా గ్రూప్ దశలో జూన్‌ అయిదున ఐర్లాండ్‌తో 12న అమెరికాతో 15న కెనడాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లను ఐసీసీ నాలుగు నెలలు ఉండగానే అందుబాటులోకి తెచ్చి షాక్‌ ఇచ్చింది.