వచ్చేనెలలో UAEలో జరిగే అండర్ -19 ఆసియా కప్ కోసం భారత్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. 15మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసిన సెలక్టర్లుముగ్గురిని ట్రావెలింగ్ స్టాండ్ బై తీసుకున్నారు. రిజర్వ్ ఆటగాళ్లుగా....మరో నలుగుర్ని ఎంపిక చేశారు. అయితే, రిజర్వ్ ఆటగాళ్లు భారత జట్టుతోపాటు UAEకి వెళ్లరని సెలక్టర్లు తెలిపారు. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ కు చెందిన ఉదయ్ సహారన్ ను కెప్టెన్ గా, మధ్యప్రదేశ్ కు చెందిన సౌమీకుమార్ పాండే వైస్ కెప్టెన్ గా ఎంపిక అయ్యారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు చెందిన ఆరవెల్లి అవనీష్ రావు, మురుగన్ అభిషేక్ లకు అండర్ -19 జట్టులో చోటు దక్కింది. 8జట్లు పాల్గొనే ఈ టోర్నీ.. డిసెంబరు 8న ప్రారంభమై 17న ముగుస్తుంది. అండర్ -19 ఆసియా కప్ టోర్నీలో భారత్‌కు తిరుగులేని రికార్డు ఉంది. ఇప్పటివరకూ తొమ్మిదిసార్లు ఆసియా కప్‌ జరగగా.. ఎనిమిది సార్లు ఇండియానే విజేతగా నిలిచింది. ఇందులో ఒక్కసారి 2012లో పాక్‌తో ట్రోఫీని షేర్ చేసుకుంది. ఈ సారి కూడా అదే జోరును ప్రదర్శించాలని యువ జట్టు పట్టుదలగా ఉంది.

 

డిఫెండింగ్ చాంపియన్‌గా ఆసియాకప్‌లో అడుగుపెడుతున్న భారత్ అండర్‌ 19 జట్టు.. తన తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘానిస్తాన్‌తో తలపడనుంది. ఆ తర్వాత డిసెంబర్ 10న పాకిస్తాన్‌తో, 12న నేపాల్‌తో చివరి గ్రూపు మ్యాచ్ ఆడనుంది. డిసెంబర్ 15న సెమీస్ మ్యాచ్‌లు, 17న ఫైనల్ జరగనుంది. ఈ టోర్నీలో మొత్తం జట్లు పాల్గొననున్నాయి. భారత్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, శ్రీలంక, జపాన్ ఈ టోర్నీల్లో పాల్గొననున్నాయి.  వచ్చే ఏడాది జరిగే అండర్‌ –19 ప్రపంచకప్‌నకు ఈ సిరీస్‌ సన్నాహాకంగా ఉండనుంది. 2024లో నిర్వహించనున్న ఐసీసీ మెన్స్ అండర్ 19 వరల్డ్ కప్ హోస్టింగ్ బాధ్యతల నుంచి లంకను తప్పించింది. ఆ అవకాశాన్ని దక్షిణాఫ్రికాకు కల్పిస్తూ ఐసీసీ బోర్డు నిర్ణయం తీసుకుంది. దాంతో వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న అండర్ 19 వరల్డ్ కప్ ను దక్షిణాఫ్రికా నిర్వహించనుందని బోర్డు స్పష్టం చేసింది. ద్వైపాక్షిక సిరీస్ లతో పాటు, ICC ఈవెంట్‌లలో శ్రీలంక టీమ్ ఆడేందుకు అనుమతి ఇచ్చారు. 

 

ఈ కారణంగా వచ్చే జనవరిలో జరగాల్సిన మెన్స్ అండర్ 19 ప్రపంచ కప్ నిర్వహణ నుంచి లంకను తప్పించి దక్షిణాఫ్రికాకు బాధ్యతల్ని అప్పగించింది. ఈ ఏడాది మహిళల U19 T20 ప్రపంచ కప్ నిర్వహించిన దక్షిణాఫ్రికా పురుషుల అండర్ 19 అవకాశాన్ని దక్కించుకుంది. ఈ టోర్నీలో పాల్గోనే 16 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూప్ నుంచి మొదటి మూడు జట్లు సూపర్ సిక్స్ దశకు చేరుకుంటాయి.

 

ఆసియా కప్‌నకు అండర్-19 భారత జట్టు : 

అర్షిన్ కులకర్ణి, ఆదర్శ్ సింగ్, రుద్ర మయూర్ పటేల్, సచిన్ దాస్, ప్రియాన్ష్ మోలియా, ముషీర్ ఖాన్, ఉదయ్ సహారన్(కెప్టెన్), అరవల్లి అవనీష్ రావు, సౌమీ కుమార్ పాండే, మురుగన్ అభిషేక్, ఇన్నేష్ మహాజన్, ధనుష్ గౌడ, ఆరాధ్య శుక్లా, రాజ్ లింబాని, నమన్ తివారి.

ట్రావెలింగ్ స్టాండ్‌బై ప్లేయర్లు : ప్రేమ్ దేవ్కర్, అన్ష్ గోసాయి. మహ్మద్ అమన్.

 

రిజర్వ్ ప్లేయర్లు : దిగ్విజయ్ పాటిల్, జయంత్ గోయత్, పి.విగ్నేశ్, కిరణ్ చోర్మలే.