Viral Video:  రావల్పిండి వేదికగా పాకిస్థాన్- ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచులో ఒక సరదా సన్నివేశం జరిగింది.ఇంగ్లిష్ జట్టు మాజీ కెప్టెన్ జో రూట్ చేసిన పని నెట్టింట్లో నవ్వులు పూయిస్తోంది. ఇంతకీ అతను చేసిన పని ఏంటంటారా...


దాదాపు 17ఏళ్ల తర్వాత ఇంగ్లండ్, పాకిస్థాన్ పర్యటనకు వచ్చింది. దశాబ్దంన్నర తర్వాత ఈ రెండు జట్ల మధ్య పాకిస్థాన్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ రసవత్తరంగా జరుగుతుందని అభిమానులు భావించారు. అయితే నిర్జీవమైన పిచ్ కారణంగా తొలి టెస్టులో పరుగుల వరద పారుతోంది. ఇప్పటికే ఏడు సెంచరీలు నమోదయ్యాయి. ఇంగ్లండ్ ఆటగాళ్లు 4, పాక్ ఆటగాళ్లు 3 శతకాలు బాదారు. దీంతో ఈ మ్యాచ్ నిస్సారమైన డ్రా దిశగా సాగుతోంది. అయితే ఈ మ్యాచులో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ చేసిన పని హైలెట్ గా మారింది. 


పాత బంతిపై మెరుపు రప్పించేందుకు అంతకుముందు ఉమ్మితో రుద్దేవారు. అయితే కరోనా తర్వాత బంతిపై ఉమ్మి రుద్దడం నిషేధించారు. ఈ క్రమంలో బంతిని షైన్ చేసేందుకు జో రూట్ కొత్త టెక్నిక్ కనిపెట్టాడు. మూడో రోజు తమ జట్టు బౌలర్లు బౌలింగ్ చేస్తుండగా రూట్ ఫీల్డింగ్ చేస్తున్నాడు. విల్ జాక్స్ తన ఓవర్ ముగించాడు. అప్పటికి 72 ఓవర్లు ముగిశాయి. తర్వాత ఓలీ రాబిన్సన్ బౌలింగ్ చేయడానికి వచ్చాడు. అప్పుడు రూట్ తన సహచర ఆటగాడు జాక్ లీచ్ బట్టతలపై బంతిని సుతిమెత్తగా తిప్పాడు. తలకు ఉన్న చెమట బాల్ కు అంటింది. అప్పుడు దాన్ని హ్యాండ్ కర్ఛీఫ్ తో గట్టిగా రుద్దుతూ బంతిని మెరిపించేందుకు రూట్ ప్రయత్నించాడు. 


ప్రస్తుతం రూట్‌ చేసిన ఈ పని సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బంతిని షైన్‌ చేయడానికి రూట్‌ కొత్త పద్దతి కనిపెట్టాడంటూ పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు తన అధికారిక ట్విట్టర్‌ అకౌంట్‌లో ఈ వీడియో పోస్టు చేసింది. దీనిపై అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 






ఇంగ్లండ్ 4... పాక్ 3


ఇంగ్లండ్- పాకిస్థాన్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో మూడో రోజు ఆట ముగిసే సమయానికి పాక్ 7 వికెట్లకు 499 పరుగులు చేసింది.  జీవమే లేని పిచ్‌పై పరుగుల వరద పారిస్తూ తొలి ఇన్నింగ్స్‌లో నలుగురు ఇంగ్లిష్‌ బ్యాటర్లు శతకాలు చేయగా.. తామేం తక్కువా అన్నట్లు ముగ్గురు పాక్‌ ఆటగాళ్లు మూడంకెల స్కోరు అందుకున్నారు. ఓవర్‌నైట్‌ స్కోరు 181/0తో ఇన్నింగ్స్‌ కొనసాగించిన పాక్‌ను షఫీఖ్‌ (114; 203 బంతుల్లో 13×4, 3×6), ఇమాముల్‌ హక్‌ (121; 207 బంతుల్లో 15×4, 2×6) సెంచరీలతో ముందుకు తీసుకెళ్లారు. వీళ్లిద్దరూ వెనుదిరిగాక బాబర్‌ అజామ్‌ (136; 168 బంతుల్లో 19×4, 1×6) బాధ్యత తీసుకున్నాడు. శతకం చేసిన అతడు అజహర్‌ అలీ (27), షకీల్‌ (37), రిజ్వాన్‌ (29)తో కలిసి స్కోరును 450 పరుగులు దాటించాడు. 413/3తో మెరుగైన స్థితిలో ఉన్న పాక్‌ 86 పరుగుల తేడాతో 4 వికెట్లు చేజార్చుకుంది. ఆట చివరికి సల్మాన్‌ (15), జహీద్‌ (1) క్రీజులో ఉన్నారు. పాక్‌ ఇంకా 158 పరుగులు వెనుకబడి ఉంది. ఇంగ్లాండ్‌ బౌలర్లలో జాక్స్‌ 3, లీచ్‌ 2 వికెట్లు తీశారు.