Pakistan Journalist Raises Serious Allegation : టీ 20 ప్రపంచకప్‌(T20 World Cup)లో లీగ్‌ దశలోనే వెనుదిరిగిన పాక్‌(Pakistan) జట్టుపై సర్వత్రా విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. మాజీ క్రికెటర్లు, అభిమానులు సహా దేశమంతా బాబర్‌ సేన ఘోర ప్రదర్శనపై భగ్గుమంటూనే ఉంది. అమెరికా చేతిలో ఎదురైన పరాభవాన్ని పాక్‌ అభిమానులు అంత తేలిగ్గా మర్చిపోలేకపోతున్నారు. 2022లో టీ 20 ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన పాక్‌... 2024లో గ్రూప్‌ దశలోనే వెనుదిరగడంపై మాజీలు కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు. సీనియర్లు అందరినీ జట్టు నుంచి పీకి పారేయాలంటూ పీసీబీకి సూచనలు చేస్తున్నారు. వారి పేలవ ఫిట్‌నెసే పాక్‌ వరుస వైఫల్యాలకు కారణమని విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌(Babar Azam) కొత్తగా 2 కోట్ల రూపాయలతో ఆడి కారును బహుమతిగా తీసుకోవడంపై తీవ్ర ఆరోపణలు చెలరేగుతున్నాయి. బాబర్‌ విలాసవంతమైన కారును బహుమతిగా ఎందుకు తీసుకున్నారంటూ పాక్‌ జర్నలిస్ట్‌ ఒకరు ఘాటుగా ప్రశ్నించారు. 





బాబర్‌పై తీవ్ర ఆరోపణలు
 టీ 20 ప్రపంచకప్‌లో లీగ్‌ దశలోనే పాక్‌ వెనుదిరగడం వెనకు కెప్టెన్ బాబర్‌ ఆజమ్‌ వైఫల్యం కూడా ఉందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాక్‌  సీనియర్ జర్నలిస్ట్ ముబాషిర్ లుక్మాన్ బాబర్ ఆజంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. పాకిస్థాన్ కెప్టెన్‌ బాబర్‌ ఖరీదైన కారును బహుమతిగా తీసుకోవడంపై జర్నలిస్ట్‌ ఆందోళన వ్యక్తం చేశాడు. బాబర్‌కు గత ఏడాది చివర్లో అతని అన్నయ్య ఆడి ఇ-ట్రాన్ జిటి కారును బహుమతిగా ఇచ్చాడు. భారత్‌లో ఈ కారు ధర సుమారు 2 కోట్ల రూపాయలుగా ఉంది. పాకిస్తాన్ రూపాయల్లో ఇది మన కరెన్సీకు రెట్టింపు ఉంటుంది. బాబర్ ఆజం కొత్తగా ఇ-ట్రాన్‌ ఆడి కారును బహుమతిగా తీసుకున్నాడని... దానిని అతని సోదరుడు బహుమతిగా ఇచ్చాడని బాబర్‌ చెప్తున్నాడని... 7 నుంచి 8 కోట్ల రూపాయల కారును బహుమతిగా ఇచ్చేంతలా అసలు బార్‌ సోదరుడు ఏం పనిచేస్తున్నాడని జర్నలిస్ట్ ఒక వీడియోలో ప్రశ్నించాడు. చిన్న జట్ల చేతిలో ఓడిపోతే ప్లాట్లు, కార్లు రావు అని.. అసలు బాబర్‌కు కారు ఇవ్వడం వెనక ఎవరు ఉన్నారో అందరికీ తెలుసని ఆ పాక్‌ జర్నలిస్ట్‌ నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పాక్‌ జర్నలిస్ట్‌ వ్యాఖ్యలు బాబర్‌ అన్నయ్య ఫిక్సర్ల నుంచి డబ్బులు తీసుకున్నాడనే కోణంలో ఉండడంతో క్రికెట్‌ ప్రపంచం విస్మయం వ్యక్తం చేస్తోంది. అయితే దీనికి ఎలాంటి ఆధారాలు లేవని... ఒక జర్నలిస్ట్‌ వ్యాఖ్యలను పట్టుకుని బాబర్‌ను అనుమానించడం కరెక్ట్‌ కాదని కొందరు అంటున్నారు. 


వేటు తప్పదు
 కెప్టెన్ బాబర్ ఆజం, ముహమ్మద్ రిజ్వాన్, షాహీన్ షా అఫ్రిదితో సహా T20 ప్రపంచ కప్‌లో విఫలమైన పలువురు సీనియర్ ఆటగాళ్లకు ఆగస్టులో బంగ్లాదేశ్‌తో స్వదేశీ టెస్ట్ సిరీస్‌లో విశ్రాంతి ఇవ్వవచన్న వాదన వినిపిస్తోంది. ఇంగ్లండ్ కౌంటీ జట్టు యార్క్‌షైర్‌కు కెప్టెన్‌గా ఉన్న టెస్ట్ కెప్టెన్ షాన్ మసూద్, హెడ్ కోచ్ జాసన్ గిల్లెస్పీ, పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో జట్టులో ఎలా ఉండాలన్న దానిపై ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.