నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత టాపార్డర్‌ జూలు విదిల్చింది. డచ్‌ బౌలర్లను ఊచకోత కోస్తూ భారీ స్కోరు నమోదు చేసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన రోహిత్‌ సేన ఆరంభం నుంచే దూకుడు మంత్రాన్ని జపించింది. శ్రేయస్స్‌ అయ్యర్‌ 84 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో శతక నాదం చేశాడు. మొత్తంగా అయ్యర్‌ 94 బంతుల్లో 10 ఫోర్లు అయిదు సిక్సులతో 128 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరోవైపు చివరి ఓవర్‌లో రెండు భారీ సిక్సులతో రాహుల్‌ కూడా సెంచరీ చేశాడు. రాహుల్‌ కేవలం 64 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సులతో సెంచరీని అందుకున్నాడు. 102 పరుగుల వద్ద రాహుల్ వెనుదిరిగాడు. అయ్యర్‌, రాహుల్‌ విధ్వంసకర బ్యాటింగ్‌తో భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. చివరి 10 ఓవర్లలో టీమిండియా 126 పరుగులు రాబట్టింది.



 ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ-గిల్‌ భారత్‌కు అదిరే ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్‌కు సరిగ్గా వంద పరుగులు జోడించారు. 11.5 ఓవర్లలోనే వంద పరుగులు జోడించిన టీమిండియా ఓపెనర్లు భారీ స్కోరుకు గట్టి పునాది వేశారు. ఆరంభంలో నెమ్మదిగా ఆడి క్రమంగా దూకుడు పెంచిన రోహిత్‌ శర్మ సెంచరీ దిశగా సాగుతున్న వేళ అవుటవ్వడంతో సరిగ్గా వంద పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్‌ కోల్పోయింది. 54 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో రోహిత్‌ 61 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. రోహిత్‌ అవుటైన తర్వాత వచ్చిన కోహ్లీ గిల్‌తో కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. అనంతరం ధాటిగా ఆడుతూ అర్ధ శతకం పూర్తి చేసిన గిల్‌ 129 పరుగుల వద్ద అవుటయ్యాడు. గిల్‌ 32 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్సులతో 51 పరుగులు చేశాడు. 



 అనంతరం కోహ్లీ, శ్రేయస్స్ అయర్‌ కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన ఈ ఇద్దరు బ్యాటర్లు చూస్తుండగానే స్కోరును 200 పరుగులకు చేర్చారు. సరిగ్గా స్కోరు 200 పరుగులు చేరాక విరాట్ వెనుదిరిగాడు. 56 బంతుల్లో 5 ఫోర్లు ఒక సిక్సుతో కోహ్లీ 51 పరుగులు చేశాడు. రోహిత్‌ సరిగ్గా వంద పరుగుల వద్ద అవుటవ్వగా... కోహ్లీ సరిగ్గా 200 పరుగుల వద్ద పెవిలియన్‌ చేరాడు. అనంతరం రాహుల్‌తో జత కలిసిన శ్రేయస్స్‌ అయ్యర్ ధాటిగా బ్యాటింగ్‌ చేశాడు. రాహుల్‌, అయ్యర్‌ పోటీ పడి బౌండరీలు కొట్టడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. వీరిద్దరూ భారీ భాగస్వామ్యంతో డచ్‌ బౌలర్లను ఊచకోత కోశారు. అయ్యర్‌ 94 బంతుల్లో 10 ఫోర్లు అయిదు సిక్సులతో 128 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. రాహుల్‌ కేవలం 64 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సులతో సెంచరీని అందుకున్నాడు. 102 పరుగుల వద్ద రాహుల్ వెనుదిరిగాడు. భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. 



 ఈ మ్యాచ్‌లో టీమిండియా సారధి రోహిత్‌శర్మ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 14 వేల పరుగులు పూర్తి చేసిన భారత బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. 14 వేల పరుగులకుపైగా చేసిన మూడో భారత ఓపెనర్‌గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. అంతకుముందు సచిన్‌ టెండూల్కర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌ పేరిట ఈ రికార్డు ఉంది. రోహిత్ శర్మ ఇప్పటివరకు వన్డేలు, టీ20లు, టెస్టులు, ఐపీఎల్‌లో కలిపి 13,988 పరుగులు చేశాడు. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 12 పరుగుల వద్ద 14 వేల మైలురాయిని రోహిత్‌ అందుకున్నాడు. మరో రికార్డును కూడా రోహిత్ తన పేరిట లిఖించుకున్నాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సులు కొట్టిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు.