శ్రీలంకతో జరుగుతున్న 2023 ప్రపంచ కప్ మ్యాచ్‌లో భారత్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. దీంతో శ్రీలంక ముందు 358 పరుగుల భారీ లక్ష్యం నిలిచింది. భారత్ తరఫున శుభ్‌మన్ గిల్ (92: 92 బంతుల్లో, 11 ఫోర్లు, రెండు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. విరాట్ కోహ్లీ (88: 94 బంతుల్లో, 11 ఫోర్లు) కూడా రాణించాడు. కానీ వీరిద్దరూ త్రుటిలో తమ సెంచరీలను చేజార్చుకున్నారు. శ్రేయస్ అయ్యర్ (82: 56 బంతుల్లో, మూడు ఫోర్లు, ఆరు సిక్సర్లు) చివర్లో వేగవంతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కానీ ముగ్గురూ సెంచరీలు చేజార్చుకున్నారు. శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మధుశంక ఐదు వికెట్లు పడగొట్టాడు. లంకేయుల విజయానికి 300 బంతుల్లో 358 పరుగులు కావాలి.


ప్రారంభంలోనే వికెట్
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక మొదట బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియాకు మొదటి ఓవర్లోనే ఎదురు దెబ్బ తగిలింది. మొదటి బంతికి ఫోర్ కొట్టి మంచి టచ్‌లో కనిపించిన కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మను (2: 4 బంతుల్లో) దిల్షాన్ మధుశంక రెండో బంతికే అద్భుతమైన యార్కర్‌తో క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో భారత్ నాలుగు పరుగులకే మొదటి వికెట్ కోల్పోయింది.


అదరగొట్టిన కింగ్, ప్రిన్స్
అక్కడ నుంచి ఇన్నింగ్స్ నిలబెట్టే బాధ్యతను శుభ్‌మన్ గిల్ (92: 92 బంతుల్లో, 11 ఫోర్లు, రెండు సిక్సర్లు), వన్‌డౌన్‌లో వచ్చిన విరాట్ కోహ్లీ (88: 94 బంతుల్లో, 11 ఫోర్లు) తీసుకున్నారు. వికెట్ ఇవ్వకుండా కాపాడుకోవడంతో పాటు రన్ రేట్ కూడా తగ్గకుండా చూసుకున్నారు. దీంతో స్కోరు వేగం ఎక్కడా తగ్గలేదు. బౌండరీలు సాధించడంతో పాటు సింగిల్స్ తీస్తూ స్ట్రైక్‌ను కూడా సమర్థవంతంగా రొటేట్ చేశారు. ఈ క్రమంలోనే ఇన్నింగ్స్ 17వ ఓవర్లో 50 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే ఇన్నింగ్స్ 19వ ఓవర్లో గిల్ కూడా 55 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసుకున్నాడు.


అర్థ సెంచరీ చేశాక ఇద్దరూ జోరు పెంచారు. బౌండరీలు కొడుతూ చెలరేగారు. 80ల్లోకి చేరాక విరాట్ కోహ్లీ కాస్త నెమ్మదించాడు. అక్కడి నుంచి శుభ్‌మన్ గిల్ సిక్సర్లతో చెలరేగాడు. వేగంగా 90ల్లోకి వచ్చేశాడు. సెంచరీ పూర్తి చేసుకుంటాడు అన్న తరుణంలో మధుశంక బౌలింగ్‌లో అప్పర్ కట్‌కు ప్రయత్నించి వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ చేతికి చిక్కాడు. విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ రెండో వికెట్‌కు 189 పరుగుల భారీ భాగస్వామ్యం అందించారు. ఆ తర్వాత కాసేపటికే మధుశంక స్లో బాల్‌తో కోహ్లీని కూడా బోల్తా కొట్టించాడు. దీంతో భారత్ మూడు పరుగుల వ్యవధిలోనే క్రీజులో కుదురుకున్న ఇద్దరు బ్యాటర్ల వికెట్లు కోల్పోయింది.


ఆఖర్లో అయ్యర్ షో...
ఈ దశలో క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ (82: 56 బంతుల్లో, మూడు ఫోర్లు, ఆరు సిక్సర్లు), కేఎల్ రాహుల్ (21: 19 బంతుల్లో, రెండు ఫోర్లు) స్కోరు వేగాన్ని పెంచడంపై దృష్టి పెట్టారు. వీరు కేవలం 7.5 ఓవర్లలోనే నాలుగో వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యం అందించారు. అనంతరం క్రీజులోకి వచ్చిన మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ (12: 9 బంతుల్లో, రెండు ఫోర్లు) ఎక్కువ సేపు క్రీజులో ఉండలేకపోయాడు. చివరి ఓవర్లలో శ్రేయస్ అయ్యర్ చెలరేగి ఆడాడు. మధుశంక వేసిన ఇన్నింగ్స్ 48వ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టిన శ్రేయస్... మూడో బంతికి అవుటయ్యాడు. ఆఖర్లో రవీంద్ర జడేజా (35: 24 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) వేగంగా ఆడటంతో భారత్ 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 357 పరుగుల భారీ స్కోరు సాధించింది.