Former Cricketer Prashant Vaidya Arrested In Cheque Bouncing Case: టీమ్ఇండియా మాజీ క్రికెట‌ర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. చెక్‌బౌన్స్‌ కేసులో ప్రశాంత్ వైద్య(Prashant Vaidya) అనే మాజీ క్రికెటర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంత‌రం ఈ మాజీ క్రికెటర్‌ను కోర్టులో హాజ‌రు ప‌ర‌చి వ్యక్తిగ‌త పూచిక‌త్తు మీద‌ విడుదల చేశారు. ప్రశాంత్ ఓ వ్యాపారి నుంచి స్టీల్‌ను కొనుగోలు చేశాడ‌ని, స‌ద‌రు వ్యాపారికి ఇచ్చిన చెక్ బౌన్స్ అయ్యింద‌ని పోలీసులు తెలిపారు. న‌గ‌దు చెల్లించాలని పలుమార్లు కోరినా ప్రశాంత్‌ నిరాకరించడంతో ఆ వ్యాపారి కోర్టును ఆశ్రయించాడు. న్యాయ‌స్థానంలో విచార‌ణ‌కు ప్రశాంత్ హాజ‌రుకాక‌పోవ‌డంతో కోర్టు అత‌డిపై నాన్ బెయిల‌బుల్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది. దీంతో పోలీసులు ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకుని న్యాయ‌స్థానం ఎదుట హాజ‌రు ప‌రిచిన‌ట్లు వివ‌రించారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. ప్రశాంత్ వైద్య 1990లో టీమ్ఇండియా త‌రుపున నాలుగు వ‌న్డే మ్యాచులు ఆడాడు. ప్రస్తుతం అత‌డు విద‌ర్భ క్రికెట్ అసోసియేష‌న్ క్రికెట్ డెవ‌ల‌ప్‌మెంట్ క‌మిటీకి నేతృత్వం వ‌హిస్తున్నాడు.


ధోనీపై కూడా పరువు నష్టం దావా..
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని( MS Dhoni)పై దాఖలైన పరువు నష్టం కేసు విచారణను ఢిల్లీ హైకోర్టు(Delhi High Court) వాయిదా వేసింది. మాజీ వ్యాపార భాగస్వాములు మిహిర్ దివాకర్( Mihir Diwakar) , సౌమ్యదాస్( Soumya Das) ఢిల్లీ హైకోర్టులో ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. తమ పరువుకు భంగం వాటిల్లేందుకు కారణమైన ధోనితో పాటు కొన్ని సామాజిక మాధ్యమాలు, మీడియా సంస్థలపై నష్టపరిహారంతో పాటు ఎలాంటి కథనాలు ప్రచురించకుండా నిరోధించాలని పిటిషన్ లో కోరారు. తాము రాంచీ కోర్టులో మరో కేసులో వారిపై పిటిషన్ దాఖలు చేసిన తర్వాతే  పరువునష్టం దావా వేసినట్లు ధోని తరఫున న్యాయ వాదులు కోర్టుకు తెలిపారు. క్రికెట్ అకాడమీ విషయంలో మాజీ వ్యాపార భాగస్వాములు తనను15 కోట్ల మేర మోసం చేశారంటూ తాను కోర్టును ఆశ్రయించిన తర్వాతే ఈ పిటిషన్ దాఖలుచేశారని తెలిపారు. తనపై వేసిన ఈ కేసును కొట్టేయాలని దానికి విచారణ అర్హత లేదని హైకోర్టుకు ధోనీ నివేదించాడు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం ధోనీతో పాటు మీడియా సంస్థలు, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లకు వ్యతిరేకంగా ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని పేర్కొంది. అయితే, పిటిషన్ దారుల పరువుకు నష్టం కలిగించేలా కంటెంట్ ను పోస్టు చేయకుండా.. ఆయా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లను ఆదేశిస్తామని వెల్లడించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 3కు వాయిదా వేసింది..


ఇంతకీ ఏం జరిగిందంటే..?
ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అకాడమీలు ఏర్పాటు చేసేందుకు.. ఆర్కా స్పోర్ట్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్ లిమిటెడ్‌(Aarka Sports and Management limited) సంస్థ 2017లో ధోనీతో ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం ఆర్కా స్పోర్ట్స్‌..ఫ్రాంఛైజీ ఫీజులు, లాభాల్లో వాటాను క్రికెటర్‌కు చెల్లించాల్సి ఉంటుంది. ఫ్రాంచైజ్ ఫీజు, లాభాల్లో వాటా ఇస్తామ‌ని అగ్రిమెంట్‌లో రాసుకున్నారు. కానీ నిబంధ‌న‌ల‌ను తుంగ‌లో తొక్కుతూ మ‌హీ భాయ్‌ను ఈ సంస్థ మోసం చేసింది. అయితే, ఈ ఒప్పందంలోని షరతులను పాటించడంలో ఆర్కా స్పోర్ట్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌ కంపెనీ విఫలమైంది. దీనిపై ఆర్కా స్పోర్ట్స్‌ య‌జ‌మాని మిహిర్ దివాక‌ర్‌, సౌమ్యా విశ్వాస్‌లతో చర్చించినా ఫలితం లేకపోవడంతో.. ఆ ఒప్పందం నుంచి ధోనీ వైదొలిగారు. 2021 ఆగస్టు 15న ఆర్కా స్పోర్ట్స్‌కు ఇచ్చిన అథారిటీ లెటర్‌ను ఆయన రద్దు చేసుకున్నారు. అనంతరం పలుమార్లు లీగల్‌ నోటీసులు పంపించినా ఎలాంటి స్పందన రాకపోవడంతో ధోనీ తాజాగా కోర్టును ఆశ్రయించారు. ధోనీ ఫిర్యాదుతో మిహిర్ దివాక‌ర్‌, సౌమ్యా విశ్వాస్‌ల‌పై క్రిమినల్‌ కేసు న‌మోదు చేశారు. . మరోవైపు ధోనీ మోస పోవడం పట్ల పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ధోనీ నమ్మిన వారు చీట్ చేశారని పలువురు అంటుండగా..దీనీనే బోల్తా కొట్టించారని ఇంకొంత మంది వ్యాఖ్యానిస్తున్నారు.