Crucial stepping stone for Devdutt Padikkal:  దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తున్న కర్ణాటక ప్లేయర్‌ దేవదత్‌ పడిక్కల్‌( Devdutt Padikkal) టెస్టు జట్టులోకి వచ్చేశాడు. ఇంగ్లాండ్‌(England)తో జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌కు గాయం కారణంగా దూరమైన కె.ఎల్‌. రాహుల్‌(KL Rahul) స్థానంలో పడిక్కల్‌ జట్టులోకి వచ్చాడు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ సీజన్‍లో కర్ణాటక తరపున పడిక్కల్ అదరగొడుతున్నాడు. పంజాబ్‍తో జరిగిన మ్యాచ్‍లో భారీ శతకంతో చెలరేగిన పడిక్కల్‌.. గోవాతో జరిగిన మ్యాచ్‍లోనూ సెంచరీతో దుమ్మురేపాడు. అక్కడతో కూడా పడిక్కల్‌ జోరు ఆగలేదు. ఇంగ్లండ్‌ లయన్స్‌తో జరిగిన అనధికారిక టెస్టులో కూడా శతకంతో పడిక్కల్‌ తన ఫామ్‌ను చాటాడు. పడిక్కల్ తన చివరి ఆరు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల్లో ఒక హాఫ్ సెంచరీ, నాలుగు సెంచరీలను నమోదు చేశాడు. ప్రస్తుత రంజీ సీజన్‌లో 4 మ్యాచ్‌లు ఆడిన పడిక్కల్‌ 92.67 సగటుతో 556 పరుగులు చేశాడు. ఈ వరుస సెంచరీలతో పడిక్కల్‌కు టెస్ట్‌ జట్టులో చోటు దక్కింది. 


బీసీసీఐ ప్రకటన
దేవదత్ పడిక్కల్‌కు తొలిసారి భారత టెస్టు జట్టులో చోటుదక్కిందంటూ బీసీసీఐ(BCCI) ఓ ప్రకటన విడుదల చేసింది.ఫిట్‌నెస్‌ సమస్యతో బాధపడుతున్న కేఎల్‌ రాహుల్‌ మూడో టెస్టుకు దూరమయ్యాడని... అతని పరిస్థితిని బోర్డు మెడికల్‌ టీమ్‌ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుందని ఆ ట్వీట్‌లో పేర్కొంది. రాహుల్‌ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ ఆకాడమీలో కోలుకుంటున్నాడని... అతడు తిరిగి నాలుగో టెస్టుకు అందుబాటులోకి వచ్చే ఛాన్స్‌ ఉందని.... ఈ క్రమంలో మూడో టెస్టుకు రాహుల్‌ స్ధానంలో దేవదత్ పడిక్కల్‌ను సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసిందని  బీసీసీఐ పేర్కొంది. తన ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌లో ఇప్పటివరకు 31 మ్యాచ్‌లు ఆడిన పడిక్కల్‌ 2227 పరుగులు చేశాడు. పడిక్కల్‌ ఇప్పటికే భారత జట్టు తరపున టీ20ల్లో అరంగేట్రం చేశాడు. 2021లో శ్రీలంతో జరిగిన టీ20 సిరీస్‌తో పడిక్కల్‌ డెబ్యూ చేశాడు. అయితే మళ్లీ మూడేళ్ల తర్వాత భారత జట్టు నుంచి పడిక్కల్‌కు పిలుపువచ్చింది. 


పృథ్వీ షా కూడా....
భారత జట్టు యువ ఓపెనర్‌ పృథ్వీ షా(Prithvi Shaw) మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. విధ్వంసకర ఆటతీరుతో మరోసారి సెలక్టర్ల తలుపు తట్టాడు. గాయంతో ఇన్నాళ్లు ఆటకు దూరమైన పృథ్వీ... వచ్చిరాగానే భారీ శతకంతో చెలరేగాడు. ఫస్ట్‌ క్లాస్‌ కెరీర్‌లో షాకు ఇది పదమూడో సెంచరీ కావడం విశేషం. రంజీ ట్రోఫీ(Ranji Trophy 2024)లో ముంబయి తరుపున బరిలోకి దిగిన షా... ఛత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 159 పరుగులు చేసి సత్తా చాటాడు. ఇందులో 18 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. గాయంతో బాధపడ్డ పృథ్వీ షా.. ఆరు నెలల తర్వాత జట్టులోకి వచ్చాడు. లండన్‌లో సర్జరీ చేయించుకున్న తర్వాత బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో మూడు నెలలు పాటు ఉండి ఫిట్‌నెస్‌ సాధించేందుకు కష్టపడ్డాడుయ ఆరు నెలలకు పైగా శ్రమించి పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాడు. పృథ్వీషాకు ఫిట్‌నెస్‌ టెస్ట్‌ నిర్వహించిన జాతీయ క్రికెట్‌ అకాడమీ క్లియరెన్స్ ఇచ్చింది. దీంతో తిరిగి రంజీ ట్రోఫీలో ముంబయి టీమ్ తరపున ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఈ మ్యాచ్‌లో తొలి రోజు ఆటలో 75 ఓవర్లకు ముంబయి వికెట్ నష్టానికి 280 పరుగులు చేసింది.