వచ్చే ఏడాది అమెరికా-వెస్టిండీస్‌(West Indies and USA) సంయుక్తంగా నిర్వహించనున్న టీ 20 ప్రపంచకప్‌ నిర్వహించనున్నాయి. ఈ మెగా ఈవెంట్లో సత్తా చాటాలని ఇంగ్లాండ్‌(England) గట్టి పట్టుదలతో ఉంది. భారత్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో ఘోరంగా విఫలమైన బ్రిటీష్‌ జట్టు టీ 20 ప్రపంచకప్‌లో మెరుగ్గా రాణించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే కీలక నిర్ణయం తీసుకుంది. ఇంగ్లాండ్‌ జట్టు అసిస్టెంట్ కోచ్‌గా వెస్టిండీస్‌(West Indies) మాజీ కెప్టెన్‌, విధ్వంసకర బ్యాటర్‌ కీరన్ పొలార్డ్‌(Kieron Pollard)ను ఆ దేశ క్రికెట్‌ బోర్డు నియమించింది. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌ కోసం ఇంగ్లండ్‌ పురుషుల జట్టు అసిస్టెంట్ కోచ్‌గా(assistant coach ) వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కీరన్ పొలార్డ్‌ను నియమించామని ఈసీబీ వెల్లడించింది. పొలార్డ్‌కు టీ20ల్లో అపారమైన అనుభవం ఉంది. టీ20ల్లో 600 కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడాడు. అటువంటి లెజెండరీ క్రికెటర్‌తో ఒప్పందం కుదర్చుకోవడం చాలా సంతోషంగా ఉందని ఇంగ్లండ్‌ వెల్స్‌ క్రికెట్‌ బోర్డు(England and Wales Cricket Board) ఒక ప్రకటనలో పేర్కొంది.


గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌( international cricket)కు గుడ్‌బై చెప్పిన పొలార్డ్‌ ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌ బ్యాటింగ్‌ కోచ్‌గా పనిచేస్తున్నాడు. అయితే అంతర్జాతీయ స్ధాయిలో కోచ్‌గా బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి. ఇక 2007లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన పొలార్డ్‌ 15 ఏళ్ల పాటు విండీస్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 123 వన్డేలు, 101 టీ20లు ఆడిన పొలార్డ్.. వరుసగా 2,706, 1569 పరుగులు చేశాడు. అతడి కెరీర్‌లో 3 అంతర్జాతీయ సెంచరీలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులను ఉర్రూతలూగించేందుకు మరో విశ్వ సమరానికి రంగం సిద్ధమవుతోంది. భారత్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌ను విజయంవంతంగా నిర్వహించిన ఐసీసీ... 2024లో టీ 20 ప్రపంచకప్‌ నిర్వహణకు సిద్ధమైంది. వెస్టిండీస్‌-అమెరికా సంయుక్తంగా నిర్వహించే ఈ మెగా టోర్నీ కోసం అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ టోర్నీ కోసం అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా టీ20 ప్రపంచ‌క‌ప్ 2024కు సంబంధించిన లోగోల‌ను ఐసీసీ ఇప్పటికే విడుద‌ల చేసింది. పురుషుల క్రికెట్‌, మ‌హిళ‌ల క్రికెట్‌కు సంబందించిన టీ 20 ప్రపంచకప్‌ లోగోల‌ను విడుద‌ల చేసింది. లోగోల‌పై క్రికెట్ బ్యాట్, బంతితో పాటు ప్లేయ‌ర్ల ఎన‌ర్జీని సూచించే సంకేతం ఉంది. మొత్తంగా ఈ లోగోలు టీ20 క్రికెట్‌ను ప్రతిబింబించేలా ఉన్నాయి. ప్రస్తుతం ఈ కొత్త లోగోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.


2024 టీ20 ప్రపంచకప్‌  ఎలా ఉండనుంది అంటే: 
2022 జరిగిన పొట్టి ప్రపంచకప్‌లో 16 జ‌ట్లు పోటీ ప‌డ‌గా ఈ సారి మాత్రం 20 జ‌ట్లు త‌ల‌ప‌డనున్నాయి. ఐసీసీ 12 జ‌ట్లకు నేరుగా అర్హత క‌ల్పించింది. 2022 టీ20 ప్రపంచ‌క‌ప్‌లో టాప్‌-8 స్థానాల్లో నిలిచిన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భార‌త్‌, పాకిస్తాన్, న్యూజిలాండ్‌, శ్రీలంక, ద‌క్షిణాఫ్రికా, నెద‌ర్లాండ్స్ జ‌ట్లల‌తో పాటు అతిథ్య హోదాలో అమెరికా, వెస్టిండీస్ ల‌తో క‌లిపి మొత్తం 10 జ‌ట్లు నేరుగా అర్హత పొందాయి. టీ20 ర్యాంకింగ్స్‌లో తొమ్మిది, ప‌ది స్థానాల్లో నిలిచిన అఫ్గానిస్థాన్ , బంగ్లాదేశ్‌లు కూడా నేరుగా అర్హత సాధించాయి. మిగిలిన 8 స్థానాల కోసం రీజియ‌న్ల వారీగా క్వాలిఫ‌యింగ్ పోటీల‌ను నిర్వహించి విజేతలను టీ 10 ప్రపంచకప్‌నకు అర్హత కల్పించారు. వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భార‌త్‌, పాకిస్తాన్, న్యూజిలాండ్‌, శ్రీలంక, ద‌క్షిణాఫ్రికా, నెద‌ర్లాండ్స్, యూఎస్‌, వెస్టిండీస్, అఫ్గానిస్థాన్ , బంగ్లాదేశ్‌, కెన‌డా, నేపాల్‌, ఒమ‌న్‌, ప‌పువా న్యూ గినియా, ఐర్లాండ్‌, స్కాంట్లాండ్‌, ఉగాండ‌, న‌బీబియా పాల్గొననున్నాయి.