IPL 2023 New Rules: మూడు వారాలుగా క్రికెట్ ప్రేమికులకు అలరిస్తున్న  ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తుది అంకానికి చేరింది. ఈ లీగ్ లో ఇక మిగిలింది  రెండు మ్యాచ్ లు మాత్రమే. డబ్ల్యూపీఎల్ ముగిసిన వెంటనే   భారత క్రికెట్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను  సంపాదించుకున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) - 16 వ సీజన్ మొదలుకాబోతుంది.  మార్చి 31 నుంచి ఈ లీగ్ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో   వచ్చే సీజన్ నుంచి ఐపీఎల్ లో పలు కీలక నిబంధనలను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తీసుకురాబోతుంది. 


నిబంధనలివే.. 


బ్యాటర్లకు అనుకూలించే ఫీల్డింగ్ మార్పులు, పవర్ ప్లే, రెండు డీఆర్ఎస్ లు.. ఇలా  ప్రతీ సీజన్ ఏదో కొత్త నిబంధనతో వస్తూ క్రికెట్ ను మరింత వినోదభరితమైన ఆటగా మారుస్తున్న  బీసీసీఐ.. ఈ సీజన్ లో కూడా అటువంటి నిబంధనలను మరికొన్నింటినీ తీసుకొచ్చింది. 


టాస్ వేశాక జట్లను ప్రకటించవచ్చు :  దీని ప్రకారం..  ఇప్పటివరకు  టాస్ వేయడానికంటే ముందే రెండు జట్లూ ఆ మ్యాచ్ లో ఆడబోయే తుద జట్ల వివరాలను  ప్రత్యర్థి సారథులకు, రిఫరీకి అందజేయాలి.  ఒక్కసారి ప్రత్యర్థి సారథికి  షీట్ అందజేశాక మళ్లీ దానిలో మార్పులు చేయడానికి ఉండదు. కానీ కొత్త నిబంధన ప్రకారం టాస్ వేశాక కూడా తుది జట్లను మార్చుకోవచ్చు.  టాస్  గెలుపోటములను నిర్ణయించడంలో కీలకభూమిక పోషిస్తున్న నేపథ్యంలో తమ అత్యుత్తమ జట్టును ఎంచుకునేందుకు అవకాశముంటుంది. టాస్ వేశాక 15 మందితో కూడిన  టీమ్ షీట్ ను అందించాలి. ఇందులో తుది జట్టులో ఆడే 11 మందితో పాటు  నలుగురు సబ్‌స్టిట్యూట్ (ఇంపాక్ల్ ప్లేయర్ తో కలుపుకుని) లు ఉంటారు. 


ఈ నిబంధన  ముఖ్యంగా  ఈ సీజన్ నుంచి కొత్తగా అమల్లోకి రాబోతున్న ‘ఇంపాక్ట్ ప్లేయర్’ విషయంలో సాయపడుతుంది.  ఉదాహరణకు  గుజరాత్  టైటాన్స్ జట్టు టాస్ గెలిచినా, ఓడినా.. తమ టీమ్ వివరాలను  వెల్లడించిన తర్వాత  కూడా  మ్యాచ్ ప్రారంభానికి ముందు తుది జట్టులో మార్పులు చేసుకోవచ్చు.  సాయి సుదర్శన్ స్థానంలో  రాహుల్ తెవాటియాను  తీసుకోవచ్చు. ఈ మార్పు చేశామని ప్రత్యర్థి టీమ్ సారథికి చెప్పల్సిన అవసరం లేదు.   ఈ  నిబంధనను  ఈ ఏడాది సౌతాఫ్రికా వేదికగా జరిగిన ఎస్ఎ 20 లీగ్ లో అమలుచేశారు.  


- ఓవర్ రేట్ పెనాల్టీ పడితే 30 యార్డ్స్  సర్కిల్ లో   నలుగురు ఫీల్డర్లే ఉంటారు.  అంటే ఒక బౌలర్ కు కేటాయించిన నిర్దిష్ట  సమయంలో అతడు ఓవర్ ను పూర్తి చేయాలి. లేకుంటే పెనాల్టీ పడుతుంది. 


- ఫీల్డర్  లేదా వికెట్ కీపర్ ఏదైనా తిక్క చేష్టలకు పాల్పడితే  బంతిని డెడ్ బాల్ గా ప్రకటించడంతో పాటు   అపోజిషన్ టీమ్ కు ఐదు పరుగులు కూడా లభిస్తాయి. 


 






కాగా  పై నిబంధనలలో  చాలా మట్టుకు  బ్యాటర్ ఫ్రెండ్లీ ఉన్నవే ఎక్కువ. గతేడాది  ఐపీఎల్ లో పది జట్లు ఆడినా అనుకున్న స్థాయిలో   విజయవంతం కాకపోవడంతో  బీసీసీఐ ఈ  లీగ్ కు  కొత్త హంగుల (నిబంధనలు)ను అద్ది  క్రేజ్  పెంచాలని యత్నిస్తున్నది. మరి ఇవి ఎంతమేరకు విజయం సాధిస్తాయన్నది త్వరలోనే తేలనుంది.