IND VS SL Colombo Test Updates, Saransh Jain Eyes Test Debut Against Sri Lanka:  శ్రీలంకతో ఆగస్టు 23 నుంచి కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ప్రారంభం కానున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో టీమ్ ఇండియా తుది జట్టులో కీలక మార్పు చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్ వెటరన్ ఆల్ రౌండర్ సారాంశ్ జైన్ అంతర్జాతీయ టెస్ట్ అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. 33 ఏళ్ల ఈ ఆఫ్ స్పిన్నింగ్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా దూరమవ్వడంతో జట్టులోకి ఎంపికయిన సంగతి తెలిసిందే. 2014 లో ఫస్ట్ క్లాస్ కెరీర్ స్టార్ట్ చేసిన జైన్, దాదాపు 12 ఏళ్ల పాటు డొమెస్టిక్ సర్క్యూట్ లో శ్రమించి చివరకు జాతీయ జట్టు పిలుపు అందుకున్నా, తుదిజట్టులో చోటు కోసం మాత్రం ఎదురు చూస్తున్నాడు.

Continues below advertisement

Continues below advertisement

కుల్దీప్  స్థానంలో ఛాన్స్.. 

తాజా నివేదిక ప్రకారం కొలంబో టెస్టులో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్థానంలో సారాంశ్ జైన్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్న‌ట్లు విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. గాలే వేదికగా జరిగిన తొలి టెస్టులో పిచ్ స్పిన్ కు పూర్తిగా అనుకూలించినప్పటికీ కుల్దీప్ ప్రభావం చూపలేకపోయాడని విమర్శ‌లు వెల్లువెత్తాయి. ఏకంగా 25 ఓవర్లు బౌలింగ్ చేసి 103 పరుగులు ఇచ్చి కేవలం ఒకే ఒక్క వికెట్ మాత్రమే దక్కించుకుని, నిరాశ ప‌ర్చాడు. దీంతో బ్యాటింగ్ లోనూ ఉపయోగపడే రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ సారాంశ్ జైన్ ను ఆడించాలని టీమ్ మేనేజ్ మెంట్ భావిస్తోన్న‌ట్లు తెలుస్తోంది.

డొమెస్టిక్ క్రికెట్ లో మంచి రికార్డు..ఇండోర్ కు చెందిన సారాంశ్ జైన్ దేశవాళీ రెడ్ బాల్ క్రికెట్ లో నిలకడైన ప్రదర్శనతో అంద‌రినీ ఆక‌ట్టుకున్నాడు. మధ్యప్రదేశ్ తో పాటు సెంట్రల్ జోన్, రెస్ట్ ఆఫ్ ఇండియా జట్లకు ప్రధాన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఇప్పటివరకు 181 వికెట్లు పడగొట్టడంతో పాటు బ్యాట్ తో 2223 రన్స్ చేశాడు. ఇతని తండ్రి సుబోధ్ జైన్ కూడా గతంలో మధ్యప్రదేశ్ తరఫున రంజీల్లో రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ బౌలర్ గా 9 మ్యాచ్ ల్లో ప్రాతినిథ్యం వ‌హించాడు. ప్రముఖ కోచ్ చంద్రకాంత్ పండిత్ మార్గదర్శకత్వంలో జైన్ పూర్తి స్థాయి మ్యాచ్ విన్నర్ గా ఎదిగాడు.

తొలి టెస్ట్ లో బంప‌ర్ విక్ట‌రీ.. సిరీస్ క్లీన్ స్వీప్ పై భారత్ క‌న్నుతొలి టెస్టులో యువ స్పిన్నర్ మానవ్ సుతార్ 10 వికెట్లతో చెలరేగడంతో భారత్ 165 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి, సిరీస్ లో 1-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. కొలంబోలో జరగబోయే రెండో టెస్టును కూడా గెలిచి సిరీస్ ను 2-0 తో క్లీన్ స్వీప్ చేయాలని శుభ్ మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టు పక్కా వ్యూహంతో ఉంది. ఇందుకు సంబంధించిన గేమ్ ప్లాన్ ను సిద్ధం కూడా చేసుకుంద‌ని నిపుణులు అంటున్నారు.