Poor pitch helps bowlers breathe fire in T20 World Cup 2024 : టీ 20 ప్రపంచకప్‌ 2024(T20 World Cup 2024)లో టీమిండియా-ఐర్లాండ్‌(India vs Ireland) మధ్య జరిగిన మ్యాచ్‌లో పిచ్‌ స్పందించిన తీరుపై మాజీలు విమర్శలు గుప్పిస్తున్నారు. న్యూయార్క్‌లోని  నసావు కౌంటీ స్టేడియంలోని పిచ్‌పై ఇండియా-ఐర్లాండ్‌ తలపడగా భారత జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత  బ్యాటింగ్‌ చేసిన ఐర్లాండ్‌ 96 పరుగులు చేయగా... టీమిండియా కేవలం 12 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. అయితే ఈ పిచ్‌పై బ్యాటింగ్‌ చేసేందుకు ఇరు జట్లు బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. పరుగులు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. ఐర్లాండ్‌ కనీసం వంద పరుగుల మార్క్‌ను కూడా దాటలేదు. దీంతో ఈ పిచ్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


ఐర్లాండ్‌ వల్ల కాలేదు..
న్యూయార్క్‌లోని నుసావు ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా.. ఐర్లాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. గత మ్యాచుల్లో ఈ పిచ్‌పై బౌలర్లు చెలరేగిపోవడంతో టాస్‌ గెలిచిన వెంటనే రోహిత్‌ శర్మ మరో ఆలోచన లేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. రోహిత్‌ నిర్ణయం సరైందేనని కాసేపటికే ఐర్లాండ్‌కు అర్థమైంది. టీ 20 ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లో భారత బౌలర్లు చెలరేగిపోయారు. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై నిప్పులు చెరిగారు. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై భారత బౌలర్లను ఎదుర్కోవడం ఐర్లాండ్‌ బ్యాటర్ల వల్ల కాలేదు. పదునైన బంతులతో చెలరేగిన టీమిండియా బౌలర్లు... పసికూన ఐర్లాండ్‌ బ్యాటర్లను వణికించారు. ఐర్లాండ్‌ను కేవలం 96 పరుగులకే కుప్పకూల్చారు. 16 ఓవర్లలోనే ఐర్లాండ్‌ బ్యాటింగ్‌ ముగిసింది. టీమిండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి పరుగులు రాకుండా చేశారు. దీంతో ప్రతీ పరుగుకు ఐర్లాండ్‌ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.  దీంతో ఐర్లాండ్‌ భారత బౌలర్ల ధాటికి 16 ఓవర్లలో కేవలం 96 పరుగులకే కుప్పకూలింది. అనంతరం 97 పరుగుల స్వల్ప లక్ష్యంతో  బరిలోకి దిగిన టీమిండియా 12.2 ఓవర్లలో కేవలం రెండే వికెట్లు కోల్పోయి సునాయసంగా లక్ష్యాన్ని ముద్దాడింది. రోహిత్‌ శర్మ అర్ధ శతకంతో చెలరేగగా... రిషభ్‌ పంత్‌ కీలక ఇన్నింగ్స్ ఆడాడు.



మండిపడ్డ మాజీలు
 టీ 20 ప్రపంచకప్‌ లాంటి మెగా టోర్నీల్లో ఇలాంటి పిచ్‌ ఉపయోగించడంపై మాజీ క్రికెటర్లు భగ్గుమన్నారు. ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పారు. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ స్టేడియంలో పిచ్‌ చాలా పేలవంగా ఉందని... పిచ్‌పై అస్థిరమైన బౌన్స్‌ కనిపించిందని మాజీలు అన్నారు. ఇలాంటి పిచ్‌పై బ్యాటింగ్ చేయడం ఆటగాళ్లకు పెద్ద సవాల్‌ అని విమర్శించారు. ప్రపంచకప్‌లాంటి పెద్ద టోర్నీల్లో ఇలాంటి నాసిరకం పిచ్‌ ఏర్పాటు చేయడంపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ మండిపడ్డారు.  అమెరికన్‌ ప్రేక్షకులను టెస్ట్‌ క్రికెట్‌కు అలవాటు చేయాలని ఇలాంటి పిచ్‌ తయారు చేసి ఉంటారని టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్‌ ఎద్దేవా చేశాడు. న్యూయార్‌ పిచ్‌ ఒక మంత్రగత్తెలా ఉందని నవజ్యోత్‌ సిద్ధూ విమర్శించారు. ఇర్ఫాన్‌ పఠాన్‌ కూడా  ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశాడు.