IND vs ENG 3rd Test : రాజ్‌కోట్‌ వేదికగా జరిగిన మూడో టెస్ట్‌లో సుదీర్ఘ ఫార్మట్‌లోకి అరంగేట్రం చేసిన సర్ఫరాజ్‌ ఖాన్‌ (Sarfaraz Khan) తొలి టెస్ట్‌ మ్యాచ్‌లోనే ఆకట్టుకున్నాడు. బజ్‌బాల్‌ ఆటతో కేవలం 48 బంతుల్లోనే అర్ధ శతకం సాధించి అభిమానులను అలరించాడు. తర్వాత కూడా దూకుడుగానే ఆడేందుకు ప్రయత్నించాడు. రవీంద్ర జడేజా(Ravindra Jadeja)తో సమన్వయ లోపం వల్ల 62 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద  రనౌట్‌ కావడంతో సర్ఫరాజ్‌ తీవ్ర నిరుత్సాహంతో పెవిలియన్‌ చేరాడు. తాను రనౌట్‌ కావడంపై సర్ఫరాజ్‌ స్పందించాడు.
 

సర్ఫరాజ్‌ ఏమన్నాడంటే..

క్రికెట్‌లో ఇలాంటివన్నీ సహజమేనని సర్ఫరాజ్‌ అన్నాడు. రవీంద్ర జడేజా-తనకు మధ్య ఆ సమయంలో అవగాహన లోపించిందని అన్నాడు. ఎవరో ఒకరు రనౌట్‌ అవుతామని... దాని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదని సర్ఫరాజ్‌ ఆ విషయాన్ని తేలిగ్గా తీసుకున్నాడు. రవీంద్ర జడేజా తాను బ్యాటింగ్‌ చేసేటప్పుడు మద్దతుగా నిలిచాడని సర్ఫరాజ్‌ తెలిపాడు. ఈ మ్యాచ్‌లో క్రీజులో నిలబడేందుకు కాస్త సమయం తీసుకోవాలని రవీంద్ర జడేజా సూచించాడని ఆ సూచనలను అమలు చేసేందుకు ప్రయత్నించానని వెల్లడించాడు.

 

తొలి టెస్ట్‌లోనే ఆకట్టుకున్నాడు..

 దేశవాళీలో పరుగుల వరద పారిస్తున్నా జట్టులో చోటు కల్పించడం లేదని అభిమానుల ఆవేదన. మైదానంలో అగ్రెసీవ్‌గా ఉంటాడు కాబట్టే భారత జట్టులో చోటు దక్కడం లేదని ఊహాగానాలు. టెస్ట్‌ జట్టు ప్రకటించే ప్రతీసారి.. ఈసారి జట్టులో చోటు పక్కా అనే వార్తలు. అసలు జట్టులోకి వస్తే రాణిస్తాడా... లేక చాలామంది ఆటగాళ్లలాగే అంచనాలు అందుకోలేక చతికిల పడతాడా అని... వీటన్నింటికి ఒకే ఇన్నింగ్స్‌తో సర్ఫరాజ్‌ ఖాన్‌ సమాధానం చెప్పేశాడు. వన్డే తరహా ఆటతో ఆడుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లోనే అర్ధ శతకంతో సత్తా చాటాడు. తన ఎంపిక సరైందేనని... తనలో అంతర్జాతీయ టెస్ట్‌ మ్యాచ్‌లో రాణించే సత్తా ఉందని సర్ఫరాజ్ నిరూపించుకున్నాడు. అంతేనా తొలి మ్యాచ్‌లోనే అర్ధ శతకం సాధించి రికార్డు కూడా సృష్టించాడు. 

 

సాధికార బ్యాటింగ్‌

క్రీజులోకి వచ్చినప్పటి  నుంచి సర్ఫరాజ్‌ ఖాన్‌ సాధికారికంగా బ్యాటింగ్‌ చేశాడు. కేవలం 48 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సుతో సర్ఫరాజ్‌ అర్ధ శతకం సాధించాడు. ఈ క్రమంలో అరంగేట్రం చేసిన టెస్టులో వేగంగా అర్ధ శతకం సాధించిన మూడో బ్యాటర్‌గా సర్ఫరాజ్‌ రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత కూడా సర్ఫరాజ్ ధాటిగానే ఆడుతున్నాడు. 66 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, ఒక సిక్సుతో 62 పరుగులు చేసి అవుటయ్యాడు. కచ్చితంగా సెంచరీ చేస్తాడని అనుకుంటున్న తరుణంలో సర్ఫరాజ్‌ సింగిల్‌ కోసం యత్నించి రనౌట్‌ అయి నిరాశగా వెనుదిరిగాడు.

టీమిండియా సారధి రోహిత్‌ శర్మ, లోకల్‌ బాయ్‌ రవీంద్ర జడేజా శతక గర్జన చేయడంతో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా పటిష్ట స్థితిలో నిలిచింది. ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ భారత జట్టును రోహిత్‌, రవీంద్ర జడేజా అద్భుత శతకాలతో ఆదుకుని పటిష్ట స్థితిలో నిలిపారు. తొలి టెస్ట్‌ మ్యాచ్‌ ఆడుతున్న సర్ఫరాజ్‌ ఖాన్‌ అర్ధశతకంతో తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు.  దురదృష్టవశాత్తు సర్ఫరాజ్‌ రనౌట్‌ అయినా... సాధికార బ్యాటింగ్‌తో తన ఎంపిక సరైందేనని నిరూపించుకున్నాడు. మూడో టెస్ట్‌ తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా అయిదు వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది.