IND W vs ENG W: ఇంగ్లాండ్‌తో మూడో వన్డేలో భారత మహిళల జట్టు మోస్తరు స్కోరే చేసింది. లార్డ్స్‌ వేదికగా సాగుతున్న పోరులో ఆతిథ్య ఆంగ్లేయులకు 170 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. కేట్‌ క్రాస్‌ (4/26) దెబ్బకు విలవిల్లాడింది. 45.4 ఓవర్లకు ఆలౌటైంది. అంటే ఓవర్‌కు 3.7 రన్‌రేట్‌ నమోదు చేసింది. ఓపెనర్‌ స్మృతి మంధాన (50; 79 బంతుల్లో 5x4), దీప్తి శర్మ (68*; 106 బంతుల్లో 7x4) హాఫ్ సెంచరీలు చేశారు. ఏకంగా ఐదుగురు బ్యాటర్లు డకౌట్‌ అయ్యారు. మరో ముగ్గురు ఒక అంకె స్కోరుకు పరిమితం అయ్యారు.




ఆ ఇద్దరూ లేకుంటే!


టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియాకు ఇంగ్లిష్ అమ్మాయిలు చుక్కలు చూపించారు! బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై చెలరేగారు. హర్మన్‌సేన టాప్‌ ఆర్డర్‌ను కేట్ క్రాస్‌ కకావికలం చేసింది. దాంతో 29 పరుగుల్లోపే భారత్‌ 29-4తో ఇబ్బందుల్లో పడింది. జట్టు స్కోరు 2 వద్ద షెఫాలి వర్మ (0), 10 వద్ద యస్తికా భాటియా (0), 17 వద్ద హర్మన్‌ప్రీత్ (4)ను ఔట్‌ చేసింది. ఈ క్రమంలో ఓపెనర్‌ స్మృతి మంధాన గొప్ప ఇన్నింగ్స్‌ ఆడింది. ప్రత్యర్థుల బంతుల్ని ఓపికగా ఎదుర్కొని హాఫ్‌ సెంచరీ అందుకుంది. మరికాసేపటికే ఆమెను కేట్‌ క్రాస్‌ పెవిలియన్‌ పంపించింది. అప్పటికి స్కోరు 87. ఇక టీమ్‌ఇండియా పనైపోయిందని భావిస్తున్న తరుణంలో ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ ఒంటరి పోరాటం చేసింది. లోయర్‌ ఆర్డర్లో పూజా వస్త్రాకర్‌ (22; 38 బంతుల్లో 4x4) అండతో విలువైన ఇన్నింగ్స్‌ ఆడింది. అజేయ హాఫ్‌ సెంచరీతో స్కోరును 150 దాటించింది. మరోవైపు ఆఖరి ముగ్గురూ డకౌట్‌ కావడంతో ఆమె ఏం చేయలేకపోయింది. ఫ్రేయా కెంప్‌, ఎకిల్‌ స్టోన్‌ తలో 2 వికెట్లు పడగొట్టాడు.




జులన్‌ వీడ్కోలు


టీమ్‌ఇండియా దిగ్గజం జులన్‌ గోస్వామి ఆడుతున్న ఆఖరి వన్డే ఇది. దాంతో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌తో ఆమె కూడా టాస్‌కు వచ్చింది. ఇప్పటికే 2-0తో సిరీసు కైవసం చేసుకొని భారత జట్టుకు ఆమెకు సిరీస్‌ అంకితం ఇచ్చింది. అసలేమాత్రం గుర్తింపు లేని దశలో మిథాలీ రాజ్‌, జులన్‌ గోస్వామి అమ్మాయిల జట్టుకు దిశానిర్దేశం చేశారు. దాదాపుగా 20 ఏళ్లపాటు సేవలు అందించారు. ఇంగ్లాండ్‌ అమ్మాయిలు సైతం జులన్‌కు చక్కని ఫేర్‌వెల్‌ ఇచ్చారు. హర్మన్‌ప్రీత్‌ ఆమెను కౌగిలించుకొని కన్నీటి పర్యంతం కావడం గమనార్హం.