India vs England 4th Test Day 1 Joe Root century takes England to 302/7 at stumps:  రాంచీ వేదికగా భారత్‌-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో తొలి రోజును... ఇరు జట్లు సంతృప్తికరంగా ముగించాయి. తొలి సెషన్‌లో భారత బౌలర్ల జోరు కొనసాగగా మిగిలిన రెండు సెషన్లలో ఇంగ్లాండ్‌ బ్యాటర్లు పుంజుకున్నారు. క్లిష్ట సమయంలో పట్టుదలతో క్రీజులో నిలబడ్డ జో రూట్‌ అద్భుత శతకంతో చెలరేగడంతో తొలి రోజు ఇంగ్లాండ్‌ ఏడు వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. రూట్‌ 106 పరుగులతో, రాబిన్సన్ 31 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లాండ్‌ను.. అరంగేట్ర బౌలర్‌ ఆకాశ్‌ దీప్‌ హడలెత్తించాడు. ఒకే ఓవర్లు రెండు వికెట్లు తీసిన ఆకాశ్‌... ఆ తర్వాతి ఓవర్‌లోనే మరో వికెట్‌ తీసి బ్రిటీష్‌ జట్టును కష్టాల్లోకి నెట్టాడు. అశ్విన్‌... రవీంద్ర జడేజా కూడా చెరో వికెట్‌ తీయడంతో తొలి సెషన్‌లో 112 పరుగులకే ఇంగ్లాండ్‌ అయిదు వికెట్లు కోల్పోయింది. కానీ లంచ్‌ తర్వాత బ్రిటీష్‌ బ్యాటర్లు ఆచితూచి బ్యాటింగ్‌ చేశారు. బెయిర్‌ స్టో 38, బెన్‌ ఫోక్స్ 47 సాయంతో రూట్‌ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. ఆ తర్వాత బెయిర్‌ స్టో, ఫోక్స్‌ అవుటైనా రూట్‌ పట్టుదలగా ఆడి అజేయ శతకంతో ఇంగ్లాండ్‌ను ఆదుకున్నాడు. భారత బౌలర్లలో ఆకాశ్‌ దీప్‌ 3.. సిరాజ్‌ 2 వికెట్లు తీయగా... అశ్విన్‌, జడేడా చెరో వికెట్‌ తీశారు.

 

ఆరంగేట్రంలోనే ఇరగదీసిన ఆకాశ్‌

రాంచీలో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో అరంగేట్ర బౌలర్‌ ఆకాశ్‌దీప్‌ అదరగొడుతున్నాడు. అద్భుతమైన బంతులతో ఇంగ్లాండ్‌ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. తొలుత క్రాలేను అద్భుతమైన బంతితో ఆకాశ్‌దీప్‌ బౌల్డ్‌ చేసినా అది నో బాల్‌ కావడంతో క్రాలే బతికిపోయాడు. అనంతరం ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన ఆకాశ్‌ దీప్‌... ఆ తర్వాతి ఓవర్‌లోనే మరో వికెట్‌ తీసి బ్రిటీష్‌ జట్టను కోలుకోలేని దెబ్బ తీశాడు. పదో ఓవర్లో డకెట్‌ను అవుట్‌ చేసిన ఆకాశ్‌... ఒక బంతి విరామం తర్వాత ఒలిపోప్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో బ్రిటీష్‌ జట్టు ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాతి ఓవర్‌లోనే క్రాలేను బౌల్డ్‌ చేసిన ఆకాశ్‌ ఇంగ్లాండ్‌ జట్టును కోలుకోలేని దెబ్బ తీశాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌ జట్టు 57 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది.

 

 అశ్విన్‌ అరుదైన రికార్డులు

రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో టీమిండియా బౌలర్లు చెలరేగారు. తొలి సెషన్‌లోనే అయిదు వికెట్లు నేలకూల్చి ఇంగ్లాండ్‌ను కష్టాల్లోకి నెట్టారు. అరంగేట్ర పేస‌ర్ ఆకాశ్ దీప్ మూడు వికెట్లతో నిప్పులు చెరిగాడు. ఆ త‌ర్వాత అశ్విన్, జ‌డేజా చెరో వికెట్‌ తీయడంతో ఇంగ్లాండ్‌ జట్టు పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. లంచ్‌కు ముందు ఓవ‌ర్లో కెప్టెన్ బెన్ స్టోక్స్‌ను జ‌డేజా ఎల్బీగా వెన‌క్కి పంపాడు. దాంతో 112 ప‌రుగుల వ‌ద్ద ఇంగ్లండ్ ఐదో వికెట్‌ ప‌డింది. మాజీ కెప్టెన్ జో రూట్ 16 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ అశ్విన్‌.. అరుదైన రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లాండ్‌పై టెస్టుల్లో 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో బెయిర్‌ స్టోను అవుట్‌ చేసి అశ్విన్‌ ఈ ఘనత సాధించాడు. 23 మ్యాచుల్లోనే ఈ స్టార్‌ స్పిన్నర్‌ వంద వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య టెస్టుల్లో 100 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా కూడా అశ్విన్‌ నిలిచాడు. అశ్విన్ కంటే ముందు జేమ్స్‌ అండర్సన్‌ భారత జట్టుపై 139 వికెట్లు తీసి టాప్‌లో ఉన్నాడు.