Yashasvi Jaiswal Hits Maiden 200: వైజాగ్‌ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో యశస్వి(Yashasvi Jaiswal) డబుల్‌ సెంచరీ సాధించాడు. నిన్నటి ఫామ్‌ను కొనసాగించిన యశస్వి ద్వి శతకాన్ని నమోదు చేసి రికార్డు సృష్టించాడు. సిక్సర్‌తో సెంచరీని అందుకున్న యశస్వి  జైస్వాల్‌... ఫోర్‌తో డబుల్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఈ క్రమంలో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. తక్కువ వయసులో ద్వి శతకం సాధించిన మూడో బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. యశస్వి కంటే ముందు వినోద్‌ కాంబ్లీ, సునీల్‌ గవాస్కర్‌ ఈ రికార్డును నమోదు చేశారు. యసశ్వి జైస్వాల్‌ ఒంటరి పోరాటంతో టీమిండియా నాలుగు వందల స్కోరు దిశగా పయనిస్తోంది. 

 

యశస్వీ పేరిట రికార్డులే రికార్డులు

వైజాగ్‌ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో యశస్వి జైస్వాల్‌ అద్భుత ఆటతీరుతో అపద్భాందువుడి పాత్ర పోషిస్తున్నాడు. అవతలి బ్యాటర్లు అర్థ శతకం చేసేందుకే కష్టాలు పడుతున్న వేళ... అజేయ ద్వి శతకంతో టీమిండియాను భారీ స్కోరు దిశగా తీసుకెళ్తున్నాడు. యశస్వి జైస్వాల్‌ ద్వి శతకంతో టీమిండియా ప్రస్తుతం 7 వికెట్ల నష్టానికి 383 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్‌ ఒంటరి పోరాటం చేస్తున్నాడు. 280 బంతులు ఎదుర్కొన్న జైస్వాల్...19 ఫోర్లు, 7 సిక్సులతో 207 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. జైస్వాల్‌కు తోడుగా కుల్‌దీప్‌ క్రీజులో ఉన్నాడు. యశస్వి మినహా మరే భారత బ్యాటర్‌ పెద్దగా రాణించలేదు. మిగిలిన భారత బ్యాటర్లలో ఏ ఒక్కరూ కనీసం అర్ధ శతకం కూడా సాధించలేక పోయారు. ఈ మ్యాచ్‌లో సిక్సర్‌తో సెంచరీ మార్క్‌ అందుకున్న జైస్వాల్‌ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

 

యశస్వి పేరిట అరుదైన రికార్డు

ఈ మ్యాచ్‌లో సిక్సర్‌ కొట్టి సెంచరీ పూర్తి చేసిన జైస్వాల్‌.. భారత్‌ తరఫున టెస్ట్‌ల్లో సిక్సర్‌తో సెంచరీ మార్కును అందుకున్న 16వ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. సిక్సర్‌తో సెంచరీ మార్కును తొలుత పాలీ ఉమ్రిగర్‌ అందుకోగా.. అత్యధిక సార్లు ఈ ఘనతను సాధించిన బ్యాటర్‌గా క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌ ఉన్నాడు. సచిన్‌ ఏకంగా ఆరు సార్లు సిక్సర్‌తో సెంచరీ మార్కును అందుకున్నాడు. సచిన్‌ తర్వాత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మూడు సార్లు ఇలా సెంచరీ మార్కును తాకాడు. మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌, కేఎల్‌ రాహుల్‌, రిషబ్‌ పంత్‌ తలో రెండు సార్లు సిక్సర్‌ కొట్టి సెంచరీ పూర్తి చేశారు. హర్భజన్‌ సింగ్‌, అశ్విన్‌ కూడా సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేశారు. వీరిద్దరూ తలో సారి ఇలా సెంచరీ మార్కును అందుకున్నారు. కపిల్‌ దేవ్‌, మొహమ్మద్‌ అజారుద్దీన్‌, రాహల్‌ ద్రవిడ్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌, ఎంఎస్‌ ధోని, పుజారా ఉన్నారు. సిక్సర్‌తో సెంచరీ మార్కును ఓసారి తాకిన సెహ్వాగ్‌.. డబుల్‌ సెంచరీ, ట్రిపుల్‌ సెంచరీ మార్కును కూడా సిక్సర్‌తో చేరుకుని చరిత్రపుటల్లోకెక్కాడు. 22 ఏళ్ల లెయశస్వి జైస్వాల్‌ అరుదైన జాబితాలో చోటు సంపాదించాడు. 23 ఏళ్ల వయసు కంటే ముందే విదేశీ, స్వదేశీ గడ్డపై టెస్టు సెంచరీ సాధించిన భారత నాలుగో క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. యశస్వి కంటే ముందు రవిశాస్త్రి, సచిన్‌ టెండుల్కర్‌, వినోద్‌ కాంబ్లి ఈ ఘనత సాధించారు.