మహిళల ఆసియా కప్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. అనంతరం శ్రీలంక 18.2 ఓవర్లలో 109 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బ్యాటింగ్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన జెమీమా రోడ్రిగ్జ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నారు.


అదరగొట్టిన భారత బౌలర్లు
151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూనే ఉంది. శ్రీలంక బ్యాటర్లలో హర్షిత మాధవి, హాసిని పెరీరా, ఒషాది రణసింఘే మినహా మరెవ్వరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. దీంతో శ్రీలంక 18.2 ఓవర్లలో 109 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో దయాళన్ హేమలత మూడు వికెట్లు తీసుకోగా, పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ రెండేసి వికెట్లు తీసుకున్నారు. రాధా యాదవ్‌కు ఒక వికెట్ దక్కింది.


జెమీమా రోడ్రిగ్జ్ షో
అంతకు ముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఓపెనర్ల వికెట్లను చాలా త్వరగా కోల్పోయింది. కేవలం 23 పరుగులకే స్మృతి మంథన (6: 7 బంతుల్లో, ఒక ఫోర్), షెఫాలీ వర్మ (10: 11 బంతుల్లో, ఒక ఫోర్) అవుట్ కావడంతో టీమిండియా కష్టాల్లో పడింది. అనంతరం జెమీమా రోడ్రిగ్జ్ (76: 53 బంతుల్లో, 11 ఫోర్లు, ఒక సిక్సర్), హర్మన్ ప్రీత్ కౌర్ (33: 30 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) భారత్‌ను ఆదుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 93 పరుగులు జోడించారు.


అయితే కీలక సమయంలో క్రీజులో కుదురుకున్న వీరిద్దరూ అవుట్ కావడం టీమిండియాను దెబ్బ తీసింది. దీంతో స్లాగ్ ఓవర్లలో స్కోరు వేగం తగ్గిపోయింది. ఒకదశలో 170 నుంచి 180కు వెళ్తుందనుకున్న స్కోరు 150 వద్దే ఆగిపోయింది. శ్రీలంక బౌలర్లలో ఒషాది రణసింఘే మూడు వికెట్లు తీయగా, సుగందిక కుమారి, ఆటపట్టు చెరో వికెట్ తీసుకున్నారు.