Women's T20: రెండో టీ 20 మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ కైవసం చేసుకోవాలనుకున్న భారత్‌(Bharat) ఆశలు నెరవేరలేదు. కీలకమైన రెండో టీ 20లో భారత్‌పై ఆస్ట్రేలియా(Austrelia) ఘన విజయం సాధించింది. సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కంగారులు.. సునాయస విజయం సాధించారు. తొలుత బాల్‌తో టీమిండియాను కట్టడి చేసిన ఆస్ట్రేలియా మహిళలు.. తర్వాత స్వల్ప లక్ష్యాన్ని మరో ఓవర్‌ మిగిలి ఉండగానే ఛేదించారు.

 

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా... భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. టీమిండియా నామామత్రపు స్కోర్‌కే పరిమితమైంది. ఆసీస్‌ బౌలర్లు రాణించడంతో భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు మాత్రమే చేసింది. రెండో ఓవర్‌లోనే షెఫాలీ వర్మ అవుటవ్వగా.. ఆ తర్వాత కూడా వరుసగా వికెట్ల పతనం కొనసాగింది. దీప్తి శర్మ (30) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. రిచా ఘోష్‌ (23), స్మృతి మంధన (23), జెమీమా రోడ్రిగెజ్‌ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఆసీస్‌ బౌలర్లలో జార్జీయా వేర్హమ్‌, అన్నాబెల్‌ సదర్‌ల్యాండ్‌, కిమ్‌ గార్త్‌ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ఆష్లే గార్డ్‌నర్‌ ఓ వికెట్‌ దక్కించుకుంది. 

 

ఆసిస్‌ సునాయసంగా

131 పరుగుల లక్ష్యఛేదనలో ఓపెనర్లు అలిసా హీలీ (26), బెత్ మూనీ (20) ఆస్ట్రేలియాకు శుభారంభం అందించారు. వీరిద్దరూ మొదటి వికెట్‌కు 51 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం వీరిద్దరినీ దీప్తి శర్మ వరుస ఓవర్లలో ఔట్ చేయడంతో భారత్‌ పోటీలోకి వచ్చింది. నిలకడగా ఆడిన తాహ్లియా మెక్‌గ్రాత్ (19)ని శ్రేయంక పాటిల్‌ వెనక్కి పంపింది. కాసేపటికే పుజా వస్త్రాకర్‌.. ఆష్లీన్‌ గార్డ్‌నర్‌ (7)ని ఔట్ చేసింది. ఆష్లీన్‌ వికెట్‌కీపర్‌ రిచా ఘోష్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరింది. దీంతో మ్యాచ్‌ కాస్త ఉత్కంఠగా మారినా.. ఎలిస్‌ పెర్రీ (34; 21 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), లిచ్‌ఫీల్డ్ (18; 12 బంతుల్లో 3 ఫోర్లు) దూకుడుగా ఆడటంతో ఆరు బంతులు మిగిలుండగానే ఆసీస్‌ విజయం సాధించింది. శ్రేయంక వేసిన 19 ఓవర్‌లో 17 పరుగులు వచ్చాయి. ఈ ఓవర్‌లో చివరి బంతికి పెర్రీ సిక్స్‌ బాది జట్టుకు విజయాన్ని అందించింది. సిరీస్‌ నిర్ణయాత్మక మూడో టీ20 మంగళవారం (జనవరి 9న) జరగనుంది.

 

మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్‌ తొలి టీ20లో విజయం సాధించింది. అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆసీస్‌ 3-0 తేడాతో క్లీన్‌ స్వీప్‌ చేయగా.. ఏకైక టెస్ట్‌లో భారత్‌ 8 వికెట్ల తేడాతో ఆసీస్‌ను చిత్తు చేసింది. ఆసీస్‌ ప్లేయర్‌ ఎలిస్‌ పెర్రీకి ఈ మ్యాచ్‌ 300వ అంతర్జాతీయ మ్యాచ్‌ కావడం విశేషం.

 

ఎలిస్‌ పెర్రీ అరుదైన ఘనత

ఎలిస్‌ పెర్రీ... అంతర్జాతీయ క్రికెట్లో ఓ సంచలనం.. నిఖార్సైన పేస్‌ బౌలింగ్‌, మిడిలార్డర్లో హిట్టింగ్‌తో మోస్ట్‌ ప్రామినెంట్‌ క్రికెటర్‌గా ఎదిగింది. 2007 నుంచి ఏకధాటిగా క్రికెట్ ఆడుతోన్న ఎలిస్‌ పెర్రీ... అరుదైన రికార్డు ముంగిట నిలిచింది. నేడు భారత్‌– -ఆస్ట్రేలియా మధ్య నవీ ముంబైలోని డాక్టర్‌ డీవై పాటిల్‌ స్టేడియం వేదికగా జరగాల్సి ఉన్న రెండో టీ20 పెర్రీ ఇంటర్నేషనల్‌ కెరీర్‌లో 300వ మ్యాచ్‌. మహిళల క్రికెట్‌ చరిత్రలో 300కుపైగా ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌లు ఆడినవారిలో ముగ్గురు క్రికెటర్లు మాత్రమే ఉన్నారు. నేటి మ్యాచ్‌తో పెర్రీ వాళ్ల సరసన చేరనుంది. ఆస్ట్రేలియా తరఫున 300 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన తొలి మహిళా క్రికెటర్‌గానూ ఎలిస్‌పెర్రీ చరిత్ర సృష్టించనుంది. ఉమెన్స్‌ క్రికెట్‌లో 300 ప్లస్‌ ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌లు ఆడిన వారిలో భారత్‌ నుంచి మాజీ సారథి మిథాలీ రాజ్‌ (333), ఇంగ్లండ్‌ దిగ్గజం చార్లెట్‌ ఎడ్వర్డ్స్‌ (309), కివీస్‌ మాజీ బ్యాటర్‌ సూజీ బేట్స్‌ (309)లు మాత్రమే ఉన్నారు. తాజాగా ఈ జాబితాలో పెర్రీ కూడా చేరనుంది. 2007లో క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పెర్రీ తన సుదీర్ఘ కెరీర్‌లో 12 టెస్టులు, 141 వన్డేలు, 146 టీ20లు ఆడింది. డజను టెస్టులాడిన పెర్రీ 21 ఇన్నింగ్స్‌లలో 925 పరుగులు, 141 వన్డేలలో 114 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్‌కు వచ్చి 3,852 పరుగులు చేసింది.