India vs Zimbabwe 4th T20I: యువ భారత్‌(Team India) సిరీస్‌ విజయంపై కన్నేసింది. జింబాబ్వే(ZIM)తో జరుగుతున్న అయిదు మ్యాచుల టీ 20 సిరీస్‌లో ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్న భారత జట్టు.. ఇవాళ జరిగే మ్యాచ్‌లోనూ విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. ఇవాళ జరిగే మ్యాచ్‌లో పసికూనను చిత్తు చేసి మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ కైవసం చేసుకోవాలని చూస్తోంది. అయితే ఈ మ్యాచ్‌లో రాణించాలని యువ ఆటగాళ్లు భావిస్తున్నారు. గత మ్యాచ్‌లో బాగా రాణించినా స్ట్రైకింగ్ రేట్‌ తక్కువగా ఉండడంపై విమర్శలు ఎదుర్కొన్న గిల్‌ ఈ మ్యాచ్‌లో ధాటిగా ఆడతాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. రెండో టీ 20లో మెరుపులు మెరిపించిన అభిషేక్‌ శర్మ.. మూడో టీ 20లో పది పరుగులకే పెవిలియన్‌ చేరాడు. ఈ మ్యాచ్‌లో మరో భారీ స్కోరుపై అభిషేక్‌ కన్నేశాడు. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ ఆర్డర్‌లో ఏమైనా మార్పులుంటాయేమో చూడాలి. గత మ్యాచ్‌లో గిల్‌- యసశ్వీ జైస్వాల్ టీమిండియా ఓపెనర్లుగా బరిలోకి దిగారు. ఈ మ్యాచ్‌లో జైస్వాల్‌ ఓపెనర్‌గా వస్తాడా లేక అభిషేక్‌కు మరోసారి ఓపెనర్‌ అవతారం ఎత్తిస్తారేమో చూడాలి.

 

జింబాబ్వే షాక్ ఇస్తుందా..?

హరారేలోని స్పోర్ట్స్ క్లబ్‌లో ఈ మ్యాచ్‌ జరగనుంది. జింబాబ్వే రెండో టీ 20లో వంద పరుగుల తేడాతో పరాజయం పాలైనా మూడో టీ 20లో కాస్త పోరాడింది. తొలి 

టీ 20లో గెలిచిన జింబాబ్వే.. మరో విజయం నమోదు చేసి టీమిండియాకు షాక్‌ ఇవ్వాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 2-2తో సమం చేయాలని పట్టుదలగా ఉంది. అలా చేస్తే ఈ సిరీస్‌ ఫలితం కీలకమైన అయిదో టీ 20 ఫలితంపై ఆధారపడుతుంది. రెండో టీ20లో 100 పరుగుల తేడాతో, 3వ టీ20లో 23 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించి మంచి ఫామ్‌లో ఉంది. ఈ జట్టును అడ్డుకోవడం జింబాబ్వేకు అంత తేలిక కాదు.  సికందర్ రజా జింబాబ్వేను సమర్థంగా నడిపిస్తున్నాడు. సికిందర్‌ సారథ్యంలో తొలి మ్యాచ్‌లో జింబాబ్వే 13 పరుగుల తేడాతో విజయం సాధించింది.

 

కీలక ఆటగాళ్లు వీరే

 టీమిండియా సారధి శుభ్‌మన్ గిల్ ఈ సిరీస్‌లో మంచి ఫామ్‌లో ఉన్నాడు. మూడో టీ 20లో అర్ధ శతకం సాధించాడు. తొలి టీ 20లోనూ పర్వాలేదనిపించాడు. ఈ మ్యాచ్‌లో భారీ ఇన్నింగ్స్‌పై గిల్‌ కన్నేశాడు. రుతురాజ్ గైక్వాడ్ మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు. జింబాబ్వేలో డియోన్ మైయర్స్ గత మ్యాచ్‌లో అద్భుత పోరాటంతో ఆకట్టుకున్నాడు. జింబాబ్వేను విజయతీరాలకు చేర్చడంలో విఫలమైనా తన పోరాటంతో ఆకట్టుకున్నాడు. రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, రింకూ సింగ్‌లపై భారీ అంచనాలు ఉన్నాయి. బౌలర్లలో రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్ మంచి ఫామ్‌లో ఉన్నారు. జింబాబ్వేలో వెస్లీ మాధేవెరే, ల్యూక్ జోంగ్వే, బ్రియాన్ బెన్నెట్ బ్యాట్‌తో ఆకట్టుకున్నారు. డియోన్ మేయర్స్ గత మ్యాచ్‌లో అర్ధశతకం సాధించాడు. 

 

భారత జట్టు: శుభమన్ గిల్ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, సంజు శాంసన్, శివమ్ దూబే, రింకు సింగ్, రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, ముఖేష్ కుమార్ , తుషార్ దేశ్‌పాండే.

 

జింబాబ్వే జట్టు: సికందర్ రజా (కెప్టెన్‌), వెస్లీ మాధేవెరే, ఇన్నోసెంట్ కైయా, బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, జోనాథన్ క్యాంప్‌బెల్, క్లైవ్ మదాండే, వెల్లింగ్టన్ మసకద్జా, ల్యూక్ జోంగ్వే, బ్లెస్సింగ్ ముజరబానీ, టెండై చతారా, బ్రాండన్ మవుతా, తడివానాష్ మర్రామ్, తడివానాష్ మర్రామ్ .