వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు ఓ మోస్తరు స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. దీంతో వెస్టిండీస్ విజయానికి 120 బంతుల్లో 153 పరుగులు అవసరం అవుతుంది. భారత బ్యాటర్లలో తిలక్ వర్మ (51: 41 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్) అర్థ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వెస్టిండీస్ బౌలర్లలో అకియల్ హొస్సేన్, అల్జారీ జోసెఫ్, రొమారియో షెపర్డ్ రెండేసి వికెట్లు తీసుకున్నారు.


తిలక్ వర్మ సూపర్ 50...
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ టీమిండియాకు ప్రారంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. క్రీజులో ఉన్నంత సేపు ఇబ్బంది పడ్డ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (7: 9 బంతుల్లో, ఒక సిక్సర్) ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. అల్జారీ జోసెఫ్ బౌలింగ్‌లో హెట్‌మేయర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అనంతరం సూర్యకుమార్ యాదవ్ (1: 3 బంతుల్లో) కూడా త్వరగా అవుటయ్యాడు. దీంతో భారత్ 18 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.


ఫాంలో ఉన్న తిలక్ వర్మ (51: 41 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్) పరిస్థితికి తగ్గట్లు ఆచితూచి ఆడాడు. పిచ్ నిదానంగా ఉండటంతో పరుగులు సాధించడం కష్టమైంది. మరో ఎండ్‌లో ఇషాన్ కిషన్ (27: 23 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు) తనకు చక్కటి సహకారం అందించాడు. ఇషాన్ కిషన్, తిలక్ వర్మ మూడో వికెట్‌కు 42 పరుగులు జోడించారు. అనంతరం రొమారియో షెపర్డ్ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్లో ఇషాన్ కిషన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో ఈ భాగస్వామ్యం విడిపోయింది. తర్వాత వచ్చిన సంజు శామ్సన్ (7: 7 బంతుల్లో, ఒక ఫోర్) ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. కేవలం ఏడు పరుగులు మాత్రమే చేసి అకియల్ హోస్సేన్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు.


అనంతరం తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (24: 18 బంతుల్లో, రెండు సిక్సర్లు) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీరు ఐదో వికెట్‌కు 38 పరుగులు జోడించారు. ఈ లోపు తిలక్ వర్మ తన అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే అర్థ సెంచరీ అయిన వెంటనే తిలక్ అవుట్ కావడం భారత్‌ను గట్టి దెబ్బ కొట్టింది. చివరి వరుస బ్యాటర్లు కాస్త వేగంగా ఆడటంతో భారత్ 150 పరుగుల మార్కును దాటింది. 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 152 పరుగులు సాధించింది. వెస్టిండీస్ బౌలర్లలో అకియల్ హొస్సేన్, అల్జారీ జోసెఫ్, రొమారియో షెపర్డ్ రెండేసి వికెట్లు దక్కించుకున్నారు.


వెస్టిండీస్ తుది జట్టు
కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, జాన్సన్ చార్లెస్ (వికెట్ కీపర్), నికోలస్ పూరన్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మాన్ పావెల్ (కెప్టెన్), జాసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్‌కాయ్


భారత్ తుది జట్టు
శుభమన్ గిల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సంజు శామ్సన్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్